![]() |
![]() |

స్టార్ యాక్టర్ సూర్యను కొట్టినవాళ్లకు డబ్బులిస్తామని ప్రకటించిన పీఎంకే నాయకుడు సీతమల్లి పళనిస్వామిపై తమళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా సూర్యపై దాడిచేసి కొడితే, వారికి లక్ష రూపాయల క్యాష్ అందిస్తామని పళనిస్వామి అనౌన్స్ చేశారు. సూర్యకు వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో, ఆయనకూ, ఆయన ఇంటికీ పోలీసులు భద్రత కల్పించారు.
తమిళనాడు హైకోర్టు న్యాయవాదిగా సూర్య నటించిన 'జై భీమ్' సినిమా ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో విడుదలై, విశేష ప్రశంసలను అందుకుంది. రాజాకన్ను అనే అమాయకుడిపై దొంగతనం కేసు బనాయించి, అతడిని చిత్రహింసలకు గురిచేసి, లాకప్లో హత్యచేసిన పోలీసులపై న్యాయపోరాటం చేసిన ఆయన భార్య పార్వతి కథతో ఈ సినిమా రూపొందింది. పార్వతికి అండగా నిలిచిన లాయర్ చంద్రుగా సూర్య నటించాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిసింది. ఇక ఐఎండీబీలో హాలీవుడ్ క్లాసిక్స్ను అధిగమించి మరీ అత్యధిక రేటింగ్ సాధించి చరిత్ర సృష్టించింది 'జై భీమ్'.
అయితే ఈ సినిమాలో వన్నియార్ కమ్యూనిటీని తప్పుగా చూపించారంటూ ఇటీవల వివాదం తలెత్తింది. నవంబర్ 15న సూర్య, జ్యోతిక, డైరెక్టర్ టి.జె. జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు తమ జాతి గౌరవాన్ని దెబ్బతీసేలా ఈ సినిమా ఉందంటూ వన్నియార్ సంగమ్ లీగల్ నోటీస్ పంపింది.
![]() |
![]() |