Home  »  News  »  శ్రీతేజ్‌ విషయంలో అనుకున్నంతా అయ్యింది..!

Updated : Jan 30, 2025

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్‌ ఘటన గురించి దాదాపు అందరూ మర్చిపోయారు. కానీ, ఆ ఘటనలో నష్టపోయిన భాస్కర్‌ కుటుంబాన్ని మాత్రం అది ఇంకా వెంటాడుతూనే ఉంది. డిసెంబర్‌ 4న జరిగిన ఈ ఘటనలో భార్య రేవతిని కోల్పోయిన భాస్కర్‌.. తీవ్రంగా గాయపడిన కుమారుడు శ్రీతేజ్‌ను బ్రతికించుకునేందుకు, మామూలు మనిషిని చేసుకునేందుకు తపిస్తున్నారు. శ్రీతేజ్‌ చికిత్స విషయంలో ప్రభుత్వంగానీ, పుష్ప2 టీమ్‌గానీ ఎన్ని హామీలు ఇచ్చినా, ఎంత సహాయం చేసినా అతను సాధారణ స్థితికి రాకపోవడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. 

ఘటన జరిగిన రోజు వెంటనే శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే అతను కోమాలోకి వెళ్లిపోయి ఉండడం, చికిత్సకు అతని శరీరం సహకరించకపోవడంతో ఆ కుర్రాడికి ఏం జరుగుతుందోనని అంతా టెన్షన్‌ పడ్డారు. వాస్తవానికి ఘటన జరిగిన సమయంలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీతేజ్‌ను గమనించిన పోలీసులు దగ్గరకి వెళ్లి చూడగా అతని ఊపిరి ఆగిపోయిందని గుర్తించారు. వెంటనే అతనికి సీపీఆర్‌ చేయడం వల్ల మళ్ళీ ఊపిరి తీసుకోగలిగాడు. ఆ క్షణమే అతన్ని కిమ్స్‌ హాస్పిటల్‌కి తరలించారు. ఆరోజు నుంచి అక్కడి వైద్యులు అతనికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కానీ, ఫలితం మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది. మొదట్లో ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు శ్రీతేజ్‌. ఆ తర్వాత కొన్నాళ్ళకు సాధారణంగానే ఊపిరి తీసుకుంటూ ఉండడంతో వెంటిలేటర్‌ను తొలగించారు. 

శ్రీతేజ్‌కు 58 రోజులుగా చికిత్స అందిస్తున్నారు. కానీ, ఆశించిన ఫలితం రాలేదు. సాధారణంగా ఊపిరి తీసుకునే స్థాయికి వచ్చాడు తప్ప అంతకుమించి ఏమీ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు రెండు నెలలుగా కళ్లు తెరవలేదు, నోరు విప్పి మాట్లాడలేదు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో అర్థంకాని స్థితిలో ఉన్నారు తండ్రి భాస్కర్‌. ప్రస్తుతం ముక్కుకి అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్‌ రూపంలో ఆహారం అందిస్తున్నారు. శ్రీతేజ్‌ కళ్లు తెరిస్తే చూడాలని, అతను మాట్లాడితే వినాలని తండ్రి భాస్కర్‌, చెల్లెలు శాన్విక ఎదురుచూస్తున్నారు. శ్రీతేజ్‌ పూర్తిగా కోలుకోవడానికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని, అవసరమైతే విదేశాలకు సైతం తీసుకెళ్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుతం శ్రీతేజ్‌ ఆరోగ్య స్థితిలో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.