
- పెద్ది రిలీజ్ డేట్పై గందరగోళం
- ఏప్రిల్ 30నే వస్తుందా లేదా జూన్లో వస్తుందా?
- క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన ఎస్కేఎన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi). గ్లోబల్ స్టార్గా ఎదిగిన చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.
నిజానికి మార్చి 27న విడుదల కావాల్సిన పెద్ది, ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా కష్టమే అంటున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి పోస్ట్ పోన్ న్యూస్ ఊపందుకున్నాయి. పెద్ది కొత్త విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ రకంగా ఈ చర్చకు కారణమైన నిర్మాత ఎస్కేఎన్ (SKN) తాజాగా ఈ విషయంలో స్పందిస్తూ మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రానికి ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఒక ఈవెంట్ లో ఎస్కేఎన్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 26న విడుదలవుతుందని అందుకే తమ సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకుంటున్నామని ప్రకటించారు.
మెగా కాంపౌండ్ కి దగ్గరగా ఉండే నిర్మాత నోటి నుంచి ఈ మాట రావడంతో, 'పెద్ది' విడుదల ఏప్రిల్ 30 నుండి జూన్కు వాయిదా పడిందని అందరూ ఫిక్స్ అయిపోయారు.ఈ న్యూస్ వైరల్ కావడంతో మెగా అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్కేఎన్ ఒక వీడియోను విడుదల చేస్తూ అసలు విషయం వివరించారు.
ఈవెంట్లో ఎస్కేఎన్ తో సాయి రాజేష్ మాట్లాడుతూ.. 'పెద్ది' జూన్ 26న రానుందని సోషల్ మీడియాలో ట్వీట్లు కనిపిస్తున్నాయని, ఆ టీం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు మన సినిమా డేట్ అనౌన్స్ చేయొద్దు అని చెప్పారట. అయితే ఆ సమయంలో అక్కడ సౌండ్ డిస్టబెన్స్ వల్ల వల్ల సాయి రాజేష్ మాటలను ఎస్కేఎన్ తప్పుగా అర్థం చేసుకున్నారట.
'పెద్ది' మేకర్స్ అప్పటికే డేట్ను అధికారికంగా ప్రకటించేశారని పొరబడిన ఎస్కేఎన్, స్టేజి మీద ఆ విషయాన్ని చెప్పేశారు. తన వల్ల జరిగిన ఈ చిన్న మిస్ కమ్యూనికేషన్కు ఆయన చింతిస్తూ, "పెద్ది లాంటి పెద్ద సినిమా అప్డేట్స్ ఆ ప్రొడక్షన్ హౌస్ నుండే రావాలి. నేను పొరపాటున ఆ డేట్ చెప్పినందుకు క్షమించండి" అన్నారు. దీంతో పెద్ది వాయిదాపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రారా' సాంగ్స్ చార్ట్బస్టర్స్ గా నిలిచాయి. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ ఉంది. ఏప్రిల్ 30నే వస్తుందా లేదా ఎస్కేఎన్ చెప్పినట్లు జూన్లో వస్తుందా అన్నది 'పెద్ది'ని నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: మెగా సర్ప్రైజ్.. మాఫియా డాన్గా చిరంజీవి!






