తెలుగు తెరపై కనువిందు చేసిన జంటల్లో నాగచైతన్య, సమంత జోడీ ఒకటి. `ఏమాయ చేసావె` (2010), `మనం` (2014) వంటి విజయవంతమైన చిత్రాల తరువాత వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా.. `ఆటోనగర్ సూర్య`. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దేవ కట్టా తీర్చిదిద్దాడు. ఆటోనగర్ లో నివసించే సూర్య అనే ఓ అనాథ కథే ఈ సినిమా. ఇందులో సాయి కుమార్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, ఎమ్మెస్ నారాయణ, మధుసూదన్ రావు, నందు, వేణు మాధవ్, అజయ్, అజయ్ ఘోష్, మాస్టర్ భరత్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో "మంచెలి", "టైమ్ ఎంత రా", "ఆటోనగర్ బ్రహ్మి", "హైదరాబాద్ బిర్యాని", "సుర సురా'', ''ఆయుధం'' అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించిన `ఆటోనగర్ సూర్య`.. 2014 జూన్ 27న విడుదలైంది. కాగా, నేటితో ఈ సినిమా 8 వసంతాలు పూర్తిచేసుకుంది.