మన మహర్షులు - కర్దమ మహర్షి

 


మన మహర్షులు అనే శీర్షికలో మనం ఇప్పటివరకు దధీచి, శుక, శతానంద మహర్షుల గురింఛి తెలుసుకున్నాం కదా. ఆ కోవకి చెందిన వాడే కర్దమ మహర్షి. అయితే ఇతను అందరి కన్నా ముందు, అంటే కృత యుగం నాటి వాడు. మహా విష్ణువునే తన కొడుకుగా పొందిన వాడు. తొమ్మిది మంది మునులకు తాతగారు. బ్రహ్మదేముడి మాట మీద సంతానాన్ని అభివృద్ధి చేసినందుకు ఇతనిని కర్దమ ప్రజాపతి అని కూడా అంటారు. ఇంత గొప్ప మహర్షి గురించి మనం తెలుసుకోవాలి కదా.


బ్రహ్మ దేముడు గంధర్వులని, అప్సరసలని, సిద్ధులని, కిన్నెరలని, కింపురుషులని సృష్టించాకా ఋషులని సృష్టించాడు. వీరందరినీ ప్రజాసృష్టికి ఉపయోగించుకున్నాడు బ్రహ్మదేముడు. ఒకరోజు బ్రహ్మ కర్దముడిని పిలిచి నువ్వు సృష్టికార్యంలో నాకు సహాయం చెయ్యాలి అని చెప్పాడు. అందుకు కర్దముడు మాట కాదనలేక సరే అన్నాడు.


కర్దమ మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం కట్టుకుని విష్ణుమూర్తి కోసం పదివేల సంవత్సరాలు తపస్సు చేసాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని స్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి కర్దముడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అది కూడా సుఖాలకోసం కాదు, సృష్టి కార్యానికే, నువ్వు అనుమతినిస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు.


అందుకు విష్ణుమూర్తి మహర్షి నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. బ్రహ్మావర్త దేశపు రాజు, తన భార్య వచ్చి తన కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తారు. నీకు తొమ్మిది మంది కూతుర్లు పుడతారు. ఆ కూతుళ్ళకి తొమ్మిది మంది మునులు పుడతారు. నీ తపస్సు వల్ల నీలో కూడా నేనే ఉన్నానని తెలుసుకుంటావు. నా అంశతో నేనే నీకు కొడుకుగా పుడతాను అని చెప్పి అంతర్ధానమవుతాడు.


తరువాతి కాలంలో స్వాయంభువుడు తన భార్యతో కలిసి వచ్చి తన కూతురు దేవహుతిని పెళ్లి చేసుకోమని కర్దముడిని అడుగుతాడు. అందుకు కర్దముడు పెళ్లి చేసుకుంటా గాని పిల్లలు పుట్టే దాకానే ఉంటాను. తరువాత తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాను అని చెపుతాడు. తన భార్య, కూతురిని అడిగి వాళ్ళు సరే అన్నాకా వారిద్దరికీ పెళ్లి చేస్తాడు స్వాయంభువుడు.


కొంతకాలానికి దేవహుతి తొమ్మిది మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. పిల్లలు కలిగారు కదా ఇక నేను తపస్సు చేయటానికి వెళతాను అని చెప్తాడు కర్దముడు. దానికి బదులుగా ఇంత మంది పిలల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేయటం నా ఒక్కదానివల్ల కాని పని పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి నాకు ఒక మగపిల్లవాడు పుట్టే దాకా ఉండమని కోరుకుంటుంది దేవహుతి. అందుకు సమ్మతించి, విష్ణువుని పూజిస్తే తనకు కొడుకు పుడతాడని చెపుతాడు కర్దముడు.


కొంతకాలానికి వారికి శ్రీ మహావిష్ణువే కొడుకుగా జన్మిస్తాడు. అతనికి కపిలుడు అని నామకరణం చేస్తారు ఆ దంపతులు. భగవంతుడే తనకు కొడుకు రూపంలో పుట్టాడని తెలుసుకున్న కర్దముడు కపిలునికి నమస్కారం చేసి, ప్రదక్షిణ చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. దానికి బదులుగా కపిలుడు, విష్ణుమూర్తి అంశ అయిన నన్నే తలుచుకుంటూ తపస్సు చేసి మోక్షాన్ని పొందు అని చెపుతాడు. అతని ఆదేశానుసారం కర్దమ ప్రజాపతి ఆ జన్మాంతం శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ మోక్షాన్ని పొందుతాడు. ఇదండీ కర్దమ ప్రజాపతి చరిత్ర.  

...కళ్యాణి


More Purana Patralu - Mythological Stories