కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉధృతికి ఎంతోమంది తమ ఆత్మీయుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని కోల్పోయి దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నారు. టాలీవుడ్లోనూ పలువురు కొవిడ్ 19 బారినపడుతున్నారు. కొంతమంది త్వరగా కోలుకుంటుండగా, కొంతమంది ఆ వైరస్పై చాలా రోజుల పాటు పోరాడి ఎట్లాగో ప్రాణాలు దక్కించుకుంటున్నారు. ఇంకొందరు దానిని జయించలేక అసువులు బాస్తున్నారు. లేటెస్ట్గా టీఎన్ఆర్, నంద్యాల రవి లాంటివాళ్లు ప్రాణాలు పోగొట్టుకోవడంతో వారి కుటుంబాల బాధ వర్ణనాతీతం. ఇండస్ట్రీ మొత్తంగా ఈ ఉదంతాలతో విషాద వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఫస్ట్ వేవ్ టైమ్లో మిగతా సెలబ్రిటీలతో కలిసి కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ప్రారంభించి తెలుగు చిత్రసీమ కార్మికుల్ని ఆదుకున్న ఆయన కరోనా విషయంలో అలక్ష్యం చూపవద్దని సూచించారు.
చిరంజీవి మాట్లాడుతూ, "కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలామంది వైరస్ బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. వైరస్ వల్ల మన ఆత్మీయుల్ని కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతోంది. ఈ తప్పని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ వేశారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా ఉండండి. ఇంటి నుంచి బయటకు రావొద్దు.అత్యవసరమై బయటికి వచ్చినపుడు తప్పకుండా మాస్క్ ధరించండి. వీలైతే డబుల్ మాస్క్ ధరించండి. అని సూచించారు.
లాక్డౌన్ లో కూడా వ్యాక్సినేషన్ సాగుతోందని, రిజిస్ట్రేషన్ చేసుకుని అందరూ వ్యాక్సినేషన్ తీసుకోండని చిరుంజీవి చెప్పారు. "ఆ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చినా ప్రభావం తక్కువ. కోవిడ్ పాజిటివ్ వచ్చినా ప్యానిక్ అవ్వకండి. వైరస్ కంటే మన భయమే మనల్ని ముందుగా చంపేస్తోంది. కరోనా పాజిటివ్ అని తెలియానే ఐసోలేషన్ కి వెళ్లండి. మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. డాక్టర్ ని సంప్రదించండి. మందులు వాడండి. ఊపిరి సమస్య తలెత్తితే వెంటనే ఆస్పత్రిలో చేరండి.. కరోనా చికిత్స పొందిన తర్వాత నెలరోజుల్లో యాంటీబాడీస్ తయారవుతాయి. మీరు ప్లాస్మా దానం చేస్తే ఒక్కొక్కరు మరో ఇద్దరిని కాపాడిన వారు అవుతారు. ఈ విపత్తు సమయంలో వీలైనంత మందికి ఈ విషయం చెప్పండి. మనల్ని మనం కాపాడుకుంటే దేశాన్ని రక్షించిన వాళ్లం అవుతాం. అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండండి." అని ప్రజల్ని కోరారు.