పరాజయాల్లో ఉన్న పలువురు సినీ ప్రముఖులు.. 2022 ఫస్టాఫ్ లో రిలీజైన సినిమాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. వారి వివరాల్లోకి వెళితే..
నాగ్ - రమ్యకృష్ణ - కళ్యాణ్ కృష్ణ:
2022 సంక్రాంతికి విడుదలైన `బంగార్రాజు`.. నాగార్జున, రమ్యకృష్ణ, దర్శకుడు కళ్యాణ్ కృష్ణని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. `సోగ్గాడే చిన్ని నాయనా` తరువాత సరైన విజయం లేని నాగ్ కి, `బాహుబలి - ద కంక్లూజన్` తరువాత తెలుగునాట సక్సెస్ లేని రమ్యకి `బంగార్రాజు` ఫలితం ఊరటనిచ్చింది. ఇక ప్రీవియస్ మూవీ `నేల టిక్కెట్టు`తో డిజాస్టర్ మూటగట్టుకున్న కళ్యాణ్ కృష్ణకి `బంగార్రాజు` రిజల్ట్ పెద్ద రిలీఫ్. జనవరి 14న `బంగార్రాజు` జనం ముందు నిలిచింది.
రానా దగ్గుబాటి - నిత్యా మీనన్:
`నేనే రాజు నేనే మంత్రి` తరువాత సరైన విజయం లేని రానా దగ్గుబాటికి, `జనతా గ్యారేజ్` అనంతరం నాయికగా సాలిడ్ హిట్ లేని నిత్యా మీనన్ కి.. `భీమ్లా నాయక్` ఫలితం ఊరటనిచ్చింది. ఫిబ్రవరి 25న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది.
రామ్ చరణ్:
గత చిత్రం `వినయ విధేయ రామ`తో డిజాస్టర్ చవిచూసిన కథానాయకుడు రామ్ చరణ్ ని.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్` మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. మార్చి 25న విడుదలైన ఈ పిరియడ్ డ్రామా.. బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కీర్తి సురేశ్:
`మహానటి` తరువాత కథానాయిక కీర్తి సురేశ్ నటించిన తెలుగు సినిమాలేవీ ప్రజాదరణ పొందలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. మే 12న విడుదలైన `సర్కారు వారి పాట` చెప్పుకోదగ్గ విజయం సాధించి తనకి ఊరటనిచ్చింది.
తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్:
గత కొంతకాలంగా సరైన విజయం లేని తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ కి.. `ఎఫ్ 3` కాస్త ఊరటనిచ్చింది. ఇక ఈ చిత్రం కంటే ముందు వచ్చిన `గని`తో భంగపడ్డ వరుణ్ తేజ్.. మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లయ్యింది. అదే విధంగా.. ఇదే క్యాలెండర్ ఇయర్ లో డిజాస్టర్స్ హ్యాట్రిక్ చూసిన పూజా హెగ్డే.. ఇందులోని స్పెషల్ సాంగ్ తో రిలీఫ్ పొందింది. మే 27న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది.
వీరితో పాటు `పుష్ప - ద రైజ్` తరువాత ట్రాక్ తప్పిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ `ఎఫ్ 3`తోనూ, `బాహుబలి - ద కంక్లూజన్` అనంతరం సాలిడ్ హిట్ లేని స్వరవాణి కీరవాణి `ఆర్ ఆర్ ఆర్`తోనూ మళ్ళీ సక్సెస్ బాట పట్టారు.