![]() |
![]() |

పవర్స్టార్ పవన్ కల్యాణ్ ఇంతవరకూ తన సినిమాల షూటింగ్లను పునఃప్రారంభించలేదు. ఆయన ఎప్పుడు సెట్స్ మీదకు వస్తాడా, ఎప్పుడు 'వకీల్ సాబ్'ను కంప్లీట్ చేద్దామా అని ప్రొడ్యూసర్ దిల్ రాజు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి బీభత్సంగా ఉండటంతో యూనిట్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కల్యాణ్ షూటింగ్ విషయంలో తొందరపడట్లేదు. 'వకీల్ సాబ్' ఆయన 26వ చిత్రం.
దాని తర్వాత క్రిష్ డైరెక్షన్లో 27వ చిత్రాన్ని ఆయన చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఎ.ఎం. రత్నం దీనిని భారీ బడ్జెట్తో నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకొని వెయిట్ చేస్తున్నారు. అలాగే 28వ సినిమాని హరీశ్ శంకర్ డైరెక్షన్లో చేయడానికి పవన్ అంగీకరించారు. దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇవి కాకుండా మరో రెండు మూడు సినిమాలకు కూడా ఆయన ఓకే చెప్పారని ఇదివరకు వినిపించింది.
వీటి పరిస్థితి అలా ఉండగానే పవన్ కల్యాణ్ తనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బండ్ల గణేశ్ ప్రకటించారు. ట్విట్టర్ హ్యాండిల్లో పవన్ కల్యాణ్తో దిగిన ఫొటోను షేర్ చేసిన ఆయన, "నా బాస్ ఓకే చెప్పారు, మరోసారి నా కలలు నిజమవుతున్నాయి. థాంక్యూ మై గాడ్ పవన్ కల్యాణ్" అని ఆయన ట్వీట్ చేశారు. అది లేటెస్ట్ ఫొటోయేనని పవన్ కల్యాణ్ లుక్స్ని బట్టి అర్థమవుతోంది. అంటే.. పవన్ను కలిసిన గణేశ్.. తనతో మరో సినిమా చేయడానికి ఒప్పించారన్న మాట.
ఇదివరకు బండ్ల గణేశ్కు 'తీన్మార్', 'గబ్బర్ సింగ్' సినిమాలు చేశారు పవన్ కల్యాణ్. ఇది మూడో సినిమా. దీనికి డైరెక్టర్ ఎవరనేది తేలాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్తో నిర్మించిన 'టెంపర్' (2015) మూవీ తర్వాత ఇంతవరకు గణేశ్ మళ్లీ సినిమా నిర్మాణం జోలికి వెళ్లలేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుత కమిట్మెంట్స్ను బట్టి 2022 చివరి నాటికి గానీ గణేశ్తో సినిమా చేసే అవకాశం లేదు. చూద్దాం.. ఇలా వరుసబెట్టి సినిమాలకు కమిట్ అవుతూ వస్తోన్న జనసేనాని పాలిటిక్స్కు సమయం ఎప్పుడు కేటాయిస్తారనేది ప్రశ్న.
![]() |
![]() |