Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 21

కొద్దినిమిషాల తర్వాత కిందికి దిగింది హెలికాప్టర్. అప్పటిదాకా గాలిలో మరో హెలికాప్టర్ లో నుంచి ఆ దృశ్యాలని చిత్రికరించాడు కెమెరామేన్ ఆదిత్య.
కిశోర్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు డైరెక్టర్ రఘుతిలక్.
"భయపడ్డావా కిశోర్?" అన్నాడు ఆదరంగా.
మొహానికి పట్టిన చెమట తుడుచుకుని నవ్వాడు కిశోర్. "ఎందుకు సార్ భయం ? నేను ఇలాంటి వాటికి భయపడే రకాన్ని కాను."
కానీ మరుక్షణంలోనే ఆలోయ అంతా ప్రతిద్వనించేటంత పెద్దగా కేకపెట్టాడు కిశోర్. గజగజ వణుకుతున్నాడు అతను.
అందరూ ఆదుర్దాగా అతనివైపు చూశారు.
కిశోర్ కాళ్ళ దగ్గర ఒక ఆస్థిపంజరం పడి వుంది. చూడకుండా దానిమీద కాలు వేశాడు కిశోర్. ఆస్థిపంజరం రొమ్ము ఎముకలు పటపట విరిగాయి. ఆ ఎముకల మధ్య ఇరుక్కుపోయింది కిశోర్ కాలు.
"మైగాడ్" అన్నాడు కిశోర్ మళ్ళీ. అంటూ భయోత్పాతంతో చుట్టూ చూశాడు.
ఎటుచూసినా ఎముకలు కనబడుతున్నాయి అక్కడ గుట్టలు గుట్టలుగా.

                                                 * * *
అక్కడ......
కొండను తొలిచి చేసిన రాతి సింహాసనం లాంటి దానిమీద కూర్చుని వున్నాడు మంత్రాల మల్లయ్య. వందేళ్ళకి పైగానే వుండవచ్చు అతని వయస్సు. ముడతలు ముడతలు పడిపోయి వుంది అతని మొహం అంతా.
కింద వరసగా నిలబడి వున్నారు నాయకుడు, హరీన్, కరుణా - మరో వైపున దేశింగ్, చిక్ లీ నిలబడి వున్నారు.
"ఏమిటి విషయం?" అన్నాడు మంత్రాల మల్లయ్య.
ముందుకు వచ్చి అంతా వివరించాడు దేశింగ్.
అప్పుడు అంది చిక్ లీ, "కులగురువు దగ్గర నుంచి న్యాయం కోరుతోంది ఈ చిక్ లీ. నాకూ, జింబురూకీ నిశ్చితార్ధం చేశాడు నాయకుడు. ఇప్పుడు జింబురూ తను జింబురూనే కాదంటున్నాడు. అతనివి మాయ మాటనీ, ఆ పట్నం పిల్ల మోజులోపడి అతను అలా బుకాయిస్తున్నాడనీ అంటున్నాను నేను.......నాకు జింబురూ తో వివాహం జరిపించాలి - అదే కోరేది" అంది చిక్ లీ.
అది విని నిర్లిప్తంగా నవ్వాడు మంత్రాల మల్లయ్య.
"అనుభవశూన్యమైన పలుకులు పలుకుతోంది ఈ బిడ్డ. ఒకవైపు నాయకుడు వృద్దమాత మరణించింది. ఆమె భౌతికకాయం పాడయిపోకుండా పసర్లుపూసి భద్రపరిచాం. ముప్ఫైరోజులు గడిచేదాకా ఆ వృద్దురాలి శరీరాన్ని కొండకొమ్ము మీద వుంచి నిశ్శబ్దనృత్యం చెయ్యాలి రాత్రింబవళ్ళు.
"ముప్పయ్యోరోజున, మన తొలి పూర్వీకుడు పక్షి రూపంలో వచ్చి ఆమె శరీరాన్ని భక్షించి ఆమెకు ఉత్తమగతులు ప్రసాదిస్తాడు. ఆ తర్వాత ఆమె అస్థికలను అక్షింతలుగా మనమీద చల్లుతాడు.
ఆ తర్వాతనే శుభకార్యాలు తలపెట్టాలి మనం"
"అప్పతిదాకా అన్నీ అశుభగడియలే మనకి. పెళ్ళి మాటలు తలపెట్టకూడదు . ఆ తర్వాతే నా తీర్పు" అన్నాడు.
వింటున్న దేశింగ్ పెదిమల మీద సన్నటి చిరునవ్వు మెదిలింది. మంత్రాల మల్లయ్య తన పక్షమే. కానీ తీర్పు వెంటనే తన పక్షాన చెబితే అది పక్షపాతంగా కనబడవచ్చు కొందరికి. అందుకని పరిస్థితులని తనకి అనువుగా మార్చుకోడానికి ఒక నెల వ్యవధి ఇస్తున్నాడు కులగురువు.
ఈ నెల రోజులపాటూ నాయకుడు ముద్దాయి స్థానంలో వుండవలసి వస్తుంది. మనసులో ఇంతవరకూ అతని మీద సదభిప్రాయం వున్న వాళ్ళకి అది తొలగిపోవచ్చు. దురభిప్రాయం లేనివాళ్ళకి కూడా దురభిప్రాయం కలగవచ్చు. కలిగేటట్లు తను చేస్తాడు. దానికి సమయం ఇచ్చాడు మంత్రాల మల్లయ్య.
అమోఘమైన వ్యూహం ఇది.
మరికొద్దిసేపటి తర్వాత, ముసలమ్మ శరీరాన్ని కొండకొమ్ముకే చేర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.
జరుగుతున్నదానిదంతా జాగ్రత్తగా గమనిస్తున్నాడు హరీన్.
బేలగా అతనివైపే చూస్తోంది కరుణ.

                                                                    18

హాస్పిటల్లో వున్న ప్రముఖ నిర్మాత రఘుపతిని చూడటానికి అసంఖ్యాకంగా వస్తున్నారు సినీప్రముఖులు, సాటి నిర్మాతలు,  డిస్ట్రిబ్యూటర్స్, హీరోలు, హీరోయిన్లు, ఎగ్జిబిటర్లు, రఘుపతికి పెద్ద ప్రమాదమేమీ లేదనీ తెలుసు అందరికీ. కానీ అయన హాస్పిటల్లో నుంచి డిశ్చార్జి అయివచ్చే లోపల ఒకసారి అక్కడ అటెండెన్స్ వేయించుకుని , అయన దృష్టిలో పడాలన్న కోర్కెతో వస్తున్నారు చాలామంది.
ఆకాశంలో నుంచి తారలు రాలిపడుతున్నంత ఎగ్జయిటింగ్ గా వుంది - ఆ హాస్పిటల్ లో వున్న వార్డు బాయిస్ కీ, తడుతరులకీ - అక్కడికి వస్తున్న తమ ఫేవరేట్ స్టార్స్ ని చూస్తుంటే.
కారిడార్లో నిలబడి 'అదిగో  - అతను ఫలానా , ...........'అదిగో ! ఆమె ఫలానా!' అని ఉత్సుకతతో చెప్పుకుంటున్నారు ఇద్దరూ వార్డు బాయిస్.
ఖరీదైన కార్లో నుంచి దిగి, స్పైక్ హీల్స్ టకటకలాడించుకుంటూ చలవ కళ్ళద్దాలు పెట్టుకుని, తల ఆకాశంలోకి చూస్తున్నట్లు ఎత్తి గర్వంగా వస్తున్న ఒకామె ఎవరో వాళ్ళిద్దరికీ అంతుపట్టలేదు.
"ఎవరో టామిల్ హీరోయిన్ అయుంటుందిరా" అన్నాడు ఒకతను.
"నీ మొహం .......హీందీ హీరోయిన్ అయుండాలి" అన్నాడు రెండో అతను.
అప్పుడే అటువచ్చిన నర్సు వాళ్ళ మాటలు విని నవ్వింది.
"మీ ఇద్దరూ తప్పే - ఆమె అసలు సినీస్టార్ కాదు! విశ్వనాధం అనే పేషెంటు భార్య" అంది.
అదివిని విస్తుబోయారు వార్డు బాయిస్. నర్సు వెళ్ళిపోయాక ఒకతను రెండో అతనితో అన్నాడు ఎకసెక్కంగా , "ముసలోడికి దసరా పండగ అంటే ఇదేరా బాబూ!"
ఇద్దరూ నవ్వుకున్నారు.
వన్నెల విసనకర్రలా అలంకరించుకుని, చాలా హెవీగా మేకప్ చేసుకువచ్చిన ప్రియంవదని చూడగానే విశ్వనాధం వంటిమీద తేళ్ళు జెర్రులు పాకినట్లయింది.
భర్త హాస్పిటల్లో వుంది బాధపడుతున్నాడన్న జ్ఞానం ఈషన్మత్రం అన్నా వుందా ఈమెకి.
అతని దృష్టి ప్రియంవద వెనకాతల నిలబడి వున్న మరో వ్యక్తీ మీద పడింది. నల్లగా వున్నాడు అతను. నల్లకోటు వేసుకున్నాడు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని వున్నాడు.
అతనెవరో తెలుసు విశ్వనాధానికి. అతను తమ ఫామిలి లాయరు భుజంగరావు.
భుజంగరావు ఎందుకు వచ్చాడు ఇక్కడికి?
అతను వచ్చాడా? ప్రియంవదే తిసుకువచ్చిందా?
విశ్వనాధం కళ్ళలో మెదులుతున్న భావాలని కనిపెట్టేసి అంది ప్రియంవద - "నేను మిమ్మల్ని చూడటానికి వస్తుంటే లాయరుగారు కూడా మిమ్మల్ని పరామర్శించాలని వచ్చారు. ఎలా వుంది మీకు?"
"కనబడటం లేదా? ట్యుబులూ, వైర్లు, బరువులూ ఇన్ని తగిలించారు నాకు. వింత పశువులాగా లేనూ?"
అతని బాధని అర్ధం చేసుకోకుండా , అదేదో జోకయినట్లు పెద్దగా నవ్వింది ప్రియంవద.
లాయరుకూడా యధాలాపంగా , అంటీ ముట్టకుండా ఒకటీ రెండు కుశల ప్రశ్నలు అడిగాడు విశ్వనాధాన్ని.
ఆ తర్వాత ప్రియంవద అందుకుంది. "మీరు పెట్టిన కంపెనీలకు చెందిన అస్తులేవీ, మీ పేరుమీద వున్న అస్తులేవీ, బినామీ పేర్లతో అస్తులేవీ - అని నన్ను అడుగుతున్నారు లాయరుగారు. నన్నడిగితే నాకేం తెలుస్తుంది. అవన్నీ మావారినే అడగండీ, అయన చెబుతారూ అన్నాను. ఆయనకి కావలసిన సమాచారం ఏదో మీరే చెప్పాలి."

 Previous Page Next Page