సోమవారం ఉపవాసం ఉంటే కలిగే ఫలితాలు ఇవే..!
ఉపవాసానికి అన్ని మతాలలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఉపవాసం ఉండటం వల్ల దైవ భక్తి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి దేవుడికి ప్రత్యేకమైన రోజులలో ఉపవాసం ఉండటం చాలా మంది చేస్తారు. అయితే లయ కారుడు అయిన శివుడికి సోమవారం చాలా ప్రత్యేకం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని అంటారు. దీనికి తగినట్టే ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే ఏ పనులు అయినా జరుగుతాయి. శివుడికి ఎంతో ముఖ్యమైన రోజు అయిన సోమవారం నాడు ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో.. శివుడిని సోమవారం రోజు ఎలా ఆరాధించాలో తెలుసుకుంటే..
హిందూ మతంలో సోమవారం శివుని ఆరాధనకు చాలా పవిత్రమైన దినం. ఈ రోజున శివ భక్తులు ఉపవాసం ఉండి శివలింగానికి జలాభిషేకం చేస్తారు, మంత్రాలు జపిస్తారు, రోజంతా శివుడి ప్రార్థనలో, శివుడి స్మరణలో గడుపుతారు.మత గ్రంథాల ప్రకారం సోమవారం ఉపవాసం ఉండటం వల్ల శివుని అనుగ్రహం, ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి, కోరికలు నెరవేరుతాయి.
ఉపవాసం..
సోమవారం ఉపవాసం మతపరమైన దృక్కోణం నుండి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, మానసిక శాంతికి కూడా చాలా ముఖ్యమైనది. శివుడిని త్రిలోకేశ్వరుడు అని పిలుస్తారు. అంటే మూడు లోకాలకు ప్రభువు. ఆయనను ఆరాధించడం ద్వారా భక్తుడు జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తాడు. ఈ ఉపవాసం స్వీయ నియంత్రణ, సహనం, భక్తికి చిహ్నం. ఇది వ్యక్తికి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతిదేవి తీవ్రమైన తపస్సు చేసింది. సోమవారం ప్రత్యేక ఉపవాసం పాటించిందని శాస్త్రాలలో వివరించబడింది. ఆమె తపస్సుకు సంతోషించిన శివుడు ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించాడు. ఈ కారణంగా ఈ ఉపవాసం వివాహం అయిన మహిళలకు చాలా శుభప్రదమట.
పూజా విధానం..
సోమవారం నాడు శివుడిని ప్రత్యేక పద్ధతిలో పూజించాలి. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం ఉంటానని సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత, ఇంట్లో లేదా ఏదైనా శివాలయంలో పూజా స్థలంలో శివుని విగ్రహాన్ని లేదా శివలింగాన్ని దర్మించుకుని పూజించాలి. ముందుగా శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంగా జలం కలిపి అభిషేకం చేయాలి. ఇదే పంచామృత అభిషేకం. ఇది శివుడిని సంతోషపరుస్తుంది. దీని తరువాత మళ్ళీ స్వచ్ఛమైన నీటితో అభిషేకం చెయ్యాలి. ఆ తరువాత బెల్వ పత్రం, ధాతుర, తుమ్మి పువ్వులు పువ్వులు, అక్షతలు, భస్మం ను సమర్పించాలి. శివుడికి తెల్లని వస్త్రాలు సమర్పించాలి. పండ్లు, తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలి. ధూపం, దీపాలు వెలిగించి, శివునికి హారతి ఇచ్చి 'ఓం నమః శివాయ' మంత్రాన్ని.. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. సోమవారం నాడు శివకథ వినడం, శివ కథ పారాయణ చేయడం చాలా శుభప్రదమని, ఫలవంతమైనదని శివ పురాణంలో చెప్పబడింది. శివచాలీసా, రుద్రాష్టకం కూడా పఠించవచ్చు. ఉపవాసం ఉండలేని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. సాయంత్రం మళ్లీ శివుడి పూజ అయిన తరువాత రాత్రికి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇలా చేస్తే మనసుకు శాంతి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. శివుడి అనుగ్రహం లభిస్తుంది.
*రూపశ్రీ
