లక్కీ సీజన్ లో పూజ డబుల్ హిట్స్ కొడుతుందా!?
on Jan 21, 2022
ప్రస్తుతం చేతినిండా సినిమాలున్న కథానాయికల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా ముచ్చటగా మూడు భాషల్లో కలిపి అరడజను చిత్రాలు చేస్తోంది పూజ. వీటిలో మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. ఒక చిత్రం సెట్స్ పై ఉంది. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ వేసవిలో పూజా హెగ్డే నటించిన రెండు చిత్రాలు రెండు వారాల గ్యాప్ లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాలే.. `ఆచార్య`, `బీస్ట్`. సోషల్ డ్రామాగా రూపొందిన టాలీవుడ్ ప్రాజెక్ట్ `ఆచార్య` ఏప్రిల్ 1న రిలీజ్ కి రెడీ అవుతుండగా.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన తమిళ చిత్రం `బీస్ట్` ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి రానుంది.
Also Read: వెంకీతో శివ నిర్వాణ ఫ్యామిలీ డ్రామా!?
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సమ్మర్ సీజన్ లో ఇప్పటివరకు పూజ సందడి చేసిన చిత్రాలు మంచి విజయం సాధించాయి. 2018లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన `రంగస్థలం` (ఇందులో పూజ ఓ ప్రత్యేక గీతం చేసింది), 2019లో వసూళ్ళ వర్షం కురిపించిన చిత్రాల్లో ఒకటైన `మహర్షి`.. ఆయా సంవత్సరాల్లో వేసవిలోనే వినోదాలు పంచాయి. మరి.. తనకి లక్కీ సీజన్ గా నిలిచిన సమ్మర్ లో `ఆచార్య`, `బీస్ట్`తో పూజ డబుల్ హిట్స్ అందుకుంటుందేమో చూడాలి.