![]() |
![]() |

మనం ఎంత ఎత్తుకి ఎదిగినా, మూలాలను మరిచిపోకూడదు. విజయం సాధించాక కూడా తొలి రోజులను గుర్తుంచుకోవాలి అంటుంటారు. ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఆ కోవకు చెందినవాడే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'కాంతార చాప్టర్ 1' సంచలనాలు సృష్టిస్తుండగా, తొమ్మిదేళ్ల క్రితం నాటి రోజులను గుర్తు చేసుకొని రిషబ్ ఎమోషనల్ అవుతున్నాడు. (Rishab Shetty)
2022లో వచ్చిన 'కాంతార'తో హీరోగా, డైరెక్టర్ గా పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు పొందాడు రిషబ్. ఇప్పుడు 'కాంతార' ప్రీక్వెల్ 'కాంతార చాప్టర్ 1'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ రాబట్టింది. అన్ని ఏరియాల్లో మెజారిటీ షోలు బుక్ అవుతూ.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రిషబ్, సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. (Kantara Chapter 1)
Also Read: కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ
2016లో తన సినిమాకి ఒక్క ఈవెనింగ్ షో పొందడానికి ఇబ్బంది పడిన రోజులను గుర్తు చేసుకుంటూ రిషబ్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. "అప్పుడు 2016 లో ఒక ఈవెనింగ్ షో కోసం కష్టపడ్డాను. ఇప్పుడు 2025లో నా సినిమాకి 5000 షోలు హౌస్ఫుల్ అయ్యాయి. ప్రేక్షకుల ప్రేమ, దేవుని దయ వల్లే ఇది సాధ్యమైంది. దీన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ కృతజ్ఞుడను." అంటూ రిషబ్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రిషబ్ అద్భుతమైన సినీ ప్రయాణంపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా, రిషబ్ డైరెక్ట్ చేసిన మొదటి ఫిల్మ్ 'రిక్కీ' 2016లో విడుదలైంది. ఆ సినిమాకి థియేటర్లు దొరక్క అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. దాంతో ఆయన ప్రతిభకి ప్రశంసలు దక్కాయి కానీ, కమర్షియల్ సక్సెస్ మాత్రం చూడలేకపోయాడు. ఇక అదే ఏడాది వచ్చిన 'కిరిక్ పార్టీ' ప్రశంసలతో పాటు, కమర్షియల్ సక్సెస్ ని కూడా అందించింది. ఇక అప్పటినుంచి రిషబ్ వెనుతిరిగి చూసుకోలేదు.
![]() |
![]() |