Home  »  News  »  Prathyusha Death Case: నటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Updated : Feb 17, 2026

 

24 ఏళ్ళ తరువాత ప్రత్యూష మృతి కేసు తుది తీర్పు
సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది?
నిందితుడు సిద్ధార్థరెడ్డికి శిక్ష పడిందా?

 

24 సంవత్సరాల క్రితం తెలుగునాట సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు(ఫిబ్రవరి 17) తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో హైకోర్టు విధించిన శిక్షను సవాల్‌ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. (Actress Prathyusha)

 

భువనగిరికి చెందిన ప్రత్యూష చిన్న వయసులోనే స్టార్‌డమ్ చూశారు. 1998లో 'రాయుడు' సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రత్యూష.. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కేవలం 20 ఏళ్ళ వయసులోనే.. 2002 ఫిబ్రవరి 24న ప్రత్యూష చనిపోయారన్న వార్త సినీ ప్రపంచాన్ని, ప్రేక్షకులను కుదిపేసింది. 

 

ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థరెడ్డి 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం విషం తాగి ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించగా.. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ డిశ్చార్చి అయ్యాడు. 

 

ప్రత్యూష మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమెది హత్య అని, ఆమెపై లైంగిక దాడి జరిగిందని, దీని వెనుక ఓ రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యుడు ఉన్నాడని.. ఇలా ఎన్నో ప్రచారాలు జరిగాయి. ప్రత్యూషది హత్యేనని ఆరోపిస్తూ ఆమె తల్లి సరోజినీదేవి న్యాయ పోరాటానికి దిగారు.

 

అయితే దర్యాప్తులో ఆత్మహత్య అని తేలింది. దీంతో నిందితుడు సిద్ధార్థపై సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 309 (ఆత్మహత్యకు యత్నించడం) కింద సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సిద్ధార్థకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి.. ఐదేళ్ల జైలు శిక్షతోపాటు, రూ.5 వేల జరిమాన విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. 

 

ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ.. 2011 డిసెంబర్ 28న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై అటు సిద్ధార్థ, ఇటు సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేరు వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 

 

నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి, హైకోర్టు విధించిన శిక్షను పూర్తిగా రద్దు చేయాలంటూ సిద్ధార్థ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై 2025లో వాదనలు పూర్తయ్యాయి. జస్టిస్‌ రాజేష్ బిందల్, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం గతేడాది నవంబర్ లో తీర్పును రిజర్వ్‌ చేసింది. 

 

నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. గతంలో హైకోర్టు విధించిన శిక్షను సమర్ధించిన సుప్రీం.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. తాజా తీర్పుతో సిద్ధార్థరెడ్డి రెండేళ్ల జైలు జీవితాన్ని గడపనున్నాడు.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.