పాతికేళ్ళ `ఎగిరే పావురమా..`!
on Jan 29, 2022
కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఆయన తెరకెక్కించిన విజయవంతమైన చిత్రాల్లో `ఎగిరే పావురమా..` ఒకటి. మలయాళ సినిమా `సల్లాపం` (1996) ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్, జేడీ చక్రవర్తి కథానాయకులుగా నటించగా, అందాల తార లైలా ఈ మూవీతోనే తెలుగునాట హీరోయిన్ గా తొలి అడుగేసింది. ఇందులో సుహాసిని, చరణ్ రాజ్, నిర్మలమ్మ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, తనికెళ్ళ భరణి, ఝాన్సీ, శ్రీలక్ష్మి, వై. విజయ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఒరిజనల్ వెర్షన్ లో హీరో పాత్ర `జూనియర్ ఏసుదాస్`గా ఎంటర్టైన్ చేస్తే.. తెలుగులో `జూనియర్ బాలు`గా సందడి చేయడం విశేషం.
Also Read: మహానటి కోసం మెగాస్టార్
ఎస్వీ కృష్ణారెడ్డి బాణీలకు దిగ్గజ గీత రచయితలు వేటూరి సుందరరామ్మూర్తి, `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, భువనచంద్ర సాహిత్యమందించారు. ఇందులోని ``మాఘమాసం ఎప్పుడొస్తుందో`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``ఆహా ఏమి రుచి``, ``గుండె గూటికి పండగొచ్చింది``, ``ఎగిరే పావురమా``, ``చిటపట చినుకు``, ``రూనా లైలా``, ``బ్రహ్మలు గురు బ్రహ్మలు``, ``దిస్ ఈజ్ ద రిథమ్`` అంటూ సాగే గీతాలు కూడా సంగీతప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్రవంతి ఆర్ట్ మూవీస్ సమర్పణలో చంద్రకిరణ్ ఫిల్మ్స్ పతాకంపై పి. ఉషారాణి నిర్మించిన `ఎగిరే పావురమా..`.. 1997 జనవరి 30న విడుదలై జననీరాజనాలు అందుకుంది. ఆదివారంతో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ పాతికేళ్ళు పూర్తిచేసుకుంటోంది.