![]() |
![]() |
ఇటీవలికాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది సోషల్ మీడియా. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. దీంతో సెలబ్రిటీలు మాట్లాడాలన్నా, తమ మనోభావాలను అందరితో పంచుకోవాలన్నా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఏం మాట్లాడినా అందులో వివాదానికి దారి తీసే అంశం ఉందంటూ గోరంతను కొండంత చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈమధ్యకాలంలో చాలా మంది సినీ ప్రముఖులు యధాలాపంగా మాట్లాడిన విషయాలు కూడా వివాదాస్పదం అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందుకు మినహాయింపు కాలేదు. ఇటీవల ఓ ఫంక్షన్లో సరదాగా మాట్లాడిన మాటలతో మహిళల వ్యతిరేకిగా ఆయనపై ముద్ర వేశారు. తాజాగా మరో అంశం చిరంజీవికి సంబంధించిందే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవికి భారతీయ పౌరసత్యం లేదనే కొత్త అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయనకు యునైటెడ్ కింగ్డమ్ పౌరసత్వం ఉంది. కాబట్టి భారతీయ పౌరసత్వం రద్దు చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై చిరంజీవి స్పందించి తన పిఆర్ టీమ్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు యుకె పౌరసత్వం ఉందంటూ వస్తున్న వార్తల్లో క్లారిటీ లేదని, తన ఊపిరి ఉన్నంతవరకు భారతీయుడిగానే ఉంటానని తెలియజేశారు. ఒక సాధారణ వ్యక్తి నుంచి మెగాస్టార్గా, ఆ తర్వాత పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకునే స్థాయికి తాను రావడానికి ఇక్కడి ప్రజల ఆశీర్వాద బలమే కారణమని స్పష్టం చేశారు. చిరంజీవిపై జరుగుతున్న ఈ ప్రచారంపై ఆయన అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వివాదాలను ఎవరు సృష్టిస్తున్నారో, ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సెలబ్రిటీల వ్యవహారం ఎలా తయారైందంటే.. తాము సరదాగా మాట్లాడిన మాటలను ఏదో ఒక దానికి లింక్ చేయడం వల్ల అది వివాదంగా మారడం, ఆ తర్వాత వాళ్ళు మీడియా ముఖంగానో, సోషల్ మీడియా ద్వారానో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవిపై వచ్చిన ఈ తాజా వివాదంపై ఆయన పీఆర్ టీమ్ ఇచ్చిన క్లారిటీతో దీనికి ఫుల్స్టాప్ పెడతారా లేక మరింత వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తారో చూడాలి.
![]() |
![]() |