![]() |
![]() |

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్లో ఉంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా 'మైసా' (Mysaa) అనే లేడీ ఓరియెంటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
'మైసా' చిత్రం గోండ్ గిరిజన తెగల నేపథ్యంతో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రష్మిక ఒక శక్తివంతమైన గిరిజన యువతిగా, వారియర్ అవతారంలో కనిపించనుంది. ముఖంపై రక్తపు మరకలు, చేతిలో ఆయుధం, ముక్కుపుడకతో ఆమె కనిపిస్తున్న తీరు చూస్తుంటే, ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఉగ్రరూపంలో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. "ధైర్యం ఆమె బలం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి" అంటూ చిత్ర బృందం ఇచ్చిన ట్యాగ్ లైన్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఈ పాత్ర కోసం రష్మిక మందన్న ఎంతో శ్రమిస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ రోల్ కావడంతో ఆమె బ్యాంకాక్, ఇటలీ వంటి ప్రాంతాల్లో అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ తీసుకుంది. మార్షల్ ఆర్ట్స్, కత్తి యుద్ధం, వివిధ రకాల పోరాట విన్యాసాల్లో రష్మిక ప్రాక్టీస్ చేస్తుంది. ప్రస్తుతం కేరళ అడవుల్లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ లో రష్మిక స్టంట్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని సమాచారం. దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్తో అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
'పుష్ప', 'యానిమల్' వంటి విజయాలతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన రష్మిక, 'మైసా'తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఒక యోధురాలిగా ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.
![]() |
![]() |