![]() |
![]() |

తెలుగునాట కళాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచారు కళాతపస్వి కె. విశ్వనాథ్. తెలుగింటి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఆయన రూపొందించిన పలు సినిమాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. వాటిలో `సప్తపది` ఒకటి. జేవీ సోమయాజులు, అల్లు రామలింగయ్య, జేవీ రమణమూర్తి, సబిత, రవికాంత్, గిరీశ్ ప్రధాన్, డబ్బింగ్ జానకి, శివపార్వతి, ప్రమీలా రాణి, ఝాన్సీ, సాక్షి రంగారావు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాని జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించారు. ప్రముఖ దర్శకరచయిత జంధ్యాల సమకూర్చిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దిగ్గజ స్వరకర్త కేవీ మహదేవన్ బాణీలకు ప్రముఖ గీతరచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. పాటల్లో ``అఖిలాండేశ్వరి చాముండేశ్వరి``, ``గోవులు తెల్లన``, ``నెమలికి నేర్పిన నడకలివి``, ``రేపల్లియ ఎద జల్లున``, ``ఏ కులము నీదంటే`` విశేషాదరణ పొందాయి. `బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్` (కె.విశ్వనాథ్) విభాగంలో `నంది` పురస్కారాన్ని, `బెస్ట్ ఫిల్మ్`` విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డుని అందుకున్న ఈ చిత్రం.. `బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్` విభాగంలో `నేషనల్ అవార్డు`ని సొంతం చేసుకుంది. అలాగే, హిందీలో `జాగ్ ఉథా ఇన్సాన్` (మిథున్ చక్రవర్తి, శ్రీదేవి, రాకేశ్ రోషన్) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే రీమేక్ అయింది. 1981 జూన్ 26న విడుదలై జననీరాజనాలు అందుకున్న `సప్తపది`.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |