![]() |
![]() |

దక్షిణాది నుంచి ‘జాతీయ ఉత్తమ నటి’ పురస్కారాలను అందుకున్న కథానాయికలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఆ జాబితాలో స్థానం సంపాదించుకున్న నాయికలుగా ప్రియమణి, కీర్తి సురేశ్ని చెప్పుకోవచ్చు. తమిళ చిత్రం ‘పరుత్తివీరన్’తో పుష్కరకాలం క్రితం ప్రియమణి ‘నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రస్'గా నిలిస్తే.. అభినేత్రి సావిత్రి బయోపిక్ ‘మహానటి’తో కీర్తి సురేశ్ ‘జాతీయ ఉత్తమ నటి’గా పురస్కారం పొందింది. కెరీర్ ఆరంభం నుంచి ఈ ఇద్దరు నాయికలు కూడా విభిన్న పాత్రల వైపు మొగ్గు చూపే ప్రయత్నమే చేశారు. ఫలితంగానే ‘నేషనల్ అవార్డ్స్’ లిస్ట్లో చేరిపోయారు.
ఇదిలా ఉంటే.. కీర్తి సురేశ్, ప్రియమణి నుంచి రాబోతున్న కొత్త చిత్రాలకు సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ చోటు చేసుకుంది. అదేమిటంటే.. ఇద్దరు కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ‘అమ్మ’ పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. జూన్ 19న ఓటీటీ రిలీజ్గా రాబోతున్న త్రిభాషా చిత్రం ‘పెంగ్విన్’లో ఓ చిన్నపిల్లాడికి తల్లిగా కనిపించనుంది కీర్తి. తప్పిపోయిన కొడుకు కోసం ఆరాటపడే అమ్మ పాత్రలో కీర్తి అభినయం సినిమాకే ప్రధాన ఆకర్షణ కానుందని ఇటీవల విడుదలైన టీజర్ను చూస్తే స్పష్టమవుతోంది. ఇక ప్రియమణి విషయానికొస్తే.. తమిళ బ్లాక్బస్టర్ ‘అసురన్’ ఆధారంగా రూపొందుతున్న ‘నారప్ప’లో ఇద్దరు టీనేజర్స్ (కొడుకులు)కి తల్లిగా దర్శనమివ్వనుంది ప్రియమణి. విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే మిగిలిన భాగాన్ని పూర్తి చేయనున్నారు. 2021 సంక్రాంతి బరిలో ‘నారప్ప’ నిలిచే అవకాశం ఉంది.
మరి.. వేర్వేరు సినిమాల కోసం ఎమోషనల్ మదర్స్గా కనిపించనున్న ఈ ఇద్దరు ‘జాతీయ ఉత్తమ నటీమణులు’.. ఆయా పాత్రలతో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.
![]() |
![]() |