![]() |
![]() |

"నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది" అంటారు. తెలుగు వాడైనప్పటికీ, క్రికెటర్ అంబటి రాయుడు.. ఈ తెలుగు సామెతను పెద్దగా విన్నట్టు లేడు. అందుకే నోరు పారేసుకుని అభాసుల పాలవుతుంటాడు. నిజానికి రాయుడు ఎంతో ప్రతిభావంతుడు. కానీ, లౌక్యం తెలియకపోవడం, నోటి దురుసు వంటి కారణాలతోనే.. అతను స్టార్ క్రికెటర్ గా ఎదగలేకపోయాడనే అభిప్రాయాలున్నాయి. అది నిజమేననే అభిప్రాయాన్ని మరోసారి కలిగేలా చేశాడు అంబటి. కామెంటేటర్ అవతారమెత్తిన రాయుడు.. తాజాగా తెలుగు సెలబ్రిటీలను అవమానించే విధంగా కామెంట్స్ చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. ఆదివారం నాడు దుబాయ్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. ఇండియా-పాక్ మ్యాచ్ కావడంతో ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు.. దుబాయ్ వెళ్ళి ప్రత్యక్షంగా మ్యాచ్ చూశారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ హాజరై.. మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ క్రమంలో ఒక కామెంటేటర్ మాట్లాడుతూ.. "ఇండియా-పాక్ మ్యాచ్ అనగానే తెలుగువాళ్లు ఎక్కువమంది హాజరవుతారు. మ్యాచ్ కి ఉన్న డిమాండ్ అలాంటిది" అన్నాడు. వెంటనే మైక్ అందుకున్న అంబటి రాయుడు.. "ఇదంతా పబ్లిసిటీ స్టంట్. ఇండియా-పాక్ మ్యాచ్ కి వస్తే టీవీలో ఎక్కువసార్లు చూపిస్తారు కదా." అంటూ సెటైర్ వేశాడు.
తెలుగు సెలబ్రిటీలను ఉద్దేశించి రాయుడు చేసిన కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినీ అభిమానులు.. అతని తీరుని తప్పుబడుతూ ఫైర్ అవుతున్నారు. చిరంజీవి అప్పట్లోనే 'బిగ్గర్ దాన్ బచ్చన్' అనిపించుకున్నారు. అలాంటి ఆయనకి పబ్లిసిటీ అవసరమా? ఏం మాట్లాడుతున్నావ్ రాయుడు? అంటూ మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఇక, పుష్ప-2 తో ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన దర్శకుడు సుకుమార్.. కేవలం టీవీలో కనిపించడం కోసం క్రికెట్ మ్యాచ్ కి వస్తాడా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. అంటూ అంబటిపై నెటిజెన్లు మండిపడుతున్నారు.
ఏది ఏమైనా, తెలుగు వాడు అయ్యుండి.. ఇలా తెలుగు సెలబ్రిటీలపై రాయుడు చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీశాయి. మరి ఈ వివాదంపై రాయుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.
![]() |
![]() |