![]() |
![]() |

కొద్దిరోజుల క్రితం తెలుగు సినీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెను విరమింప చేయడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుని రంగంలోకి దింపి.. నిర్మాతలు, కార్మికుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులతో సమావేశారు. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుందన్న రేవంత్.. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. (Tollywood)
తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "హైదరాబాద్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమీ కావాలో చర్చించుకుని చెప్పండి. సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెప్పాను. సినిమా కార్మికులలో నైపుణ్యాల పెంపుకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరాను. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తాం. సినిమా కార్మికులు కూడా తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. అన్ని భాషల చిత్రాలు తెలంగాణ లో షూటింగ్ జరిగేలా సహకరించాలి. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలి. పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దు. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుంది. సమస్యను సమస్యగానే చూస్తా, వ్యక్తిగత పరిచయాలను చూసుకోను. సినిమా కార్మికుల తరుపున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈ ప్రభుత్వం మీది.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. నేను కార్మికుల వైపు ఉంటాను.. అదే సమయంలో నాకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం. సమ్మె జరుగుతుంటే చూస్తూ ఊర్కోలేం. సినిమా కార్మికుల కు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తాం. సినీ కళాకారులకు గద్దర్ అవార్డ్ లను ఇచ్చాం. 10 ఏళ్ల పాటు సినిమా వాళ్లకు అవార్డు లు కూడా ఇవ్వలేదు." అన్నారు.

![]() |
![]() |