కోడలు స్పీడ్ గా వెళ్ళడాన్ని మరోలా అర్థం చేసుకుంది అనసూయమ్మ. సంవత్సరం తరువాత మొగుడ్ని చేరుకోవాలనే ఆరాటం అటువంటిదని ముసిముసిగా నవ్వుకుంది ఆమె.
మనవడ్ని నిద్రపుచ్చి, వాడి పక్కనే చాప పరుచుకుని పడుకుంది ఆమె.
డాబామీదకు వెళ్ళిన ప్రసూన ఆ దృశ్యం చూసి క్షణంపాటు తొట్రు పడింది.
సుందరబాబు సిగరెట్ తాగుతున్నాడు. మొదటిసారి అతను సిగరెట్ కాల్చడం చూసి ఆమెకు మరింత భయం వేసింది. అతను తనకు దూరమవుతున్నాడని అర్థమవుతూ వుంది ఆమెకు ఆ వూహే భరించలేకుండా వుంది. అతని పక్కకు చేరి "ఏమండీ" అని మృదువుగా పిలిచింది.
ఏదో ఆలోచిస్తున్న సుందరబాబు చివుక్కున తలతిప్పి ఏమిటన్నట్టు చూశాడు.
"మీరు అదో విధంగా వుంటున్నారు. కారణం ఏమిటో చెబుతారా? మీరు అలా వుంటే నాకు భయంగా వుందండీ" అంది. అప్పటికే ఆమె ఏడుస్తున్నట్లు అర్థమైంది అతనికి.
దాంతో కదిలిపోయాడు అతను. "ఏమీ లేదు ప్రసూనా. సంవత్సరం రోజుల పాటు దూరంగా వున్నాను కదా, అందుకే ఆరోగ్యం కాస్త చెడినట్టుంది. అంతకు మించి ఏమీ లేదు. నువ్వు భయపడడం అనవసరం" అన్నాడు బుజ్జగింపుగా.
అతను అలా అన్నా అతను చెప్పకుండా ఏదో దాస్తున్నట్లు ఆమెకు తెలుస్తూనే వుంది.
తప్పుచేసిన వ్యక్తి ఎదుటివాళ్ళకు తను చేసిన పని తెలిసిపోయినట్టు గిల్టీగా ఫీలవుతాడు. ప్రస్తుతం ప్రసూన పరిస్థితి కూడా అదే. తను చేసిన తప్పు అతను కనిపెట్టేసినట్టు ఆమె గిలగిల్లాడిపోతోంది.
ఆ తప్పుకు తగిన శిక్షపడే వరకు ఆమెకు మనశ్శాంతి వుండదు.
జరిగిందంతా చెప్పేద్దామన్న వత్తిడి ఆమెలో. కానీ దాన్ని ఎలా ప్రారంభించాలో ఆమెకు తెలియడం లేదు. అందులోనూ అతి సున్నితమైన విషయం కావడంతో ఆమె చెప్పలేకపోతోంది.
అతను బయటపడి అడిగేస్తే చెప్పేద్దామని వుంది ఆమెకు.
కానీ తను అనవసరంగా భయపడుతున్నానేమో అని కూడా అనిపిస్తోంది ఆమెకు. తను చేసిన తప్పు తన తల్లికి, అవధూతకు తప్ప మరొకరికి తెలియదని స్పష్టంగా తెలుసు ఆమెకు. తెలియని విషయాన్ని బయటపెట్టి మరో తప్పు చేయకూడదని నిర్ణయించుకుంది. అన్నిటికీ ఆ భగవంతుడున్నాడనుకుని కిందకు దిగడానికి అడుగు వేసింది.
సుందరబాబు తనను వెనక్కు రమ్మని పిలుస్తాడని వూహించింది కానీ అతను పిలవలేదు.
మౌనంగా మెట్లు దిగి కిందకు వచ్చింది.
ఏ పాపమూ తెలియని పిల్లవాడూ, అనసూయమ్మ గాఢంగా నిద్రపోతున్నారు.
రోజులు గడుస్తున్నాయి. ప్రసూన, సుందరబాబు సంబంధంలో ఏ మార్పూ లేదు. అతను ఇంటి పట్టున తక్కువ వుంటున్నాడు. ఎదో అవసరమైతే తప్ప ప్రసూనతో మాట్లాడడం లేదు. కల్పించుకుని మాట్లాడదామని వున్నా అంత సాహసం చేయలేకపోతోంది ప్రసూన.
బాబును ఎప్పుడూ ఎత్తుకోవడం లేదతను. ఎప్పుడైనా "హాయ్ బుజ్జీ" అని బాబు బుగ్గమీద చిటిక వేస్తున్నాడంతే.
తను చేసిన తప్పు నిజంగా అతనికి తెలిస్తే ఆ బాబుతో ఆ మాత్రం చనువుగా అయినా వుండడనుకుంది ప్రసూన. మరెందుకు అతను మూడీగా వున్నాడో అర్థం కాలేదామెకు.
అతని ప్రవర్తనలో మాత్రం చాలా మార్పు వచ్చింది. సిగరెట్లు విపరీతంగా కాలుస్తున్నాడు. ఇంతకు ముందులా సరదాగా లేడు. గెడ్డం గీసుకోవడం కూడా మానేశాడు. బక్కపల్చగా తయారయ్యాడు. పండరి భజనల దగ్గరకు కూడా వెళ్ళడం లేదు. హార్మోనియాన్ని తాకి సంవత్సరం పైన అవుతోంది.
ఎందుకతనిలో అంత మార్పు వచ్చిందని అందరూ బుగ్గలు నొక్కు కుంటున్నారు. తన కొడుకు ఏదో మానసికంగా బాధపడుతున్నాడని గ్రహించింది అనసూయమ్మ.
"ఈ మధ్య నిన్ను గమనిస్తున్నాను. ఎందుకలా వుంటున్నావ్ ? ఎప్పుడూ లేనిది సిగరెట్టు కూడా కాలుస్తున్నావ్. కోడలు పిల్లతో సరిగా మాట్లాడడంలేదు. ఎం జరిగింది" అని ఎన్నోసార్లు కొడుకుని నిలేసి అడిగింది అనసూయమ్మ.
"ఏమీ లేదే" అని ముక్తసరిగా సమాధానం చెప్పి తప్పుకుంటున్నాడు.
ప్రసూన పరిస్థితి మరీ ఘోరంగా వుంది. చేసిన తప్పు ఆమెను నిలువునా కాల్చేస్తోంది. ఎవరికీ చెప్పుకోలేని బాధ ఆమెది. తను ఏ సమయంలో ఆ తప్పు చేశానో చెప్పుకోవాలనుంది సుందరబాబుకు. అంతా చెప్పి క్షమించమని వేడుకోవాలనుంది. అందుకు అవకాశం కొద్దిగా వచ్చినా ఆమె అంతా చెప్పేసి వుండేది. అయితే ఆ అవకాశాన్ని సుందరబాబు ఆమెకు ఇవ్వలేదు.
ఆమె లోలోపలే క్రుంగి కృశించిపోతోంది.
తను చేసిన తప్పుకు సాక్ష్యంగా నిలిచినా బాబును చూస్తే ఒక రకమైన ద్వేషం కలుగుతోంది. అంతలోనే తనకు తాను ధైర్యం చెప్పుకుంటోంది. తను చేసిన తప్పు సుందరబాబుకు తెలిసే అవకాశం లేదని ఆమె గట్టి నమ్మకం. మరి ఏ కారణం చేత తన భర్త క్రుంగిపోతున్నాడో ఆమెకు అంతుబట్టడం లేదు. జాతేగావ్ లో ఏమైనా జరిగిందా అన్నది ఆమె అనుమానం.
ఇక ఊరుకుంటే తన భర్త తనకు దక్కడన్నది ఆమెకు తెలిసిపోతోంది. ఏదైనా చేసి ఈ సమస్యను విడగొట్టదలుచుకుంది ఆమె.
ఆ ప్రయత్నాలు ప్రారంభించింది.
సుందరబాబుతో పాటు కాంట్రాక్ట్ చేయడానికి వెళ్లిన సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్లింది.
తన భర్త పరిస్థితి అంతా చెప్పింది.
11
"జాతేగావ్ వచ్చినప్పట్నించి ఆయన చాలా మారిపోయారు. నన్ను గానీ, కొడుకును గానీ పలకరించడంలేదు. ఏ పనిమీదా శ్రద్ధ చూపించడం లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచనలో వుంటాడు. వ్యవసాయం ముగించేశాడు. కాంట్రాక్టు పనులను కట్టబెట్టేశాడు. హార్మోనియం ముట్టుకోలేక పోవడంతో అది బూజు పట్టింది. మరీ బలవంతం చేస్తే ఏదో రెండు మూడు మాటలు మాట్లాడడం తప్ప ఒక్క వాక్యం కూడా పూర్తిగా మాట్లాడడంలేదు. అక్కడ ఏమైనా జరిగిందా?" అని అడిగింది.
సుబ్బారెడ్డి చాలా ఆలోచించాక "నాకు తెలిసి సుందరబాబును అంతగా కదిలించే సంఘటన ఏం జరగలేదు. మొదట బాగానే వుండేవాడు. మేం వెళ్ళిన నాలుగైదు నెలలకనుకుంటాను ఓసారి ఔరంగాబాద్ వెళ్ళాడు ఏదో పనుందని చెప్పి వెళ్ళినవాడు వారంరోజుల తరువాత వచ్చాడు. అప్పట్నుంచి అదో విధంగా వుండేవాడు. అప్పటికీ నేను రెండు మూడు సార్లు అడిగాను కూడా. ఏమీ చెప్పలేదు. ఆ తరువాత నేను అడగడం మానేశాను! ఇంటిమీది ధ్యాసలో అలా వున్నాడని అనుకున్నాను. పనిలో మాత్రం యాక్టివ్ గానే వుండేవాడు." అని ముగించాడు.