![]() |
![]() |

'గులాబీ', 'నిన్నే పెళ్లాడతా', 'సిందూరం', 'అంతఃపురం', 'మురారి', 'ఖడ్గం' వంటి సినిమాలతో క్రియేటర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'రంగమార్తాండ' సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో తన మార్క్ చూపించి, తన దర్శకత్వ ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాలనుకుంటున్నారు. అయితే ఈ మూవీ విడుదల మాత్రం ఆలస్యమవుతోంది. దానికి ప్రధాన కారణం ప్రకాష్ రాజ్ అని తెలుస్తోంది.
హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు అయిపోయినట్టే. ఒక్క ప్రకాష్ రాజ్ తప్ప మిగతా పాత్రధారుల అందరి డబ్బింగ్ ఎప్పుడో పూర్తయిందట. ప్రకాష్ రాజ్ ని డబ్బింగ్ చెప్పమంటే అదిగో చెప్తా ఇదిగో చెప్తా అంటూ కాలం వెళ్లదీస్తున్నారట. ఆయనతో ఉన్న స్నేహ బంధం కారణంగా కృష్ణ వంశీ కూడా గట్టిగా అడగలేకపోతున్నారట. ప్రొడక్ట్ ఎప్పుడో సిద్ధమైనా కేవలం ప్రకాష్ రాజ్ డబ్బింగ్ కారణంగానే 'రంగమార్తాండ' ఆలస్యమవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఆగస్టులోనే ఈ సినిమా విడుదలవుతుందని భావించినా ఆలస్యమైంది. మరి ప్రకాష్ రాజ్ త్వరగా డబ్బింగ్ చెప్పేసి 'రంగమార్తాండ' విడుదలకు మోక్షం కలిగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |