![]() |
![]() |

బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి హీరోగా, నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత హీరోయిన్గా నూతన చిత్రం ప్రారంభం అయింది. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్పై మహా మూవీస్తో కలిసి మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్ కొట్టగా.. ఏఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మీడియాతో చిత్ర యూనిట్ మాట్లాడింది.
అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ.. "బిగ్ బాస్ కంటే ముందే ఈ చిత్రాన్ని ఓకే చేశాను. డైరెక్టర్ మాల్యా నా ఫ్రెండ్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒప్పుకున్న సినిమా అయితే కాదు. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు సైన్ చేసి వెళ్లాను. చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ నా కోసం రాసుకున్నారు. నా కోసమే డిజైన్ చేశారు. థాంక్యూ మాల్యా. మహేంద్ర గారి సపోర్ట్ను ఎప్పుడూ మరచిపోలేను. ఆయన ఆర్టిస్టులకు ఎంతో గౌరవం ఇస్తుంటారు. సుప్రితతో పని చేస్తుండడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎలా ఉండబోతోందని మేం చెప్పడం కంటే.. మూవీ చూసి మీరే చెప్పాలి. మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు వచ్చిన వారందరికీ థాంక్స్" అని అన్నారు.
సుప్రిత మాట్లాడుతూ.. "నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అమర్ దీప్ గారితో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఇక్కడకు వచ్చిన అందరికీ థాంక్స్" అని అన్నారు.

నిర్మాత మహేంద్ర నాథ్ మాట్లాడుతూ.. "ఎం 3 బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం. 2 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అమర్ దీప్, సుప్రిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇండియన్ సినిమాలో ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్. చాలా కొత్త పాయింట్" అని అన్నారు.
దర్శకుడు మాల్యాద్రి రెడ్డి మాట్లాడుతూ.. "మా లాంటి కొత్త వాళ్ళని ఎం3 మీడియా ఎంతో ప్రోత్సహించింది. ఇంకా మాలాంటి కొత్త వాళ్ళని, యంగ్ టాలెంట్ ఉన్న వాళ్లని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. "బిగ్ బాస్ ఇంట్లో మా ఇద్దరికీ ఎంతో మంది మెమోరీస్ ఉన్నాయి. మేం ఇద్దరం అంటే చాలా ఇష్టమని ఫ్యామిలీ ఆడియన్స్ చెబుతుండేవారు. మా లాంటి వాళ్లకు ఆడియన్స్, అభిమానులే బ్యాక్ గ్రౌండ్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
సురేఖా వాణి మాట్లాడుతూ.. "దర్శక నిర్మాతల మీద నమ్మకంతోనే నా బిడ్డను వాళ్ల చేతుల్లో పెట్టాను. అందుకే ఈ చిత్రానికి ఒప్పుకున్నాను. అమర్ దీప్, సుప్రితలను ఆశీర్వదించడానికి ఇంత మంది రావడంతో ఇదే పెద్ద విజయంలా అనిపించింది. మా సినిమాకు మీడియా సహకారం అందించాలి" అని అన్నారు.
రాజారవీంద్ర, రూపాలక్ష్మి, వినోద్ కుమార్, ఎస్తేర్ నొరోన్హా, ఆకు మాణిక్ రెడ్డి, తల్లాడ సాయి కృష్ణ, మహబూబ్ బాషా, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఈ చిత్రంలో నటిసున్నారు. దాస్ కడియాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ గా మరుధూరి రాజా, సినిమాటోగ్రాఫర్ గా బాల సరస్వతి, ఆర్ట్ డైరెక్టర్ గా అశోక్ నర్రా, ఎడిటర్ గా మేనగ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |