![]() |
![]() |
కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా రచయితగా మంచి పేరు తెచ్చుకున్న డాలి ధనంజయ.. తెలుగులో ‘పుష్ప’ చిత్రంతో పరిచయమయ్యాడు. ఆ సినిమాలో చేసిన జాలిరెడ్డి క్యారెక్టర్ అతన్ని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతోపాటు పుష్ప2 కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే డాలి ధనంజయకు కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 16న డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు వేశాడు డాలి. మైసూరులో అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహం గురించి కన్నడ పరిశ్రమ విశేషంగా చెప్పుకుంది.
డాలి, ధన్యత కుటుంబాల సభ్యులు, మిత్రులు, సన్నిహితులతోపాటు వేల సంఖ్యలో అభిమానులు ఈ వివాహానికి హాజరయ్యారు. 30 వేలకు పైగా అతిథులు ఈ పెళ్లికి హాజరయ్యారని తెలుస్తోంది. వారందరికీ రకరకాల డిష్లతో విందు ఏర్పాటు చేశారు. పుష్ప దర్శకుడు సుకుమార్తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో డాలి ధనంజయ ఎంతో ఎమోషనల్గా పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. ‘మా పెళ్లికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ, రాలేకపోయిన వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలాంటి అవాంతరాలు లేకుండా మా వివాహం ఘనంగా జరగడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు, మీడియా, పోలీసు శాఖ.. ఇలా ఎంతోమంది కారణం. వారందరికీ నేను, ధన్యత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే నాపై ఉన్న అభిమానంతో ఎంతో మంది ఫంక్షన్ హాల్కి వచ్చి లోపలికి రాలేక తిరిగి వెళ్లిపోయారు. మాకోసం వచ్చినవారు అలా ఇబ్బంది పడడం మమ్మల్ని ఎంతో బాధించింది. వారందరినీ పేరు పేరునా క్షమించమని నేను, ధన్యత కోరుతున్నాం. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి మేం ఎంతగానో చింతిస్తున్నాం. పెద్ద మనసుతో అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని మంచి విషయాలతో త్వరలోనే తిరిగి మిమ్మల్ని కలుస్తాం. థాంక్యూ’ అని పోస్ట్ పెట్టారు డాలి ధనంజయ.
![]() |
![]() |