Home  »  News  »  రాత్రి పూట ఆ గంట మోగితే శవం పడాల్సిందే! 'వీరభద్రుని రహస్యం' ఓటీటీ రివ్యూ!

Updated : Jul 13, 2026

టెలివిజన్ చరిత్రలో 'మర్మదేశం' సీరియల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సరిగ్గా అదే తరహా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జీ5 ఓటీటీ వేదికగా మన ముందుకు వచ్చింది 'వీరభద్రుని రహస్యం' వెబ్ సిరీస్. దర్శకుడు భీమాగాని శ్రీవర్ధన్ రెడ్డి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ మొత్తం 60 ఎపిసోడ్స్ ప్లాన్ చేయగా, ప్రస్తుతం మొదటి సీజన్‌లో భాగంగా 10 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. కథ విషయానికి వస్తే ఇది 1972 నుండి 1992 మధ్య కాలంలో 'వీరభద్రపురం' అనే ఒక మారుమూల గ్రామంలో సాగే వింతల సమాహారం. అడవిని ఆనుకుని ఉండే ఆ ఊరికి యోగానందం పెద్దగా ఉంటాడు. అతని తల్లి నాంచారమ్మ పరమ గయ్యాళి, వడ్డీ వ్యాపారం చేస్తూ ఊరి జనాన్ని పీల్చి పిప్పి చేస్తుంది.

ఈ ఊరి మధ్యలో ఉండే ఒక పెద్ద మర్రిచెట్టు సన్నిధినే గ్రామస్తులంతా వీరభద్రస్వామి ఆలయంగా భావిస్తారు. అక్కడ పాతకాలం నాటి ఒక 'ధర్మగంట' వేలాడుతూ ఉంటుంది. ఆ ధర్మగంట అర్ధరాత్రి పూట మ్రోగింది అంటే, ఊరిలో ఏదో అన్యాయం జరిగిందని, ఆ అక్రమానికి పాల్పడిన వ్యక్తిని వీరభద్రస్వామి అంతం చేశాడని గ్రామస్తుల నమ్మకం. ఈ భయం వల్ల పొద్దుపోయిన తర్వాత ఆ ఊరిలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రారు. చిత్రం ఏంటంటే, అలా చనిపోయిన వారికి అంతక్రియలు చేయరు. యోగానందం ఆ శవాలను తీసుకుని వెళ్లి ఊరి చివర ఉన్న 'గద్దల గుట్ట'పై వదిలేసి రావాలి. ఇది ఆ కుటుంబానికి ఉన్న ఒక వింత శాపం. ఈ భయానక వాతావరణం ఇలా ఉంటే, మరోవైపు తరచూ ఆ గ్రామంపై బందిపోట్లు పడి గ్రామస్తుల సొమ్మును దోచుకుంటూ ఉంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో పట్నంలో మెడిసిన్ పూర్తి చేసిన యోగానందం కూతురు కల్పన, తన స్నేహితురాలైన వెన్నెలతో కలిసి ఊరిలోకి అడుగుపెడుతుంది. నిజానికి వెన్నెల తన తండ్రి రామస్వామి ఆచూకీ తెలుసుకోవడం కోసమే ఆ గ్రామానికి వస్తుంది. కానీ అక్కడ జరుగుతున్న వింతలు, హత్యలను చూసి చలించిపోతుంది. ఇదంతా దేవుడి మహిమ కాదు, ఎవరో మనుషులే చేస్తున్న కుట్ర అని నమ్మి, పోలీస్ ఆఫీసర్ రవికి ఫిర్యాదు చేస్తుంది. వీరభద్రస్వామికి ఎదురెళ్లవద్దని స్థానికులు హెచ్చరించినా ఆమె వినదు. మరి వెన్నెల తన తండ్రి జాడ తెలుసుకోగలిగిందా? ఆ ధర్మగంట వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? బందిపోట్ల నాయకుడు ఎవరు? అనేదే మిగతా ఉత్కంఠభరితమైన కథ.

నటీనటుల విషయానికి వస్తే చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఆనీ ఇందులో వెన్నెలగా ప్రధాన పాత్ర పోషించింది. అయితే కొన్ని సీన్లలో ఆమె వయసు ఈ పాత్రకు చిన్నదిగా అనిపిస్తుంది. రఘు కుంచె యోగానందంగా, అనూరాధ నాంచారమ్మగా తమ పరిధి మేర నటించారు. సాంకేతికంగా చూస్తే సుధా శ్రీనివాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా పనితనం, లైటింగ్ ఈ సిరీస్‌కు పెద్ద ప్లస్ పాయింట్లు. లొకేషన్స్ కూడా 1970ల నాటి అనుభూతిని ఇస్తాయి. అయితే కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా ఉండటం, సంభాషణలు బలహీనంగా అనిపించడం ఈ సిరీస్ లోపాలు. మొత్తం 5 కి 2.25 రేటింగ్ సాధించిన ఈ మొదటి 10 ఎపిసోడ్స్ ఓ మాదిరిగా సాగుతాయి. మిగిలిన 50 ఎపిసోడ్లలోనైనా సస్పెన్స్ మరింత పీక్స్‌కు వెళ్తుందేమో చూడాలి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు జీ5 లో దీనిపై ఒక లుక్ వేయొచ్చు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.