Home  »  News  »  Tollywood Trending: 'కల్కి 2'లో మరో హీరో.. 'బాహుబలి 2'ను క్రాస్ చేసిన 'ధురందర్ 2'..!

Updated : Apr 27, 2026

1. నిర్మాతల హీరో బాలయ్య!
నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమా కోసం నిర్మాత శ్రేయస్సు కోరి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తగ్గించుకోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం.. బాలయ్య తన పారితోషికాన్ని రూ. 40 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు తగ్గించుకున్నారు. వరుస విజయాల్లో ఉన్నా కూడా నిర్మాతల భారం తగ్గించేలా బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో ఆదర్శంగా నిలుస్తోంది.

2. మెగా ఇంటర్వెల్ ప్లాన్ చేస్తున్న బాబీ?
బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 158వ సినిమా చేస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ వేసి, అందులో ఇంటర్వెల్ సన్నివేశం చిత్రీకరించనున్నారు. ఈ షూట్‌లో ప్రకాష్ రాజ్ సహా ప్రధాన తారాగణం పాల్గొంటారు. ఇంటర్వెల్ తో పాటు, సెకండ్ హాఫ్ వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.

3. ప్రభాస్ 'కల్కి 2'లో మరో హీరో
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కి 2' గురించి అదిరిపోయే అప్‌డేట్స్ వస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఒక పవర్‌ఫుల్ స్పెషల్ రోల్ ఉంటుందని, ఆ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కనిపించే అవకాశం ఉందని సమాచారం. తాజా షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్ సిద్ధం కాగా.. అందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొనే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు.

4. బోయపాటికి హీరో దొరికేశాడు!
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

5. 'పెద్ది' రాకకు రూట్ క్లియర్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'పెద్ది' విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని జూన్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఎమోషనల్ డ్రామా.. రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

6. బాలయ్య-కొరటాల మూవీ ముహూర్తం ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కలయికలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ చిత్రం.. కొరటాల మార్క్ సామాజిక సందేశంతో పాటు బాలయ్య శైలి మాస్ యాక్షన్ అంశాలతో రూపొందనుంది. ఇది మే తొలివారంలో లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. ఈ మూవీ కోసం ఇప్పటికే కథా చర్చలు ముగిసి, ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

7. సుబ్బలక్ష్మి బయోపిక్‌ లో డ్రాగన్ బ్యూటీ 
కర్ణాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా కోసం గత కొన్నాళ్లుగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సుబ్బలక్ష్మి పాత్ర కోసం మొదట సాయి పల్లవి పేరు వినిపించగా, తాజాగా కన్నడ నటి రుక్మిణి వసంత్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'డ్రాగన్'లో నటిస్తున్న రుక్మిణి.. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యేలా ఉంది.

8. కోలీవుడ్ సంచలన నిర్ణయం
తమిళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్ సినిమాల వల్ల నిర్మాతలు ఎదుర్కొంటున్న నష్టాలను నివారించేందుకు.. ఇకపై హీరోలు, టాప్ టెక్నీషియన్లకు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ కాకుండా 'రెవెన్యూ షేరింగ్' పద్ధతిని అమలు చేయాలని తీర్మానించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం, సినిమా సాధించే లాభనష్టాల్లో నటీనటులు కూడా భాగస్వాములు అవుతారు. దీనివల్ల నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గుతుంది.

9. అమీర్ ఖాన్ ఎమోషనల్..
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ నటించిన 'ఏక్ దిన్' సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. కొడుకు నటనను వెండితెరపై చూసి అమీర్ కంటతడి పెట్టుకున్నారు. అమీర్ పక్కన కూర్చున్న సాయిపల్లవి.. ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఏక్ దిన్'తో జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతుండగా, సాయి పల్లవికి ఇది తొలి హిందీ సినిమా కావడం విశేషం.

10. 'బాహుబలి 2'ను క్రాస్ చేసిన 'ధురందర్ 2
భారతీయ సినీ చరిత్రలో రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్ 2' సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,800 కోట్లక గ్రాస్ వసూళ్లను సాధించి, 'బాహుబలి 2' రికార్డును అధిగమించింది. దీంతో 'దంగల్' తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా ధురందర్-2 నిలిచింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.