ఈ విధంగానే విషాదఘట్టంలోకూడా కవి వృత్తం మార్చి వేశాడు; ముత్యాల సరాలు వాడాడు. సందర్భానుసారంగా ఔచితిని అనుసరించి వృత్తం మారుస్తూ వచ్చిన ప్రతిభను కొనియాడవలసిందే.
పాంచాలి చెప్పిన ఈ క్రింది పద్యము చూడండి. ఎంత సొంపుగా ఉన్నదో - ఎంతటి సమయోచితంగా ఉన్నదో -
"భారతవీరమాత" యగు భాగ్యము ప్రాప్తిలు అత్తగారి కం
చూరక చూచి చూడనటు లుంటిమీ; ఆమెకు దక్కకున్న ఆ
గౌరవలక్ష్మి లభ్యమగుగాక కుమారుల గన్న మా హిడిం
బా రమణీలలామకు! సుభద్రకు ఈ ద్రుపదాత్మజాతకున్!
ఈ కావ్యంలో చాల ఉన్నాయి యిటువంటి ముచ్చటైన పద్యాలు. ఇదొకటి -
రారా జెవ్వడు రాజ్యమేలగ? నపార స్ఫార దోస్సార మే
పారన్ రాజుల నాజులన్ గెలిచి, నా డాసేతుశీతాచల
క్ష్మారాజ్యమ్మును పాండురాజు వెలయింపన్, నేడిటుల్ కొల్వుసిం
గారమ్మై కుడువంగ బుట్టిరి దొరల్ గాంధారి గర్భమ్మునన్!!
మొత్తం మీద రసగ్రహణపారీణులైన పాఠకులకు ఆనందదాయకమైన కావ్యమిది. కొందరు ఈ కావ్యములోని పద్యముల తీర్పులో కొన్నిట మార్పు అభిలషణీయమని అంటే అనవచ్చును. కాని దోషజ్ఞుల విమర్శకు గురికాని కవులూ లేరు; కావ్యాలూ లేవు. అయితే రసజ్ఞులైనవారు కవి ప్రతిభనే, ప్రజ్ఞనే గమనించి రసగ్రహణమే చేస్తారు.
శ్రీ పాపయ్య శాస్త్రిగారు ముందు ముందు ఇంకా గొప్ప కావ్యాలు వ్రాసి ఆంధ్రభాషయోష నలంకరించి యశస్సు సంపాదింతురుగాక అని కోరుతున్నాను.
* * *
కృతి సమర్పణం
ప్రియమిత్రుడు, సహృదయుడు
శ్రీ ఆదిపూడి శ్రీకృష్ణమూర్తికి
పచ్చని పంటచేల పయిపై పరువెత్తెడి పైరుగాలితో
ముచ్చటలాడుచున్ హృదయముల్ పులకింపగ, నాడు కోతికొ
మ్మచ్చుల నాడుకొన్న మనమైత్రి క్రమ్మముగ వృద్ధిజెందుచున్
వచ్చి, హిమాలయాగ్రములపై నిలిపెన్ మన సౌహృదమ్ములన్!
చల్లగ -మెల్లగా - కరగి సాగిన ఈ యమునా స్రవంతిలో
వెల్లువగొన్న సౌమనసవేదన రాగము దిద్దుకొన్న ఏ
పిల్లనగ్రోవి మోవి మురిపించెనొ! నీ హృదయంబు నిండు జా
బిల్లివలెన్ ద్రవించి కురిపించిన దీ నవసౌధదీధితుల్!
ఓయి స్వతంత్రతాప్రియ! మహోదయ! నా "విజయారుణారుణ
శ్రీ" యిది; స్వీకరింపుము విశృంఖల హస్తములన్; వినూతన
చ్చాయలు దిద్దు నింక మన సౌహృదలక్ష్మికి వీరభారతా
మ్నాయ విరాట్ కిరీట సుషమా సుమనోజ్ఞము లీ ప్రభాతముల్!
విజయశ్రీ రజతోత్సవం
భారతం పాఠం చెప్పేనాడే వీరాధివీరుడైన విజయుడి మీద విశేషమైన ఆదరమూ అభిమానమూ కలిగించారు గురుదేవులు కుప్పా శ్రీ ఆంజనేయశాస్త్రిగారు.
ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పనిచేస్తున్న రోజుల్లో ఒకనాడు నాలో ప్రతిధ్వనించిన "ఆత డజాతశత్రుడు, మహాత్ముడు, శాంత తపస్వి, విశ్వవిఖ్యాతుడు" అన్న హృదయస్పందనాన్ని గుర్తించి ఆ రాత్రే "విజయశ్రీ"కి అంకురార్పణ జరిపించారు పూజ్యమిత్రులు డాక్టర్ నండూరి రామకృష్ణచార్య.
ఆనాడు ఆంధ్రవారపత్రికల్లో భారతుల్లో ఆ వ్యాసాల బింకమూ ఆ మీసాల పొంకమూ చూచి ఏ సాహితీమూర్తి సౌజన్యసౌహార్దాల కోసం ఉవ్విళ్ళూరేవాడినో, ఈనాడు నా అదృష్టంకొద్దీ ఆ సారస్వత తపస్వి, ఆ మహనీయ యశస్వి, ఆ మధుర మంజుల వచస్వి శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు ఈ కావ్యానికి సువిస్తరమైన ప్రస్తావన వ్రాసిపెట్టారు.
అనురాగంతోనూ అభిమానంతోనూ ఇచ్చిన ఈ కావ్యోపహారాన్ని హృదయ పూర్వకంగా స్వీకరించాడు ప్రియవయస్యుడు ఎ.ఎస్.కృష్ణ.
అక్కడక్కడా చక్కని సలహా లిచ్చి సముచితమైన సహాయం చేశాడు అభ్యుదయ మిత్రుడు మా ప్రయాగ కోదండరామశాస్త్రి.
ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం వారు "విజయశ్రీ"ని పాఠ్యగ్రంథంగా స్వీకరించి విద్యార్ధులలో విశేష ప్రచారం చేకూర్చారు.
విజయశ్రీలోని పద్యాలను కంఠస్థం కావించిన విద్వన్మణులున్నారు. నటశిరోమణులున్నారు. కథాగాయకులున్నారు. పౌరాణిక చక్రవర్తులున్నారు. అధ్యాపక సోదరులున్నారు.
మనుష్యులకు వలెనే కావ్యాలకు కూడా అవి పునర్ముద్రణం పొందినా పొందకపోయినా ఇరవై అయిదేండ్లు నిండగానే రజతోత్సవమూ, ఏభైయేండ్లు నిండగానే స్వర్ణోత్సవమూ జరపటం లోకంలో ఆచారంగా ఉంది. కాని ఇరవై ఐదు ముద్రణలు నిండినప్పుడు రజతోత్సవమూ ఏభై ముద్రణలు పూర్తి అయినప్పుడు స్వర్ణోత్సవమూ జరపటం సముచితమూ సమంజసమూ అని నా అభిప్రాయం.
విజయశ్రీ కావ్యానీకిది ఇరవై ఎనిమిదో ముద్రణం. ఐనా దీనిని రజతోత్సవ ముద్రణం అనే వ్యవహరించటం జరిగింది.
ఈ విజయశ్రీ రజతోత్సవ సమారంభ సంరంభంలో అందరికీ వందనాలూ అభినందనాలూ.
నా కృతులన్నింటినీ అక్షరాకృతులుగా దిద్దితీర్చటంలో అత్యంత శ్రద్ధాసక్తులతో నిరంతరం కృషిచేస్తున్న మా చిరంజీవి డాక్టర్ జయకృష్ణ బాపూజీకి నా ఆశీర్వాదాలు.
ఈ విజయదశమి శుభసమయంలో నా "విజయశ్రీ" రజతోత్సవ ముద్రణపత్రిని సహృదయుల కరకమలాలలో ఉంచుతున్నాను.
మీ
కరుణశ్రీ
కురుక్షేత్రం
జీవితమే ఒక చిత్రమైన కురుక్షేత్రం. ఈ రణరంగంలో అస్తికీ నాస్తికీ, శాంతికీ అశాంతికీ, ధర్మానికీ అధర్మానికీ, న్యాయానికీ అన్యాయానికీ అహరహమూ - అనుక్షణమూ - సంకుల సంగ్రామం సాగుతూనే వుంటుంది.
ఒకప్రక్క స్వాతంత్ర్యకాంక్ష నాలుకలు చాచుకొని ఆవేశంతో అనర్గళంగా ముందుకు తోసుకునివస్తూవుంటే మరో ప్రక్క స్వార్ధ పరత్వం నిరంకుశంగా బిర్రబిగిసి విర్రవీగుతూ ఇనుప తలుపులు బిగించుక్కూర్చుంటుంది.
అధర్మం ధర్మంమీద విజృంభించింది. రారాజు అత్యాచారాలు ఆరోజు కారోజుకు మేరమీరాయి. కర్రలతో బాధించాడు; కత్తులతో పొడిపించాడు; కాళ్ళు చేతులు బంధించి కారాగారాలలో త్రోయించాడు; అన్నంలో కాలకూటం కలిపించాడు; రహస్యంగా కొమ్పలకు నిప్పు పెట్టించాడు; మసిపూసి మాయపాచికలు వేసి రాజ్యం కాజేసి పాండవుల్ని అరణ్యాలకు పంపించాడు. పాంచాలిని పరబహవించడంకోసం పైకిలేచిన దిష్ట దుశ్శాసనహస్తాలు పరమ పైశాచిక ప్రభుత్వానికి ప్రత్యక్ష నిదర్శనాలు.
వనవాసాలు నడచినవి; అజ్ఞాతవాసాలు గడచినవి; సంధులూ సంప్రదింపులూ విఫలమైనవి; పాండవపరిషత్తు సమావేశమయింది; కర్తవ్యం నిశ్చితమయింది.
అవిగో! పాంచాలీ కచాంచలాలు రేగుతున్నవి - పాంచజన్య దేవదత్తాలు మ్రోగుతున్నవి - భీమగదాదండం ప్రతిపక్ష వక్షోరంగాలపై ప్రళయతాండవం చేయడానికి సాగుతున్నది.
అడుగో! భారతవీరుడు పార్ధుడు. గాండీవాన్ని ఎక్కుపెడుతున్నాడు. మహాత్ముడు మధుసూదనుడు అశ్వాలను అదలిస్తున్నాడు. రథాన్ని కదలిస్తున్నాడు. ఆ జగన్నాథ రథ చక్రాలు అలా ముందుకు గిరగిరా తిరుగుతూ పరుగెత్తుకొని పోతున్నవి.
తప్పదు. ధర్మం జయిస్తుంది. నరుడు విజయుడౌతాడు. "విజయశ్రీ" వీరగీతులతో భారతమాతకు నీరాజనా లెత్తుతుంది.