
-రంభ ఇంట్లో తీవ్ర విషాదం
-నా ప్రపంచం మొత్తం శూన్యమైపోయింది అంటూ పోస్ట్
-చిరంజీవితో పాటు ప్రముఖుల నివాళి
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ(Rambha)కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంభకి ఎంతగానో అండగా నిలిచే, ఎంతో ప్రేమించే తండ్రి వెంకటేశ్వరరావు హఠాత్తుగా కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పాటు ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన, సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన రంభకి తన తండ్రి అంటే ఎనలేని ప్రేమ. రంభ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గరనుంచి వెంకటేశ్వరరావు ఎంతో మద్దతుగా నిలిచారు. ప్రతి కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, ఆమె కెరీర్ సక్సెస్లో 100 శాతం వెన్నుదన్నుగా ఉన్నారు. దీంతో తన తండ్రి ఇక లేరు అనే నిజాన్ని రంభ తట్టుకోలేకపోతోంది. ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ లో 'నా ప్రపంచం మొత్తం శూన్యమైపోయింది. నా హృదయంలో మీ స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరు నాన్నా" అంటూ ఆమె రాసుకొచ్చిన మాటలు అభిమానులు నెటిజన్లని కలచివేస్తున్నాయి.
Also read: Mouni roy: నెట్టింట వైరల్ అవుతున్న మౌని రాయ్ గ్లామర్ పిక్స్.. విడాకుల దారి విడాకులదే
1990వ దశకంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 100 కి పైగా సినిమాల్లో నటించి, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన బ్లాక్బస్టర్ హిట్లు అందుకున్న రంభ.. ప్రస్తుతం తన భర్త ఇంద్రకుమార్ పద్మనాథన్, ముగ్గురు పిల్లలతో కలిసి కెనడాలో స్థిరపడిన సంగతి తెలిసిందే. తండ్రి మరణవార్త విన్న వెంటనే రంభ స్వదేశానికి బయలుదేరినట్లు సమాచారం. వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు రంభకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు.







