![]() |
![]() |
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని, సినిమాటోగ్రఫీ మంత్రిని కలవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. రెండు దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలై కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిసారు.
సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్మాత దిల్రాజు మాత్రమే ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. మిగతా సినీ ప్రముఖులెవ్వరూ ఆ పని చేయలేదు. దీంతో వెంకటరెడ్డి అసహనాన్ని ప్రకటించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొందరు సినీ ప్రముఖులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసారు. త్వరలోనే సీఎం అపాయింట్మెంట్ తీసుకొని ఆయన్ని కూడా కలుస్తామని దిల్రాజు వెల్లడిరచారు. అయితే ఇవేవీ పట్టించుకోని చిరంజీవి ముందుగానే రేవంత్రెడ్డిని వ్యక్తిగతంగా కలిసారు. గత ప్రభుత్వం సినిమా రంగానికి మంచి ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా అన్నివిధాలా తమ సహాయ సహకారాలు అందించింది. కొత్త ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కోరేందుకే సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలుస్తున్నారు. అందులో భాగంగానే చిరంజీవి కూడా క్రిస్మస్ సందర్భంగా ఆయన్ని కలిసారు. అయితే ముఖ్యమంత్రితో చిరంజీవి ఏ విషయాల గురించి చర్చించారో తెలియరాలేదు.
![]() |
![]() |