![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) చిక్కుల్లో పడ్డ 'కాంతార' (Kantara) మిమిక్రీ వివాదం ఎట్టకేలకు ఒక ముగింపునకు వచ్చింది. దైవ సంప్రదాయాలను అవమానించారనే ఆరోపణలపై నమోదైన కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రణవీర్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు, మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని కోర్టు ఆదేశించింది.
గతేడాది గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' (IFFI) వేదికపై రణవీర్ సింగ్ ప్రసంగిస్తూ.. 'కాంతార' సినిమాలో రిషబ్ శెట్టి నటనను కొనియాడారు. ఈ క్రమంలో సినిమాలోని పంజుర్లి దైవం నటనను అనుకరిస్తూ, దైవాన్ని ఆడ దెయ్యం అని సంబోధించారు. తీర ప్రాంత కర్ణాటక ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే దైవ సంప్రదాయాన్ని రణవీర్ కించపరిచారంటూ బెంగళూరుకు చెందిన అడ్వకేట్ ప్రశాంత్ మెతల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రణవీర్పై కేసు నమోదైంది.
ఈ కేసును కొట్టివేయాలని రణవీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం.. సెలబ్రిటీలు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు మతపరమైన, సంస్కృతి పరమైన విషయాల్లో ఎంతో బాధ్యతగా ఉండాలని హితవు పలికింది.
రణవీర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని, కేవలం రిషబ్ శెట్టి నటనను అభినందించే క్రమంలోనే అలా అన్నారని, దీనికి సంబంధించి ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు.
హైకోర్టు ప్రధానంగా రెండు షరతులు విధించింది. రణవీర్ సింగ్ మరోసారి స్పష్టమైన క్షమాపణలతో సవరించిన అఫిడవిట్ను సమర్పించాలి. రాబోయే నాలుగు వారాల లోపు మైసూరులోని ప్రసిద్ధ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, దైవం పట్ల తన భక్తిని, పశ్చాత్తాపాన్ని చాటుకోవాలి.
కోర్టు సూచించిన విధంగా ఆలయ సందర్శన పూర్తి చేసి, నివేదిక సమర్పించిన తర్వాత రణవీర్పై ఉన్న ఎఫ్.ఐ.ఆర్.ను అధికారికంగా కొట్టివేస్తామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో కొన్నాళ్లుగా రణవీర్ను వెంటాడుతున్న ఈ వివాదం సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రణవీర్ సింగ్ తన తాజా చిత్రం 'ధురందర్-2' (Dhurandhar2) సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు.
![]() |
![]() |