![]() |
![]() |
టాలీవుడ్ హీరోలలో ఎన్టీఆర్కి ఉన్న ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. తన సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ అభిమానగణాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సినిమాలు తప్ప మరో విషయానికి ప్రాధాన్యం ఇవ్వని ఎన్టీఆర్ని అతని ప్రమేయం లేకపోయినా రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్కి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేసేందుకు కొందరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీకి, టిడిపికి మధ్య రాజకీయ వైరం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఏదో ఒక కారణంతో టీడీపీని అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటుందనే విషయం కూడా అందరికీ తెలుసు. అయితే వారిద్దరి మధ్యలోకి ఎన్టీఆర్ని లాగడమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల జోలికి వెళ్ళకూడదని ఎన్టీఆర్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు.
2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అప్పుడతని వయసు 26 సంవత్సరాలు మాత్రమే. రాజకీయాల జోలికి వెళితే తన కెరీర్కే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని గ్రహించిన ఎన్టీఆర్ ఆ తర్వాత అటువైపు వెళ్ళలేదు. తన సినిమా కెరీర్పైనే దృష్టి పెట్టి టాలీవుడ్లో స్టార్ హీరో రేంజ్కి ఎదిగారు. ఆ తర్వాత కూకట్పల్లి నుంచి తన సోదరి పోటీ చేస్తున్నా ఎలాంటి ప్రచారానికి వెళ్ళలేదు. అయితే వ్యక్తిగతంగా తన మద్దతును తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కొన్ని అనవసరమైన విషయాల్లో ఎన్టీఆర్ని లాగడం అనేది అభిమానులకు ఆందోళన కలిగిస్తున్న విషయం.
ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలు విడుదలైన ప్రతిసారీ ఏదో ఒక విషయంలో ఎన్టీఆర్ను హైలైట్ చేసి దానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఫేక్ ఎకౌంట్లు సృష్టించి వాటి ద్వారా ఎన్టీఆర్ను నందమూరి ఫ్యామిలీ, తెలుగుదేశం పార్టీ దృష్టిలో అప్రతిష్టపాలు చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఇటీవల కూలీ, వార్2 చిత్రాలు ఒకేరోజు విడుదలైన విషయం తెలిసిందే. సినిమా రంగంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూలీ రిలీజ్ అవ్వడంతో రజినీకాంత్కి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు నారా లోకేష్. అదే సమయంలో వార్2 గురించి పట్టించుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న వైసీపీ వర్గాలు.. ఎన్టీఆర్ అభిమానుల్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ని సపోర్ట్ చెయ్యని తెలుగుదేశం పార్టీకి మీరెందుకు సపోర్ట్ చేస్తారంటూ వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ దృష్టి మాత్రం పూర్తిగా సినిమాలపైనే ఉంది. తను ఏం మాట్లాడినా దానికి పలు అర్థాలు సృష్టిస్తారనే కారణంగా చాలా విషయాల్లో మౌనంగానే ఉంటున్నారు. ‘వార్2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమాలే తన లక్ష్యం అని స్పష్టం చేశారు ఎన్టీఆర్. అయినప్పటికీ అతని ప్రసంగంలోని కొన్ని మాటలను రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఫేక్ ఎకౌంట్స్ క్రియేట్ చేసుకొని టీడీపీకి, ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ పెంచేందుకు వైసీపీ వర్గాలు చేస్తున్న కుట్ర ఇదని టీడీపీ వర్గాలు చెబుతున్నమాట. ఏది ఏమైనా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తున్న ఎన్టీఆర్ను తమ రాజకీయ లబ్ది కోసం వివాదాల్లోకి లాగడం సరైంది కాదని అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |