అధికార మదము అన్ని కాలములందున్నది.
అంచిత బుద్దులైన మనుజాధిపతుల్ జగమెల్ల తొల్లి ని
ర్మించిరి దాని గొందఱు భరించిరి యిచ్చిరి గొందఱర్ధికి
న్మించి జగమ్ములన్నియును నెమ్మి భుజించును గొందరుండగా
పంచష పట్టణేశుల కపార మదజ్వరమింత యేటికిన్
అన్నాడు భార్త్త్రుహరి.
దీక్షార్జునుడు
ద్రోణుడు హస్తినలో ఆచార్యుడు అయినాడు. కౌరవులు, పాండవులు అతని శిష్యులు అయినారు. ద్రోణుని కీర్తి దేశదేశములకు పాకినది. అనేకమంది రాజకుమారులు హస్తినకు వచ్చినారు. ద్రోణుని వద్ద విద్యాభ్యాసము చేసినారు. వారిలో కర్ణుడున్నాడు. అతడు అర్జునుని మించవలెనని ఆరాటపడినాడు. అశ్వత్ధామ సహితము అర్జునుని అధికమించుటకు యత్నించినాడు.
ద్రోణునకు ద్రుపదుడు చేసిన అవమానము మనసునందున్నది. అది శల్యమువలె కెలుకుచున్నది. ఒకనాడు ద్రోణుడు కౌరవులను, పాండవులను పిలిచినాడు. వారితో అన్నాడు :-
"నేను మీకు అస్త్రవిద్య నేర్పుచున్నాను. మీలో అస్త్ర విద్య సమగ్రమముగా నేర్చుకొనువారెవ్వరు? నా అభీష్టము తీర్చువారెవ్వరూ?"
అప్పుడు కౌరవులు నూరుగురు మిన్నకున్నారు. పాండవులలో నలుగురు ముందుకు రాలేదు. అర్జునుడు ముందుకు వచ్చినాడు. అంజలి ఘటించి నిలిచినాడు.
"ఆచార్యా! మీరు అనుగ్రహించిన అస్త్ర విద్య సమగ్రముగా నేర్చుకొందును. మీ అభీష్టము నెరవేత్తును." అన్నాడు ద్రోణుని పాదములంటి నమస్కరించినాడు.
ద్రోణుడు అర్జునుని చూచినాడు. అతని మనసు జలదరించినది. అర్జునుని కౌగలించుకున్నాడు. అతని కనులు చేమ్మగిల్లినవి. అర్జునుని ఆశీర్వదించినాడు. అర్జునుడు తన అభీష్టము నెరవేర్చగలడని నమ్మకము కలిగినది.
అశ్వత్ధామ అర్జునుని దీక్షను చూచినాడు. అతనికి అర్జునుడు అనిన ఈర్ష్య కలిగినది. అర్జునుడు తనను మించరాదని అతని సంకల్పము. అతడు అక్కడి వంటవానిని పిలిచినాడు. అర్జునునకు చీకటిలో అన్నము పెట్టరాదన్నాడు. దీపము లేకుండ అన్నము వడ్డించరాదు అన్నాడు. వంటవాడు అది గుర్తుంచుకున్నాడు. అట్లే చేయుచున్నాడు.
ఒకనాడు వంటవాడు ముందు దీపము పెట్టినాడు. తరువాత అర్జునునకు అన్నము పెట్టినాడు. అర్జునుడు దీపముముందు కూర్చున్నాడు. అన్నము తినుచున్నాడు. దీపము గాలికి రెపరెపలాడినది. చూచినాడు. అన్నము తినుచున్నాడు. అతడు తినుట ఆపలేదు. గాలికి దీపము రేపరెపలాడినది. ఆరిపోయింది. దీపనిర్వాణ ధూపము మాత్రమూ మిగిలినది. అర్జునుడు అది చూచినాడు. అన్నము చూచినాడు. తినుట ప్రారంభించినాడు. తినుట ముగించినాడు. అప్పుడు అర్జునుడు ఆలోచించినాడు. నేను చీకటిలో అన్నము తిన్నాను. అది ఎట్లు జరిగినది? అభ్యాసము వలన జరిగినది. చీకటి యందును అభ్యాసమును సకల విద్యలు నేర్వవచ్చును అనుకున్నాడు. ధనుర్భాణములు అందుకున్నాడు. చీకటిలోనే గురిచూచినాడు. బాణములు కొట్టసాగినాడు.
ద్రోణుడు పడుకున్నాడు. అతనికి ధనుష్టంకారము వినిపించినది. బాణములు తగులుచున్న చప్పుడు వినిపించినది. అతడు లేచినాడు. బయటకు నడిచినాడు. చీకటిలో అర్జునుని గుర్తించినాడు. అర్జునుని బాణములు గురి తప్పుట లేదు. అర్జునుడు అలయుట లేదు. ద్రోణుడు అది చూచినాడు. మెచ్చుకున్నాడు. పిలిచినాడు. అర్జునుని సమీపించినాడు. కౌగలించుకున్నాడు అన్నాడు:-
"అర్జునా! నీ దీక్ష గొప్పది. నీవు సాధించలేనిది లేదు. నీ దీక్ష వలన నన్ను మెప్పించినావు. నేను మెచ్చినాను."
"శిష్యా! నీకు ఒక మాట ఇచ్చుచున్నాను. నీకు ఇతరుల కన్న మిన్నగా అస్త్ర విద్య నేర్పుదును. అస్త్ర విద్యయందు నిన్ను మించువాడు లేకుండునట్లు అస్త్ర విద్య నేర్పుదును. నా మాటకు తిరుగులేదు. విలువిద్యలో నిన్ను మించువాడు ఉండడు."
అర్జునుడు ఇది అనుకున్నది కాదు. ఆకస్మికముగా జరిగినది. అతనిలో అనండసాగారములు పొంగినవి. ఉబ్బితబ్బు అయినాడు. లిప్త తనను మరచినాడు. మరు లిప్తలో తెలుసుకున్నాడు. ద్రోణునికి సాగిలి మ్రొక్కినాడు. పాదములు ముద్దాడినాడు.
ద్రోణుని మనసు నిండినది. ఆశీస్సులు పొంగినవి. పోరలినవి.
ద్రోణుడు అర్జునుని విషయమున వాత్సల్యము పెంచుకున్నాడు. అతడు అర్జునునకు సమస్త విద్యలు నేర్పినాడు. ద్వంద్వయుద్దము నేర్పినాడు. సంకీర్ణయుద్దము నేర్పినాడు. రధ, గజ , తురగముల పై నుండి యుద్దము చేయుట నేర్పినాడు. వ్యూహములు పన్నుట నేర్పినాడు. వానిలో ప్రవేశించుట, చేధించుట నేర్పినాడు. అనేక శస్త్రాస్త్రములను ప్రయోగించుట ఉపసంహరించుట బోధించినాడు. దివ్య బాణముల మంత్ర తంత్రాలను ఉపదేశించినాడు. అర్జునుడు అన్నింటిని శ్రద్దగా దీక్షగా నేర్చుకున్నాడు. ధనుర్విద్యా విశారదుడు అయినాడు. అర్జునుడు పరుశురామునితో సముడని జనులు పొగడినారు. కొందఱు అర్జునుడు పరశురాముని మించినాడు అన్నారు.
ద్రోణుడు ధృతరాష్ట్రుని కొడుకులు నూరుగురికి చదువు చెప్పినాడు. అయిదుగురు పాండవులకు చదువు చెప్పినాడు. అందరిని సమముగా చూచినాడు. సమముగా చెప్పినాడు. అయినను అర్జునుడు అన్ని విద్యల రహస్యములను నేర్చినాడు. భీముడు మహాబలపరాక్రమములు కలవాడు అయినాడు. అది చూచి దుర్యోధనాది కౌరవులు సహించలేక పోయినారు. వ్యాకులత చెందినారు. ద్రోణుడు భీమార్జునుల ఎడ ప్రత్యెక శ్రద్ధ వహించుచున్నాడు అనుకున్నారు. అన్నారు. ద్రోణుని మనసు చివుక్కుమన్నది. అతడు అర్జునుని ప్రత్యేకత నిరూపించదలచినాడు.
ద్రోణుడు ఒకనాడు ధనుర్విద్యలో పరీక్ష పెట్టినాడు. తన విద్యార్ధులందరను పిలిచినాడు. ఒక పక్షి రూపమును నిర్మించినాడు. దానికి "భాసము" అని పేరు పెట్టినాడు. దానిని చెట్టు కొమ్మ కోసయందు ఉంచినాడు.
ద్రోణుడు రాజకుమారులను పిలిచినాడు. వారందరు ఒకచోట చేరినారు. భాసమునకు ఎదుట, ద్రోణుని వెనుక అర్ధ చంద్రకారముగా నిలిచినారు. ద్రోణుడు మధ్యన నిలిచినాడు. ధర్మరాజును పిలిచినాడు. బాణము ఎక్కు పెట్టుమన్నాడు. ధర్మరాజు ఎక్కు పెట్టినాడు.
రాకుమారులందరు చూచుచున్నారు.
ద్రోణుడు ధర్మరాజును అడిగినాడు -
"ధర్మరాజా! కొమ్మ కొసనున్న పక్షి ని చూచుచున్నావా?"