Previous Page Next Page 
హత్య పేజి 20

   
    అయినా కైలాసగణపతి గ్రహించాడు.

 

    తనకోసం యిక్కడ ఎవరూ మాటువెయ్యరు. అంత వరకూ ఖాయం. కాకపోతే తన చర్యలని కనిపెట్టడానికో మరెందుకో ఓ వ్యక్తి దాగున్నాడన్నది ఖాయం. అదీ కాకపోతే వాడెవడో రహస్యంగా కిందకి దిగిపోదామనుకుంటుంటే తను పైకి వెళుతూ ఇరువురుదీ ఒకే సమయం కావటంతో తన కళ్ళలో వాడు పడదల్చుకోక దాగి వుండవచ్చు. కనుక తను చాలా జాగ్రత్తగా యిక్కడిదాకా ఎందుకు ఎక్కింది కవర్ చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే చిన్న నాటకం ఆడాలి.

 

    గవ్వలమ్మ గుహకి ఇంకా పైకి ఎక్కి వెళ్లటం మానేసి పక్కకి పది అడుగులు నడిచాడు కైలాసగణపతి. అక్కడ చిన్న సెలయేరు వుంది. ఆ సెలయేరు కొండలో ఎక్కడ పుట్టిందోగాని చిన్న గుంట దానిలో నీరు నిలవవుంటాయి.

 

    కైలాసగణపతి అక్కడికి వెళ్ళాడు. నీళ్ళు దోసిటనిండా తీసుకుని ముఖం కాళ్లూ చేతులూ కడుక్కున్నాడు. దోసిటనిండా నీళ్ళు తీసుకుని వంగుని తాగుతూ కనుచివర్ల నుంచి ఆ బండవేపుకి చూశాడు.

 

    బండ చాటున వున్న మనిషి కనిపించటంవల్ల కైలాసగణపతి ఉలిక్కిపడ్డాడు, కాని వెంటనే సర్దుకున్నాడు.

 

    బండ చాటున వున్న మనిషి కైలాసగణపతి ఏం చేస్తున్నాడా అని కాస్త యివతలికి జరిగి తొంగిచూశాడు. అదే ఆ మనిషి తెలివి తక్కువగా చేసిన పొరపాటు. కైలాసగణపతికి కనిపించాడు.

 

    కైలాసగణపతి నీళ్ళుతాగి ఏమీ ఎరుగనట్లు కొండదిగాడు.

 

    బండ చాటున దాగున్న ఆ మనిషి మాత్రం అక్కడే వుండిపోయాడు.


                                                                             14

 

    "సూరీడు యింకా రాలేదామ్మా!" కైలాసగణపతి అడిగాడు.

 

    "రాత్రి తొమ్మిది పది అవుతుంది. ఆయనకోసం కూర్చోన మీరు భోంచేద్దురుగాని." వరండాలో కూర్చుని చిక్కుడుకాయలు వలుస్తున్న మాణిక్యాంబ చెప్పింది.

 

    "భోజనానికి తొందరలేదు. సూరీడు వచ్చిం తరువాతనే తింటాను." అని చెప్పి కైలాసగణపతి కుర్చీలో కూర్చుని దినపత్రిక అందుకున్నాడు.

 

    కైలాసగణపతి చెప్పే సరదా కబుర్లు కావచ్చు చిన్నా పెద్దా అందరిలో కలిసిపోయే తత్వం కావచ్చు. ఇదేదీకాక సూర్యారావుకి ప్రాణ స్నేహితుడు ఈయింటి అతిధి మరేదైనా కావచ్చు. వచ్చి కొద్దిరోజులు అయినా ఆ ఇంట్లో మనిషిగా కలసిపోయాడు.

 

    కైలాసగణపతి పరాయి మగవాడు అనే రవ్వంత భీతితో మర్యాదగా తోలిగివుండే మాణిక్యాంబ కూడా అతి తొందరలో సొంత అన్నగారు అన్నట్లు చనువుగా మాట్లాడటం మొదలుపెట్టింది.

 

    "ఎందుకమ్మా! చిక్కుడుకాయలన్నీ వలిచి పెడుతున్నావు?" కొద్దిసేపు ఆగి కైలాసగణపతి అడిగాడు.

 

    అప్పటికే సోలెడు గింజలు వలిచి పళ్ళెంలో పోసింది మాణిక్యాంబ! అవి చాలవన్నట్లు యింకా వలుస్తున్నది.

 

    "ముదురు కాయలు తీసుకుని గింజలు వలిచి ఎండబెట్టి వుంచుకుంటే వీటితో చాలారకాలు చేసుకోవచ్చు అన్నయ్యగారూ!"

 

    "చాలా రకాలు అంటే!"

 

    "గింజలు వుడకబెట్టి ఉల్లిపాయలు మసాలా పొడిచేర్చు కూరగా తినవచ్చు. గుగ్గెళ్ళలాగా ఉడకబెట్టి తిరగమూతవేసుకుని తినవచ్చు. ఉత్త వుప్పునీళ్ళు చల్లి తినవచ్చు, కూరల్లో గుప్పెడు గింజలు చేర్చవచ్చు. ఇలా చాలారకాలు చేయవచ్చు. చిక్కుడు గింజలతో ఏం చేసినా పిల్లలకి చాలా ఇష్టం" మాణిక్యాంబ చెప్పింది.

 

    "బాగుంది. కానీ తొక్కలు వేస్ట్ అవుతాయి కదా?" లాపాయింట్ తీశాడు గణపతి.

 

    అసలు విషయం వదిలేసి కొసరు విషయం పట్టుకొని వాధించటంలేక వితండవాదం చెయ్యటం కైలాసగణపతికి మామూలే. అలా మాటాడితేగాని ఆయనకి తోచదు.

 

    "చిక్కుడు కాయ సరీగా కాసిందంటే వెర్రికాపు అన్నయ్యగారూ! ఒక్కచెట్టు బస్తాలు కాస్తుంది. ఎన్నని పంచుతాము, ఎన్నని తింటాము! తిని తిని మొహమెత్తి తరువాత ఇదిగో ఇలా ఈపనిలోకి దిగుతాము. వేరుశెనగ గింజలు భద్రపరచుకొని తొక్కలు పారేసినట్లు చిక్కుడు గింజలు భద్రపరచుకొని తొక్కలు పారేస్తాము. చిక్కుడు కాయలకాలం అయిపోయిం తరువాత కూడా ఉపయోగపడతాయి" వివరించింది మాణిక్యాంబ.

 

    "అదేమంచిదిలేమ్మా! ఉపయోగపడే ఏ వస్తువునయినా సరే నిరుపయోగం చేయరాదనేది నా తత్వం. నా విషయమేచూడు గొడుగుకి అతుకులెందుకు వేస్తారూ? అతుకులేసి కుట్టించిన ఆ పాతకోటు ఎన్నాళ్ళువాడుతారు అని చాలామంది ఎగతాళిగా మాట్లాడినవాళ్ళే. అలా అని వాళ్ళ మాటలెక్కచేశానా? వాళ్ళ బుద్ధి అది నా బుద్ధి యిది. ఈశ్వరుడంతటివాడే అర్థనారీశ్వరుడు అయి అతుకు తప్పలేదు. ఇహ మానవమాత్రుడికి అతుకోలెక్క?"

 

    కైలాసగణపతి చెప్పిన తీరుకి మాణిక్యాంబకి నవ్వు వచ్చింది. నవ్వు ఆపుకోలేక పైకి నవ్వింది.

 

    "ఏమిటి నవ్వి పారేస్తున్నావు. మళ్ళీ వీడు బోడి జోకు పేల్చాడా?" అంటూ సూర్యారావు వస్తూనే అడిగాడు.

 

    "అదేమిటో మీరే అడగండి" అంటూ భర్తకి మంచినీళ్ళు తేవటానికి లేచి ఇంట్లోకి వెళ్ళింది మాణిక్యాంబ.

 

    "ఏమిట్రా ఆ బోడిజోకు?" సూర్యారావు గుమ్మం పక్కనేవున్న బంతిచెట్టు మొదట్లో కాళ్ళు కడుక్కుంటూ అడిగాడు.

 

    "చెపుతాగాని, ముందీవిషయం చెప్పు. రాత్రి తొమ్మిది, పదిదాకా ఇంటికి రానన్నవాడివి ముందే అఘోరించావు ఏమిటి?"

 

    "నీకు తోచిచావదని!" అతను చల్లగా చెప్పాడు.

 

    "వెనుకటికి నీలాంటివాడే నాకోడిలేకపోతే తెల్లారదన్నాడుట." కైలాసగణపతి అంతకన్నా చల్లగా చెప్పాడు.

 

    ఇద్దరూ నవ్వుకున్నారు.

 

    మాణిక్యాంబ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది.

 

    సూర్యారావు మంచినీళ్లు తాగి "ఈ పూట భోజనంలోకి ఏం చేశావ్? అడుగుతూ ఖాళీగ్లాసు ఇచ్చాడు.

 

    మాణిక్యాంబ చెప్పింది.

 

    "చిక్కుడు గింజలు వలిచినట్లున్నావు. అట్టు చేయరాదా? అన్నం పెట్టుకొని వేడి వేడిగా తింటే బాగుంటుంది. వీడు చూస్తాడు."

 

    "అలాగే అదెంతసేపు" అంది మాణిక్యాంబ. పిల్లలయినా సరే భర్త అయినాసరే అడిగి చేయించుకు తింటే మహా ఇష్టం.

 

    "నీకు తినాలని వుంది. చెయ్యి అని చెప్పు. వాడికోసం చెయ్యి అని నామీద చెప్పి నీవు ఆరగించడం వుంది చూశావూ, అది మహాఘోరం" గణపతి అన్నాడు.

 Previous Page Next Page