తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ పెట్టి టీఆర్ఎస్ బ్రాండ్ ఓన్ చేసుకుందామనుకున్న కవితకు ఆ పేరే  ఇప్పుడు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. టీఆర్ఎస్ పేరును కేటాయించవద్దని ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.  అదలా ఉంటే.. మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న  తెలంగాణ రాష్ట్రసామాజిక సేన  టీఆర్ఎస్ పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. ఇక కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ పేరును ఆమె పార్టీకి కేటాయించడంపై దాదాపు 600 నుంచి 700 వరకు  అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే  టీఆర్ఎస్ పేరుతో నమోదైన మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో రాజకీయ పార్టీ కూడా టీఆర్ఎస్ పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం కూడా ఈసీని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో కవిత పార్టీకి టీఆర్ఎస్ సెంటిమెంట్ దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పశ్చిమ బెంగాల్ లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో  ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.  ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.  తాజాగా  టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్ బారైక్  పార్టీకీ,  తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒకే వారంలో  ముగ్గురు టీఎంసీకి గుడ్ బై చెప్పడం గమనార్హం.  వరుస రాజీనామాలతో పార్టీలో అసమ్మతి స్వరాలు బలపడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా  చిక్ బారైక్  రాజీనామాకు గల కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది.  అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి కారణంగానే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు.  
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనా రికార్డులపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ పాలనలో దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని ఆరోపించింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు.   మోడీ  పాలనా మైలురాయి కేవలం  స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు. గత పన్నెండేళ్లుగా సాగుతున్న మోదీ పాలన దేశ ప్రగతికి, అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని జైరాం రమేశ్ విమర్శించారు.  2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా   మెజారిటీ రాలేదని గుర్తు చేసిన ఆయన,   సొంత బలం లేని ప్రభుత్వాన్ని నడుపుతూ చారిత్రక నాయకులతో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాగా.. ఎన్‌సీపీ 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  ముంబైలో జరిగిన కార్యక్రమంలో  శరద్ పవార్   మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అసమానమైన దేశ నిర్మాణ కృషితో ఏ మాత్రం పోల్చలేమన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కట్ అవుట్ కి ఉన్న చరిష్మాని మరోసారి నిరూపిస్తు పెద్ది(Peddi)రికార్డుల కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.  జూన్ 4 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన పెద్ది ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి వారానికి 345 కోట్లకి పైగా గ్రాస్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ స్టేటస్ సాధించాలంటే 400 కోట్ల నుండి 425 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లని లేదా  220 కోట్ల నెట్ వసూళ్లని పెద్ది రాబట్టాల్సి ఉంటుంది. మరి  ప్రస్తుత రన్‌  చూస్తుంటే, అతి త్వరలోనే ఆ మైలురాయిని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పెద్ది ఓటీటీ హక్కులని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 105 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమా జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల అంచనా. అయితే, బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగితే, థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాతే అధికారిక స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తారు. ఓటిటి ప్రేమికులకి గుడ్ న్యూస్ ఏంటంటే కట్ చేసిన సన్నివేశాలు కూడా పెద్దిలో ఉందనున్నట్టుగా టాక్.  Also read: శ్మశానంలో 6 అడుగులే నా ఆస్తి.. ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్   
టాలీవుడ్‌లో విలక్షణ నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం నడుస్తోంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లలో యాక్టివ్‌గా ఉండే ఆమెపై ఇటీవల ఒక దర్శకుడు సంచలన ఆరోపణలు చేశారు. "పోలీస్ కంప్లైంట్" (Police Complaint) అనే సినిమాకు సంబంధించి వరలక్ష్మి పూర్తిగా డబ్బులు తీసుకుని కూడా, మూవీ ప్రమోషన్స్‌కు హాజరు కాలేదంటూ ఆ చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి మీడియా ముందుకు వచ్చి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం రెమ్యూనరేషన్ తీసుకున్న తర్వాత ప్రమోషన్లకు రాకపోవడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు. ఈ వివాదం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దర్శకుడు చేసిన ఈ ఆరోపణలపై వరలక్ష్మి శరత్ కుమార్ ఎలా స్పందిస్తారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలోనే ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారింది. నేరుగా ఎవరి పేరు ఎత్తకపోయినప్పటికీ, తనపై వస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఆమె పెట్టిన స్టేటస్ అందరి దృష్టిని ఆకర్షించింది. 'మొరిగే కుక్కలు కరవవు.. కరిచే కుక్కలు మొరగవు.. నేను మొరగను... కరుస్తా..' అంటూ చాలా పవర్‌ఫుల్ కోట్‌తో ఆమె ఒక పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలు నేరుగా తనపై పోలీస్ కంప్లైంట్ మూవీ టీం చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గానే పెట్టారంటూ నెటిజన్లు భావిస్తున్నారు. ఆమెలోని ఫైర్‌ను చూపిస్తూ పెట్టిన ఈ పోస్ట్ క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఇన్ స్టాలో ఈ సంచలన పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే వరలక్ష్మి శరత్ కుమార్ దానిని తన ప్రొఫైల్ నుండి డిలీట్ చేసేశారు. ఆమె ఈ పోస్ట్‌ను ఎందుకు డిలీట్ చేశారనే దానిపై ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత అనవసరమైన వివాదాలు ఎందుకని తొలగించారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఆమె పోస్ట్ డిలీట్ చేయడానికి ముందే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయిపోయాయి. మూవీ టీమ్ చేసిన వ్యాఖ్యలకు, వరలక్ష్మి ఇచ్చిన ఈ ఘాటు సమాధానం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.  
 'బ్రహ్మముడి' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు తమిళ నటి దీపిక రంగరాజు. ఆ సీరియల్‌లో పోషించిన 'కావ్య' క్యారక్టర్ తో ప్రతి ఇంటికీ ఇలాంటి కూతురు లేదా కోడలు ఉంటే బాగుండు అనేంతలా పాపులారిటీ తెచ్చుకుంది. తెరపై ఎంతో హుందాగా, ఆనందంగా కనిపించే ఈ సెలబ్రిటీల నిజ జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఉండవనేది చేదు నిజం. తాజాగా గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, తనకున్న ఒకే ఒక్క చివరి కోరిక గురించి దీపిక రంగరాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పి  తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్  వైరల్ అవుతున్నాయి.  ఆమె మాట్లాడుతు ప్రస్తుతం టాప్ రేటింగ్‌లో ఉన్న సీరియల్ లీడ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నప్పటికీ, నాకు చెన్నై నగరంలో కనీసం సొంత ఇల్లు కూడా లేదని చెప్పుకొచ్చింది. దీంతో  'మీరు ఇన్నేళ్లుగా నటిస్తున్నారు కదా, మరి సొంత ఇల్లు ఎందుకు లేదు?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఈ ప్రపంచంలో మనం జన్మించినప్పుడే భగవంతుడు లేదా ప్రభుత్వం మనకంటూ ఒక స్థలాన్ని ఖచ్చితంగా కేటాయించి ఉంటుంది. అది మరేదో కాదు మనం చనిపోయిన తర్వాత స్మశానవాటికలో లభించే ఆ ఆరు అడుగుల నేల మాత్రమే. మనిషి బ్రతికున్నంత కాలం ఎన్ని కలలు కన్నా, చివరికి శాశ్వతంగా మనకంటూ మిగిలేది ఆ ఆరడుగుల స్థలం మాత్రమే. Also read: Governor: 50 రూపాయలకే బాల్కనీ టికెట్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన మేకర్స్  నేను ఇండస్ట్రీలో కోట్లకు కోట్లు సంపాదించడం లేదు. కేవలం వేలు, లక్షల్లో మాత్రమే పారితోషికం అందుకుంటున్నాను. ఒక 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు సంపాదిస్తున్న రేంజ్‌లో సంపాదించి ఉంటే చెన్నైలో సొంత ఇల్లు కొనేదానినని, కానీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సాధారణ మధ్యతరగతి స్థాయి నుండి వచ్చిన నేను అంత బడ్జెట్ భరించలేకపోతున్నాను. ప్రస్తుతం చేతి నిండా సంపాదన ఉన్నా, ఒకసారి పెద్ద మాల్‌కి వెళ్లి షాపింగ్ చేసినా, కొద్దిగా బంగారం కొనుగోలు చేసినా  బ్యాంక్ బ్యాలెన్స్ 'జీరో' అయిపోతుంది. డబ్బు కంటే మనుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని లక్షలు ఉన్నా ఖర్చు పెడితే కరిగిపోతాయి. కానీ మనకు ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా బాధను పంచుకోవాలనుకున్నప్పుడు తోడుగా నిలబడేందుకు మనుషులు మాత్రమే కావాలని నమ్ముతానని చెప్పారు.     
డిజిటల్ వినోద ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడిగా నటిస్తూనే, తెరవెనుక దేశాన్ని కాపాడే సీక్రెట్ ఏజెంట్‌గా శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ పండించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ సిరీస్ తదుపరి భాగం 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4' కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. గత సీజన్ (సీజన్ 3) ముగింపులో మేకర్స్ వదిలిన క్లిఫ్‌హ్యాంగర్ ట్విస్టులు చూసి ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. కథ మధ్యలోనే ఆగిపోవడంతో, అసలు తర్వాత ఏం జరగబోతోంది? శ్రీకాంత్ తివారీ పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. వీటన్నింటికీ స్వయంగా కథానాయకుడు మనోజ్ బాజ్‌పాయ్ సోషల్ మీడియా వేదికగా సమాధానమిస్తూ సీజన్ 4ను అధికారికంగా ఖరారు చేశారు. ట్విట్టర్ (X) వేదికగా అభిమానులతో ముచ్చటించిన మనోజ్.. మూడో సీజన్‌ ముగింపుపై తికమకపడుతున్న ఒక నెటిజన్‌కు రిప్లై ఇస్తూ, "మీ ప్రశ్నలన్నింటికీ నాల్గవ సీజన్‌లో సమాధానం దొరుకుతుంది, త్వరలోనే కలుద్దాం" అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈసారి సరికొత్త సీజన్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ 'మార్ కాట్ కల్లాస్' (భీభత్సమైన యాక్షన్) రేంజ్‌లో ఉండబోతున్నాయని హింట్ ఇచ్చి సిరీస్‌పై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చారు. సౌత్ ఇండియన్ టాలెంటెడ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే) సృష్టించిన ఈ వెబ్ సిరీస్ యూనివర్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి, శారీబ్ హష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత సీజన్లలో సమంత, జయదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ వంటి స్టార్స్ ఎంట్రీ ఇచ్చి సిరీస్ రేంజ్‌ను మరింత పెంచేశారు. ప్రస్తుతం ఈ నాల్గవ సీజన్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో దర్శకులు రాజ్ అండ్ డీకే స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేస్తున్నారట. ఈ భారీ సిరీస్ షూటింగ్ మరియు గ్రాఫిక్స్ పనుల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉందని, వచ్చే ఏడాది నాటికి ఇది ప్రేక్షకుల ముందుకు రావచ్చని భావిస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయ్ ఇచ్చిన ఈ క్రేజీ అప్‌డేట్‌తో నెట్టింట 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. శ్రీకాంత్ తివారీగా మనోజ్ యాక్షన్‌ను, జేకే కామెడీ టైమింగ్‌ను మిస్ అవుతున్నామని, త్వరగా కొత్త సీజన్‌ను స్ట్రీమింగ్‌లోకి తీసుకురావాలని ఓటిటి ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచిన 'ది ఫ్యామిలీ మ్యాన్'.. ఈ నాల్గవ సీజన్‌తో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో చూడాలి. శ్రీకాంత్ తివారీ ఫ్యామిలీ డ్రామా మరియు హై-వోల్టేజ్ దేశభక్తి యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న 'ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్' అధినేత అనిల్ సుంకర మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో కొన్ని భారీ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో కొంత కాలం పాటు ఈ నిర్మాణ సంస్థ స్లో అయింది. అయితే ఆ చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టేస్తూ, సరికొత్త ఉత్సాహంతో, భారీ ప్రణాళికలతో టాలీవుడ్‌లో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు అనిల్ సుంకర సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఒకేసారి మూడు సరికొత్త ప్రాజెక్టులను ప్రకటించడానికి రంగం సిద్ధం చేశారు. విభిన్నమైన కథాంశాలతో, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న స్క్రిప్ట్‌లను ఆయన ఇప్పటికే లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు కూడా వేర్వేరు జానర్లలో వైవిధ్యంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్టుల కోసం టాలీవుడ్‌లోని క్రేజీ హీరోలతో పాటు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లను అనిల్ సుంకర లైన్ లో పెట్టినట్లు వినికిడి. గతంలో మాస్, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యానర్.. ఇప్పుడు కూడా అదే పంథాలో భారీ బడ్జెట్‌తో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మించనుంది. ఈ మూడు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వరుసగా రానున్నాయని సమాచారం. గతంలో మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన అనిల్ సుంకర, ఆ తర్వాత అఖిల్ అక్కినేనితో 'ఏజెంట్', మెగాస్టార్ చిరంజీవితో 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాలను నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి. దీంతో ఆయన కొంతకాలం విరామం తీసుకుని, కథల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇటీవల కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సరికొత్త రియాలిటీ షోలను కూడా ప్లాన్ చేశారు. అనిల్ సుంకర లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ మళ్లీ వరుస చిత్రాలతో యాక్టివ్ కావడం పట్ల టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు సినిమా లవర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కమ్‌బ్యాక్ ప్రాజెక్టులపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. ఈ సారి అనిల్ సుంకర ఖచ్చితంగా గట్టి హిట్లతో బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు ప్రతిష్టాత్మక చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి రాబోయే ఈ క్రేజీ అప్‌డేట్స్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అనిల్ సుంకర ఈ కొత్త ఇన్నింగ్స్‌తో ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.
  కారణాలు తెలియదు గాని ప్రస్తుత రోజుల్లో కొత్త సినిమా చూడాలంటే సామాన్య ప్రేక్షకుడికి మల్టీప్లెక్స్‌ , సింగిల్ స్క్రీన్స్‌లో మూవీ చూడటం పెద్ద ఆర్థిక భారంగా మారింది. ఇక  కుటుంబం మొత్తం కలిసి వెళ్లాలంటే భారీ ఖర్చు అవుతుంది. ఇలాంటి  తరుణంలో సినీ  ప్రేమికులకి ఊరటనిచ్చేలా బాలీవుడ్ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్  సరికొత్త ఎకనామిక్ థ్రిల్లర్ చిత్రం 'గవర్నర్(Governor). ఈ మూవీకి  సంబంధించిన మొదటి 25,000 టికెట్లని కేవలం 50 రూపాయిలకే అందిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.  గవర్నర్ మూవీ ఈ రోజే థియేటర్స్ లోకి రానుంది. ఇదే రోజు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వస్తున్న 'మై వాపస్ ఆవుంగా', కంగనా రనౌత్  'భారత్ భాగ్య విధాత', విక్రమ్ భట్ హారర్ మూవీ 'హాంటెడ్ 3డీ: ఎకోస్ ఆఫ్ ది పాస్ట్' చిత్రాలు వస్తున్నాయి. దీంతో    'గవర్నర్' ఈ తీవ్రమైన పోటీని తట్టుకుని, ప్రేక్షకులని థియేటర్లకు పెద్ద ఎత్తున రప్పించేందుకు  చిత్ర బృందం ఈ వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. 1990 లో సాధారణంగా ఒక సినిమా టికెట్ ధర దాదాపు యాభై రూపాయల పరిధిలోనే ఉండేది. సరిగ్గా ఆనాటి జ్ఞాపకాలని , ఆనాటి 1990ల నాటి ధరలను గుర్తు చేస్తూ మేకర్స్ ఈ ప్రత్యేకమైన ప్రమోషనల్ ఆఫర్‌ని  ప్రవేశపెట్టడం విశేషం. ఈ  50 రూపాయల ఆఫర్‌ని సొంతం చేసుకోవడం చాలా సులభం. ప్రేక్షకులు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్  'BookMyShow' యాప్‌లోకి వెళ్లి, తమకు నచ్చిన థియేటర్ సీట్లని  సెలెక్ట్ చేసుకునే సమయంలో 'GOVERNOR90' అనే ప్రత్యేక కూపన్ కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. సదరు కోడ్‌ అప్లై చేయగానే టికెట్ ధర యాభై రూపాయలుగా మారిపోతుంది. అయితే ఈ ఆఫర్ కేవలం మొదటి 25,000 టికెట్లకే మాత్రమే పరిమితం. కాబట్టి ఆఫర్ ముగిసేలోపు వీలైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలని చిత్ర నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులని కోరుతుంది. also read: Balakrishna: యూకేలో జై బాలయ్య' నామస్మరణ.. పేద విద్యార్థుల కోసం 10 లక్షల విరాళం కేవలం టికెట్ ధరలు మాత్రమే కాదు, ఈ సినిమా కథా నేపథ్యం కూడా 1990ల నాటి కాలానికే చెందుతుంది. ఈ చిత్రం భారతదేశ ఆర్థిక చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ఘట్టమైన 1991 నాటి తీవ్ర ఆర్థిక సంక్షోభం (ఫారెక్స్ క్రైసిస్) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఆ సమయంలో దేశంలో ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు కేవలం కొన్ని వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయేలా పడిపోయి, దేశం దివాలా తీసే ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆర్‌బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ తన ధైర్యవంతమైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడారు, దేశాన్ని సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కించారు అనే యథార్థ గాథ ఆధారంగా ఈ ఎకనామిక్ థ్రిల్లర్ రూపొందింది. మనోజ్ బాజ్‌పాయ్ ఆర్‌బీఐ గవర్నర్ గా కనిపిస్తుండగా అదా శర్మ హీరోయిన్. చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వంలో, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి జావేద్ అఖ్తర్ పాటలు రాయగా, అమిత్ త్రివేది సంగీతాన్ని అందించారు.    
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్న నెల్సన్ దిలీప్‌కుమార్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైవిధ్యమైన డార్క్ కామెడీ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన ఈ దర్శకుడు, ప్రస్తుతం ఒక విచిత్రమైన డైలమాలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో భారీ పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం ఉండగా, మరోవైపు కోలీవుడ్ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్‌లను ఒకే స్క్రీన్‌పై చూపించే అరుదైన మల్టీస్టారర్ ఛాన్స్ ఆయన తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన రాబోయే ప్రాజెక్టుల లైన్అప్‌ను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. 'డ్రాగన్' సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పట్టాలెక్కించేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇదే గనుక నిజమైతే, నెల్సన్‌తో అనుకున్న కాంబినేషన్ మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ గ్యాప్‌లో నెల్సన్ దిలీప్‌కుమార్ ముందుకు ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తమిళ సినిమా చరిత్రలోనే కలలో కూడా ఊహించని విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఒక మెగా మల్టీస్టారర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఆయన ఉన్నారట. భారతీయ సినీ రంగంలోనే ఇదొక చరిత్ర సృష్టించే ప్రాజెక్ట్ కానుండటంతో, నెల్సన్ సైతం ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించేందుకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రజనీకాంత్‌కు 'జైలర్' వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నెల్సన్, ప్రస్తుతం 'జైలర్ 2' పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సీక్వెల్ సాధించే ఫలితంపైనే నెల్సన్ తదుపరి అడుగులు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ 'జైలర్ 2' కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తే, రజనీ-కమల్ కాంబోకు మరింత హైప్ రావడం ఖాయం. అటు ఎన్టీఆర్ కూడా వరుస అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల, వీరిద్దరి కాంబినేషన్ కుదరడానికి మరికొన్నేళ్లు పట్టేలా ఉంది. ఈ పరిణామాలు ఎన్టీఆర్ అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తున్నాయి. ఎన్టీఆర్, నెల్సన్ కాంబోలో రాబోయే హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ ఆలస్యం మింగుడుపడటం లేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ థియేటర్లలోకి రావాలంటే 2028 వరకు వేచి చూడాల్సిందేనని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ ప్రాజెక్టులపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్‌ల సినిమా సెట్స్ పైకి వెళ్తే ఇండియన్ సినిమా రేంజ్ మారుతుందని కొందరు అంటుంటే, తారక్-నెల్సన్ మాస్ కాంబోనే బెస్ట్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ గందరగోళానికి తెరపడాలంటే హీరో ఎన్టీఆర్ లేదా డైరెక్టర్ నెల్సన్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
  గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిన్న ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అభిమానుల గురించి అయితే చెప్పక్కర్లేదు, ప్రతి సంవత్సరం లాగానే ఘనంగా జరపడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేసారు. ఆ సిస్టం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదని,  విదేశాల్లోను నిరంతరాయంగా జరుగుతాయని మరోసారి ఈ బర్త్ డే వేడుక నిరూపించింది.   యూనైటెడ్ కింగ్‌డమ్ (UK) లోని లండన్,బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో బాలకృష్ణ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. "జై బాలయ్య" అనే నినాదాలతో బ్రిటన్ వీధులు మారుమోగిపోయాయి. ప్రవాసాంధ్రులు, నందమూరి అభిమానులు వందల సంఖ్యలో ఒకచోట చేరి తమ అభిమాన హీరో పుట్టినరోజుని ఒక పండుగలా జరుపుకున్నారు. బాలయ్య డైలాగులు, ఆయన సూపర్ హిట్ సాంగ్స్‌తో బ్రిటన్ వీధులు  మార్మోగాయి. Also read: Ghattamaneni.. ఘట్టమనేని జయకృష్ణ సెకండ్ మూవీ!.. ఆ అగ్ర దర్శకుడు కన్ఫర్మ్!  సింగపూర్, అమెరికా (USA), ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలలో కూడా ఎన్‌బీకే అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. లండన్‌లో జరిగిన  ప్రత్యేక కార్యక్రమంలో అభిమానులు భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. దాదాపు 500 మందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు హాజరైన ఈ వేడుకల్లో బాలయ్య నుంచి వచ్చిన  పోస్టర్లు, కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేవలం కేక్ కటింగ్స్, సంబరాలకే పరిమితం కాకుండా  సామాజిక బాధ్యతని కూడా చాటుకున్నారు. యూకేలోని పలు స్వచ్ఛంద సంస్థలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పేద విద్యార్థుల చదువుల కోసం  10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చెయ్యడానికి నిన్న ఈవినింగ్  NBK 111 నుంచి గ్లింప్స్‌ వచ్చిన విషయం తెలిసిందే.    
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఎనర్జీకి, ఆయన కామెడీ టైమింగ్‌కు టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వెండితెరపై ఆయన కనిపించారంటే చాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయాల్సిందే. ముఖ్యంగా రవితేజ మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ల కోసం మాస్ ఆడియన్స్ ఎప్పుడూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి (Hasith Goli) దర్శకత్వంలో రవితేజ ఒక సరికొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'రాజా రాజా చోర' వంటి వైవిధ్యమైన బ్లాక్‌బస్టర్ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హసిత్ గోలి, రవితేజ కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ ఒక పూర్తి నిడివి గల ట్రాన్స్‌జెండర్ (Transgender) పాత్రలో నటిస్తున్నారని, ఆయన కెరీర్‌లోనే ఇది ఒక అత్యంత సాహసోపేతమైన ప్రయోగం కాబోతోందంటూ ప్రచారం జోరందుకుంది. రవితేజ లాంటి అగ్ర మాస్ హీరో ఇలాంటి భిన్నమైన పాత్రను ఎంచుకోవడం సినిమా ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్త విన్నప్పటి నుండి అభిమానుల్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. అయితే ఈ వైరల్ వార్తలపై తాజాగా నమ్మదగిన సినీ వర్గాల నుండి పూర్తి స్పష్టత వచ్చేసింది. రవితేజ ఈ సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషిస్తున్నారంటూ వస్తున్న రిపోర్ట్స్ అన్నీ ముమ్మాటికీ అవాస్తవమని, అవి కేవలం పుకార్లు మాత్రమేనని ఇండస్ట్రీ వర్గాలు తేల్చిచెప్పాయి. నిజానికి ఈ సినిమా రవితేజ మార్క్ వినోదంతో కూడిన ఒక పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఎంతో ఎనర్జిటిక్‌గా, మాస్‌గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో లేడీ క్యారెక్టర్ల చుట్టూ తిరిగే కొన్ని ప్రత్యేకమైన కామెడీ సీన్స్ ఉంటాయని, అందులో రవితేజ తనదైన శైలి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించబోతున్నారని సమాచారం. గతంలో రవితేజ కొన్ని సినిమాల్లో లేడీ గెటప్స్‌లో మెరిసి అలరించిన సందర్భాలు ఉన్నాయి. బహుశా ఈ సినిమాలో కూడా అలాంటి లేడీ క్యారెక్టర్ల కాంబినేషన్‌లో వచ్చే హిలేరియస్ కామెడీ సీన్స్ ఉండటం వల్లే, ఎవరో పొరబడి దీనిని ట్రాన్స్‌జెండర్ రోల్ అంటూ తప్పుడు ప్రచారం చేసి ఉంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు హసిత్ గోలి స్క్రిప్ట్ వర్క్‌ను అత్యంత పకడ్బందీగా షేప్ అవుట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. రవితేజ సినిమా అంటేనే ప్రేక్షకులు ఆశించే వినోదం ఏ రేంజ్‌లో ఉంటుందో దర్శకుడికి బాగా తెలుసు. అందుకే ముఖ్యంగా కామెడీ పోర్షన్స్ మరియు రవితేజ సిగ్నేచర్ మేనరిజమ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పక్కాగా కనెక్ట్ అయ్యేలా స్క్రిప్ట్‌లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏదేమైనా రవితేజ ట్రాన్స్‌జెండర్ పాత్ర చేస్తున్నారనే వార్తల్లో మాత్రం నిజం లేదని సమాచారం.  
  -శ్రీనివాస మంగాపురంతో ముస్తాబవుతున్న ఘట్టమనేని నయా వారసుడు జయకృష్ణ  -మరి సెకండ్ మూవీ ఎవరితో  -సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ నిజమేనా! -ఆ అగ్ర దర్శకుడు, అగ్ర సంస్థలో సెకండ్ మూవీ ఉండబోతుందా! ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ(Jayakrishna)'శ్రీనివాస మంగాపురం'తో శరవేగంగా దూసుకురాబోతున్నాడు. ప్రచార చిత్రాలతో హీరో కట్ అవుట్ కి డోకా లేదని అనిపిస్తుండటమే కాకుండా కృష్ణ(Krishna),మహేష్(Mahesh),రమేష్ బాబు(Ramesh Babu) లెగసీని కంటిన్యూ చేయబోతున్నాననే హింట్ అయితే ఫాన్స్ కి ఇచ్చి పడేసాడు. దీంతో  'శ్రీనివాస మంగాపురం' కోసం అందరు రీ గర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల దృష్టి సెకండ్ మూవీపై పడింది. ఈ తరుణంలో జయకృష్ణ రెండో మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ పై సోషల్ మీడియాలో ఒక న్యూస్    చక్కర్లు కొడుతుంది. ఒక ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ ,అగ్ర దర్శకుడితో  జయకృష్ణ  రెండో ప్రాజెక్ట్ ఉండబోతుందని, కథ చర్చలు కూడా జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన రూమర్ వినిపిస్తోంది. సదరు దర్శకుడు సైతం ఇప్పటికే ఎన్నో భారీ హిట్స్ ఇచ్చాడని, శ్రీనివాస మంగాపురం రిలీజ్ రోజు సెకండ్ మూవీ అనౌన్స్ మెంట్ వస్తుందని కూడా అంటున్నారు. ప్రస్థుతానికి సెకండ్ మూవీ న్యూస్ రూమరే అయినా, నిజమనే వాళ్ళు కూడా లేకపోలేదు.  Also read: Bharathiraja: భారతీరాజా ఆస్తుల విలువ ఇంతే! ఇప్పటి హీరోలతో పోల్చుకుంటే  'శ్రీనివాస మంగాపురం' విషయానికి వస్తే జులై 9 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. . 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' ఫేమ్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకుడు కాగా సీనియర్ టాప్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌. జెమినీ కిరణ్ తో కలిసి భారీ చిత్రాల మేకర్  అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీ రోల్  పోషించడం శ్రీనివాస మంగాపురం స్పెషల్.    
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది భర్తలు తమ భార్యకు ఎంతో ప్రేమను పంచుతున్నామని, ఎంతో బాగా చూసుకుంటున్నామని అంటూ ఉంటారు.  కానీ ఇది చాలా తప్పు. కేవలం ప్రేమతో మనిషి సంతోషంగా ఉండటం అనేది జరగదు. గిఫ్ట్ లు,  గోల్డ్,  చీరలు.. ఇవన్నీ కొనిపెట్టడం మీద మహిళల సంతోషం ఆధారపడి ఉండదు.  చాలామంది పెద్ద గొడవలు ఏమీ జరగడం లేదు కాబట్టి ఆ బంధంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారని అనుకుంటారు.  కానీ అది నిజం కాదు.. కొన్ని చిన్న చిన్్న అలవాట్లు, కొన్ని చిన్న చిన్న విషయాలు బంధాన్ని బహీనంగా మారుస్తాయి.  మహిళలు ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము ఎక్కువగా బాధపడే కొన్ని విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. ఇతర మహిళల పై ఎక్కువ శ్రద్ద చూపడం.. మగాడు తన భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇతర స్త్రీల వైపు చూడటం లేదా వారిపై ఎక్కువ శ్రద్ధ చూపడం వంటివి చేస్తే. ఆతనితో బంధంలో ఉన్న  స్త్రీ అభద్రతా భావానికి లోనై, నిర్లక్ష్యానికి గురైనట్లు భావించబడుతుంది. ఇతర స్త్రీల వైపు చూసే మగాడు తన భార్యను అవమానించినట్టు. కేవలం అవమానం మాత్రమే కాదు.. ఆమె గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టే. అసలు జీవితంలో ఆమెకు ప్రాధాన్యత  ఇవ్వనట్టు. ప్రత్యేక సందర్బాలు మరచిపోవడం.. చాలామంది మగాళ్లకు పెళ్లిరోజు తేదీలు కూడా గుర్తుండవు అని తరచుగా అంటుంటారు.  ఇది బయటకు తమాషాగా,  సరదాగా మాట్లాడే విషయం అయినా.. మహిళలకు ఇవి ఎంతగానో బాధపెడతాయి. మొదటిసారి కలుసుకున్న రోజు,  భాగస్వామి పుట్టినరోజు,  మ్యారేజ్ డే వంటి ముఖ్యమైన తేదీలు, సందర్భాలు వంటివి గుర్తుంచుకోకపోతే మహిళలు చాలా బాధపడతారు. ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పడం.. మహిళలు  ఆందోళనలను లేదా సమస్యలను తన  భర్తతో షేర్ చేసుకున్నప్పుడు,  దానికి పరిష్కారం చెప్పకపోయినా కనీసం అర్థం చేసుకుంటే చాలని,  ఎంతో ఊరటగా ఫీల్ అవుతుంది. కానీ మహిళలు తమ భయాలు, ఆందోళనలు షేర్ చేసుకున్నప్పుడు , అంతగా ఆలోచించకు అని చెప్పడం వల్ల ఆమె తన మాటలను పట్టించుకోవడం లేదని ఫీలవుతుంది. భార్య కంటే స్నేహితులు, బయటివారి మాటకే విలువ ఇవ్వడం.. ప్రతి మగాడి జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కానీ ప్రతి మగాడు తన నిర్ణయాలలో ఎల్లప్పుడూ స్నేహితుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిస్తూ, భార్య చెప్పే విషయాలను, భార్య ఫీలింగ్స్ ను విస్మరిస్తే అది ఆ సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. అంతే కాదు.. బయటి వాళ్ల మాటలతో భార్యను చిన్నతనంగా మాట్లాడటం,  భార్యకు విలువ ఇవ్వకపోవడం కూడా బంధాన్ని బలహీనపరుస్తుంది. మద్దతు ఇవ్వకపోవడం.. ఎన్నో ఏళ్లు కని పెంచిన తల్లిదండ్రులను వదిలి ప్రతి ఆడపిల్ల  భర్త వెంట అత్తింటికి వెళుతుంది. కానీ చాలామంది మహిళలు అత్తింట్లో, భర్త వైపు కుటుంబ సభ్యుల నుండి అవమానం ఎదుర్కొంటూ ఉంటారు.  భార్యను ఏదైనా మాటలు అన్నా,  భార్యను చిన్నతనంగా చూసినా ఆమెకు మద్దతు ఇచ్చి మాట్లాడాల్సింది పోయి,  వాళ్లతో కలిసి భార్యను నిందించడం చేస్తుంటారు.  ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది.  మహిళలు చాలా భాధపడతారు. ఒంటరితనం.. ప్రతి ఒక్కరూ తమ సంబంధాలలో , కుటుంబంలో తమకు విలువ ఉండాలని కోరుకుంటారు. ప్రతి మహిళ తన మాటకు, తన అభిప్రాయానికి,  తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటారు.  ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కేవలం వివాహ బంధంతో ఇంటికి తెచ్చుకున్న ఒక వ్యక్తిలాగా ఆమెను ట్రీట్ చేస్తే ఆమె మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. ఇతరులతో పోల్చడం.. చాలామంది మగవారు తమ భార్యలను ఇతరులతో పోల్చుతారు.  అమ్మలా వంట చేయలేవు, అక్కలాగా పని చేయలేవు,  ఇలాంటివి మాత్రమే కాకుండా.. శారీరకంగా, ఇతర విషయాలలోనూ ఇతరులతో పోల్చి మాట్లాడటం వల్ల మహిళలు చాలా బాధపడతారు.  ప్రతి మనిషిని మనిషిగా చూడాలి,  వారిలో ప్లస్ పాయింట్స్ ను ఎలా స్వీకరిస్తారో అలాగే మైనస్ ను స్వీకరించాలి. పోల్చడం వల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది.                                    *రూపశ్రీ.
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య కేవలం గొడవలు మాత్రమే ఎక్కువ ఉండి,  ఇద్దరి మధ్య సరైన అవగాహన,  పరస్పర గౌరవం వంటివి లేకపోతే.. ఆ బంధం చాలా పెళుసుగా మారిపోయే అవకాశం ఉంటుంది.  గొడవలు అలకలు ఇద్దరి మద్య బంధాన్ని ఎంత బలం చేస్తాయో.. అవి ఎక్కువైతే ఇద్దరిని అవే విడదీస్తాయి కూడా. నేటికాలంలో చాలామంది తమ బంధం గురించి ఆలోచించి బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ఒక మంచి మార్గం ఉంది. అదే  రిలేషన్షిప్ డిటాక్స్.. శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడం కోసం చాలా  మంది డిటాక్స్ డ్రింకులు తాగుతూ ఉంటారు.  దీనివల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం శుభ్రం అవుతుంది. అదేవిధంగా.. రిలేషన్షిప్ ను డిటాక్స్ చేసుకుంటే.. బంధంలో ఉన్న అనవసర గొడవలు,  ఇబ్బందులు,  అపార్థాలు అన్నీ మంత్రమేసినట్టు మాయమవుతాయి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. భాగస్వామిని బాధపెట్టకుండా బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. భాగస్వామితో మాట్లాడాలి..  రిలేషన్ షిప్ డిటాక్స్ చేయించుకోవాలనుకుంటే, ముందుగా  భాగస్వామితో మాట్లాడాలి. ఎందుకు రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవాలని అనుకుంటున్నారో వివరించాలి.ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాలి. సమస్యలకు కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భాగస్వామి పైవన్నీ అర్థం చేసుకుంటే.. రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవడం సులువు అవుతుంది. దృష్టి.. ప్రతి ఒక్కరు తమపై తాము  దృష్టి పెట్టాలి. ఇది  మానసిక,  భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తమపై తాము దృష్టి పెట్టినప్పుడు, తమ  బలాలు,  బలహీనతలను బాగా అర్థం చేసుకోగలుగుతారు.  ఇవి భవిష్యత్తులో సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సహాయపడతాయి. సమయం.. నేటికాలంలో ప్రతి ఒక్కరు  నిరంతరం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడూ  ఫోన్‌లో ఉండటం వల్ల తమకు తాము సమయం కేటాయించుకోలేకపోతారు. తమకు తాము సమయం కేటాయించుకోనప్పుడు అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. సమయం కేటాయించాలి.  ఫోన్ కు దూరంగా ఉండాలి. బందం గురించి ఆలోచించాలి.  అలాంటప్పుడు అలోచనలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. దూరం.. రిలేషన్షిప్ డిటాక్స్ అంటే.. బంధం నుండి విడిపోవడానికి ప్రయత్నించడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం.  బంధంలో గొడవలు, అపార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. భాగస్వామికి కొన్నాళ్లు దూరంగా ఉండి అన్నీ ఆలోచించుకోవడం వల్ల అన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థం అవుతాయి. అప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవడానికి మార్గాలు కనిపిస్తాయి. బంధం ఎంత ముఖ్యమైనదో కూడా అర్థమవుతుంది.                                        *రూపశ్రీ.
ప్రతి వ్యక్తికి నేటికాలంలో ఇల్లు, ఆఫీసు అంటూ రెండు ప్రదేశాలు ముఖ్యంగా మారాయి.  ఒకటి కుటుంబ సభ్యులతో కలసి ఉండేది అయితే రెండవది కుటుంబ సభ్యులను పోషించడానికి మరొక ప్రదేశంలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసే స్థలం. చాలామంది ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెబుతూ ఉంటారు. ఆఫీసులో గనుక పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు, చిట్కాలతో ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఇవి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని చేసే వారికి అయినా,  లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అయినా చాలా చక్కగా పని చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. పనుల జాబితా.. ఈ చిట్కా ఖచ్చితంగా  సహాయపడుతుంది. ఉదయాన్నే డైరీలో రోజు పనులను రాసుకోవాలి. పైన తేలికైన పనులను,  దిగువన ఎక్కువ సమయం,  శ్రద్ధ అవసరమయ్యే పనులను లిస్ట్  చేయాలి. ఇది  మనస్సు గందరగోళం లేకుండా క్లారిటీగా  ఉంచడానికి సహాయపడుతుంది.  రోజులో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి.. వాటిని ఎప్పుడు చేయాలో అనుకుంటూ  అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. బ్రేక్ ముఖ్యం..  ఎంత పని ఉన్నా సరే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం తప్పు. ప్రతి 25-30 నిమిషాల పని తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవాలి. నీరు త్రాగడం,  కళ్ళు మూసుకోవడం  లేదా కొద్దిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం.. ఇవన్నీ  మనసు అలసిపోకుండా  విశ్రాంతిని ఇస్తాయి.   ఒత్తిడిని తగ్గిస్తాయి. నో చెప్పడం నేర్చుకోండి.. ఇది అతి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ప్రతి పనినీ, మీటింగ్‌నీ లేదా పనిని.. ఇట్లా ఏదైనా సరే.. ఆఫీసులో  అదనపు బాధ్యతను ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా మంది కాస్త మంచిగా మాట్లాడుతూ,  కాస్త పొగుడుతూ ఏదైనా పని చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు.  అలాంటి సందర్భాలలో  మర్యాదగా తిరస్కరించాలి.  ఇది  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అదనపు పని భారం ఒత్తిడికి దారి తీస్తుంది.  ప్రతి ఒక్కరూ నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఎంతో సహాయపడుతుంది. శారీరక శ్రమ..  పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 15-30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది సహజ ఒత్తిడిని తగ్గించే మార్గం.  ఒత్తిడి హార్మోన్లు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయమం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది  ఫిట్‌గా ఉంచుతుంది. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగల యోగా భంగిమలు కొన్ని ఉంటాయి.  అలాంటివి చేసినా బాగుంటుంది.                          *రూపశ్రీ.
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నిమ్మకాయతో చాలామంది చేసుకునే రిఫ్రెష్ డ్రింక్ లలో లెమన్ షర్బత్ ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే  దాని రుచి కోసం అధిక మొత్తంలో చక్కెరను కలుపుతారు. ఈ అలవాటు ఆరోగ్యకరమైన నిమ్మరసం   ప్రయోజనాలను నాశనం చేస్తుంది.  ఏదో అప్పుడప్పుడు  నిమ్మరసం తాగే వారైతే పర్లేదు. కానీ రోజు లెమన్ షర్బత్ తాగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.  అధికంగా చక్కెర కలపడం  ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిమ్మరసం.. భారతీయ ఇళ్లలో ఎన్నో సంవత్సరాల నుండి ఇంటికి వచ్చిన అతిథులకు నిమ్మరసం నీటిని ఇవ్వడం జరుగుతోంది. సాధారణంగా కొందరు నిమ్మరసం తయారీలో తరచుగా నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పోసి కలుపుతారు. ఇది శరీరానికి తేమను అందించి, అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ ముఖ్యంగా వేడి,  తేమతో కూడిన  రోజులలో మంచి  ఉపశమనాన్ని అందిస్తుంది. ఆయుర్వేదంలో కూడా నిమ్మకాయకు ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు. ఇది జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుందని, శరీరాన్ని తాజాగా ఉంచుతుందని,  రోజంతా చురుగ్గా ఉండటంలో సహాయపడుతుందని చెబుతారు.  నిమ్మకాయలోని విటమిన్ సి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చక్కర కలిపితే.. నిమ్మరసంలో ఎక్కువ చక్కెర కలిపినప్పుడు, దానిలోని కేలరీలు పెరుగుతాయి. క్రమం తప్పకుండా అధిక చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం, రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.  అందుకే  నేటి కాలంలో చాలా మంది ఆరోగ్య నిపుణులు , డైటీషియన్లు నిమ్మరసంలో చక్కెర లేకుండా లేదా తక్కువ చక్కెరతో తాగమని చెబుతుంటారు. నారింజ రసం కూడా.. నిమ్మరసం మాత్రమే కాకుండా, నారింజ రసం కూడా చక్కెర కలపకపోవడం మంచిది. నారింజ పండ్లు సహజంగానే తీపిగా ఉంటాయి, కాబట్టి అదనపు చక్కెరను జోడించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పుల్లని నారింజ పండ్ల రసం ఉంటే అందులో కాస్త నల్ల ఉప్పులేద సాధారణ ఉప్పు కొద్దిగా కలిపి తీసుకోవచ్చు. తాజాగా ఉండే, చక్కెర కలపని నారింజ రసం విటమిన్ సి కి మంచి మూలం . శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఫిట్‌నెస్ మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వ్యక్తులు  అదనపు చక్కెర లేని పానీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రుచి మెరుగవ్వాలంటే.. నిమ్మరసం రుచిని మెరుగుపరచడానికి చక్కెర బదులుగా పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పొడి ఉపయోగించవచ్చు. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా, పానీయం  పోషక విలువలను కూడా కాపాడుతుంది. నారింజ రసాన్ని ఎప్పుడూ తాజాగా, చక్కెర కలపకుండా తాగితేనే ఉత్తమంగా ఉంటుంది. ప్యాక్ చేసిన, అధికంగా తీపి కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలని  అనుకునేవారు నిమ్మరసం , నారింజ రసం వంటి సహజ ప్రత్యామ్నాయాలకు మారడం మంచిది.   చక్కెర కలపడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు ఒక చిన్న అలవాటు కూడా  ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.                         *రూపశ్రీ
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం, చర్మం దెబ్బ తినడం  వంటివి జరగకపోయినా, చర్మం మీద నీలం రంగులో మచ్చలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. కొందరికి ఎలాంటి గాయాలు అయినట్లు కూడా గుర్తుండదు.  చాలామంది తరచుగా ఇది సాధారణమే అనుకుని నిర్లక్ష్యం చేస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో, ఇది ఒక శరీరం లోపల ఏదో  సమస్యకు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. పదేపదే కారణం లేకుండా ఏర్పడే గాయాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని  అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే…  మచ్చలు ఎందుకు కనిపిస్తాయి?  కొన్నిసార్లు అధిక శారీరక శ్రమ లేదా తీవ్రమైన వ్యాయామం చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలను ప్రభావితం చేయగలదని నిపుణులు అంటున్నారు. కండరాలపై అధిక ఒత్తిడి ఈ నాళాలు చిట్లిపోవడానికి,  చర్మం కింద రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది, దీని ఫలితంగా నీలి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా జరిగినప్పుడు  ఆ వ్యక్తికి గాయం అయినట్టు తెలియకపోవచ్చు, కానీ మచ్చలు కనిపినస్తుంటాయి. మందులు.. కొన్ని మందులు కూడా చర్మం మీద ఇలా నీలి రంగు మచ్చలకు కారణం కావచ్చు. రక్తాన్ని పల్చబరిచే మందులు, ముఖ్యంగా ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్,  నాప్రోక్సెన్ వంటివి, రక్తం మరింత త్వరగా గడ్డకట్టేలా చేస్తాయి. రక్తం సాధారణ వేగంతో గడ్డకట్టనప్పుడు, అది చర్మం కిందకు కారిపోయి, సులభంగా కమిలిపోతుంది. కొత్త మందులు తీసుకున్న తర్వాత ఈ సమస్య మొదలైతే వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యం.  పోషకాల లోపం.. కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది. విటమిన్ సి లోపం చర్మాన్ని, రక్తనాళాలను బలహీనపరిచి, చిన్న ఒత్తిడికే మచ్చలు ఏర్పడేలా చేస్తుంది. ఐరన్ లోపం రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది, విటమిన్ కె లోపం రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, ఎటువంటి కారణం లేకుండా పదేపదే నీలి మచ్చలు రావడం పోషకాహార లోపానికి సంకేతం కావచ్చట..  ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం.. ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా వంటి అరుదైన సమస్యలలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతాయి. రక్తం గడ్డకట్టడంలో ప్లేట్‌లెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి లోపం వల్ల చర్మంపై అకస్మాత్తుగా నీలం లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో, పదేపదే వచ్చే నీలం మచ్చలు నాన్-హాడ్కిన్స్ లింఫోమా లేదా ఇతర రక్త సంబంధిత సమస్యల వంటి తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం కావచ్చు. ఇది అరుదైనప్పటికీ, తీవ్రమైన అలసట, బరువు తగ్గడం లేదా తరచుగా రక్తస్రావం వంటి లక్షణాలతో పాటుగా ఉంటే వైద్యులను కలిసి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుడిని ఎప్పుడు కలవాలి? ఎటువంటి స్పష్టమైన గాయం లేకుండా  శరీరంపై పదేపదే నీలి మచ్చలు కనిపిస్తే, ఆ మచ్చలు క్రమంగా పెద్దగా అవుతూ పరిమాణంలో పెరుగుతుంటే, తరచుగా ముక్కు నుండి రక్తం కారుతుంటే, లేదా ఆ రక్తస్రావం సులభంగా ఆగకపోతే,  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో వైద్య పరీక్ష చేయించుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యాన్ని దాని ప్రారంభ దశలోనే గుర్తించి, వ3ఎలైనంత తొందరగా చికిత్సను ప్రారంభించవచ్చు.                          *రూపశ్రీ 
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి చాలామంది ఆశ్రయించేది "మల్టీవిటమిన్ టాబ్లెట్లు" (Multivitamin Tablets). అయితే, ఈ టాబ్లెట్లను ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎక్కువగా వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మి కోన గారు అందించిన పూర్తి వివరాలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం. మల్టీవిటమిన్ టాబ్లెట్ల ఉపయోగాలు (Uses of Multivitamins) మన శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి. మల్టీవిటమిన్ల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు: పోషకాహార లోపాన్ని భర్తీ చేయడం: మనం తినే ఆహారంలో లోపించిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను ఇవి శరీరానికి అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల (Immunity Boost): విటమిన్ C, D, మరియు జింక్ వంటి పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. శక్తిని అందించడం (Energy Levels): విటమిన్ B-కాంప్లెక్స్ శరీరంలో ఆహారాన్ని శక్తి గా మార్చడంలో సహాయపడుతుంది, దీనివల్ల అలసట, నీరసం తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం: విటమిన్ E, బయోటిన్ వంటివి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎముకల బలం: క్యాల్షియం మరియు విటమిన్ D కలిసిన మల్టీవిటమిన్లు ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. సరైన డోసేజ్ మరియు వేసుకునే విధానం (Correct Dosage & Guidelines) మల్టీవిటమిన్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని పడితే అన్ని వేసుకోకూడదు. వాటికంటూ ఒక పద్ధతి ఉంటుంది: మల్టీవిటమిన్ టాబ్లెట్లను సాధారణంగా ఉదయం లేదా मధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం మంచిది. పరగడుపున (ఖాళీ కడుపుతో) వేసుకుంటే కొంతమందిలో కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు. కొన్ని విటమిన్లు (A, D, E, K) కొవ్వులో కరిగేవి (Fat-soluble vitamins). కాబట్టి, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. ఎల్లప్పుడూ డాక్టర్ సూచించిన డోస్ మాత్రమే వాడాలి. సొంత నిర్ణయాలతో రోజుకు ఒకటి కంటే ఎక్కువ టాబ్లెట్లు వేసుకోకూడదు. జాగ్రత్త: మితిమీరిన విటమిన్ల వాడకం  చాలామంది మల్టీవిటమిన్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని విపరీతంగా వాడుతుంటారు. కానీ, డాక్టర్ లక్ష్మి కోన గారి ప్రకారం, విటమిన్లు ఎక్కువైతే "విటమిన్ టాక్సిసిటీ" (Vitamin Toxicity / Hypervitaminosis) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ A, D, E, K లు శరీరంలో పేరుకుపోయి కాలేయం (Liver) మరియు మూత్రపిండాల (Kidneys) పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, విటమిన్ D ఎక్కువైతే శరీరంలో క్యాల్షియం పెరిగిపోయి కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విటమిన్ A ఎక్కువైతే తలనొప్పి, వాంతులు మరియు కాలేయ సమస్యలు రావచ్చు. దుష్ప్రభావాలు (Side Effects) సాధారణంగా పరిమితికి లోబడి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో క్రింది లక్షణాలు కనిపించవచ్చు: కడుపులో అశాంతి, వికారం లేదా వాంతులు. మలబద్ధకం (Constipation) లేదా విరేచనాలు (Diarrhea) - ముఖ్యంగా ఐరన్ (Iron) ఎక్కువగా ఉన్న మల్టీవిటమిన్ల వల్ల మలం నల్లగా రావడం మరియు మలబద్ధకం జరుగుతుంది. నోటిలో వింత రుచి (Metallic Taste). ఇతర మందులతో పరస్పర చర్యలు (Drug Interactions) మీరు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడుతుంటే, మల్టీవిటమిన్లు వేసుకునే ముందు జాగ్రత్త వహించాలి: యాంటీబయాటిక్స్: మల్టీవిటమిన్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ (ఉదాహరణకు Tetracyclines) శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచే మందులు): విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు రక్తాన్ని పలచబరిచే మందులు (Warfarin వంటివి) వాడుతుంటే, విటమిన్ K ఉన్న మల్టీవిటమిన్లు వాటి పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా:-  మల్టీవిటమిన్ టాబ్లెట్లు అనేవి సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.. సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా వచ్చే పోషకాలే శరీరానికి అత్యంత శ్రేష్ఠమైనవి.  మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)