Home  »  News  »  వారణాసి కథ.. రాజమౌళికి చెమటలు పట్టాయి.!

Updated : Jul 10, 2026

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'వారణాసి'. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'ఐ, నోబడీ' చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా 'వారణాసి' సినిమా మేకింగ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రాజమౌళి తన కథను ఎంత అద్భుతంగా వివరిస్తారో, ఆయన విజన్ ఎంత స్పష్టంగా ఉంటుందో పృథ్వీరాజ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

తాను 'ఎంపురాన్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో ఒకరోజు రాజమౌళి సర్ నుండి 'కాల్ చేయవచ్చా' అని ఒక మెసేజ్ వచ్చిందని పృథ్వీరాజ్ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత తాను ఫోన్ చేయగా, ప్రస్తుతం ఒక అద్భుతమైన కథ రాస్తున్నానని, అందులో ఒక బలమైన విలన్ పాత్ర ఉందని, ఆసక్తి ఉంటే కథ వినాలని రాజమౌళి కోరినట్లు చెప్పారు. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే పృథ్వీరాజ్ హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ వాతావరణం ఒక ఆఫీస్‌లా కాకుండా, అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా ఎంతో ఆప్యాయంగా అనిపించిందని ఆయన అన్నారు. ఈ పాత్రకు నన్నే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తే, ప్రత్యేకంగా ఏమీ లేదని, మీరు ఈ పాత్రకు చక్కగా సరిపోతారని అనిపించిందని రాజమౌళి ఎంతో సరళంగా సమాధానమిచ్చారట.

ఆ తర్వాత అసలు సిసలైన కథా చర్చలు మొదలయ్యాయి. కాసేపు సాధారణ ముచ్చట్ల అనంతరం రాజమౌళి 'వారణాసి' కథను చెప్పడం ప్రారంభించారు. దాదాపు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఆ నరేషన్ సెషన్ ఒక అద్భుతమైన అనుభవమని పృథ్వీరాజ్ వెల్లడించారు. రాజమౌళి కథ చెబుతుంటే కేవలం మాటలు వినపడలేదని, కళ్ల ముందే ఒక అద్భుతమైన సినిమా స్క్రీన్‌పై నడుస్తున్నట్లు దృశ్యాలు కనిపించాయని ఆయన ప్రశంసించారు. అయితే ఈ నరేషన్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను పృథ్వీరాజ్ పంచుకున్నారు.

కథ వినడం ప్రారంభించిన సుమారు గంట తర్వాత ఆ రూమ్ అంతా ఎయిర్ కండిషనర్ వల్ల చాలా కూల్‌గా మారిపోయిందని, చలిగా అనిపించిందని ఆయన చెప్పారు. కానీ మధ్యలో రాజమౌళిని ఆపడం ఇష్టం లేక అలాగే వింటూ ఉండిపోయారు. అయితే విచిత్రం ఏమిటంటే, రూమ్ అంత చలిగా ఉన్నా కూడా, కథ చెప్పడం పూర్తయ్యే సమయానికి రాజమౌళి ఒళ్లంతా చెమటలు పట్టేసి, ఆయన వేసుకున్న చొక్కా పూర్తిగా తడిసిపోయింది. తెర వెనుక అయినా, తెర ముందు అయినా కథను ఎమోషనల్‌గా నరేట్ చేయడంలో రాజమౌళి మించిన గొప్ప కథకుడు లేరని ఈ సంఘటన నిరూపిస్తుందని పృథ్వీరాజ్ కొనియాడారు. రాజమౌళి చెప్పిన ఆ విజన్, షూటింగ్ పూర్తి చేసుకుని ఎడిటింగ్ టేబుల్ దాటి వెండితెరపైకి వచ్చేసరికి ఆయన వివరించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా, మరింత బ్రహ్మాండంగా కనిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. థియేటర్లలో ఈ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరూ 'వావ్' అనకుండా ఉండలేరని స్పష్టం చేశారు.

తాను ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఇష్టపడతానని, కేవలం 20 రోజులు మాత్రమే షూటింగ్ ఉన్న 'కురిది' సినిమాతో పాటు అత్యధిక రోజులు చిత్రీకరణ జరుపుకున్న భారీ చిత్రం 'వారణాసి'లోనూ అంతే అంకితభావంతో నటించానని పృథ్వీరాజ్ చెప్పారు. సినిమా ఏదైనా షూటింగ్ ప్రక్రియను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలాంటి ఆందోళన ఉండదని, తాను ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తానని తెలిపారు. ఒకరోజు వైశాఖ్ దర్శకత్వంలో 'ఖలీఫ్' సినిమా చేస్తే, మరోరోజు రాజమౌళితో 'వారణాసి', ఇంకోరోజు మేఘనా గుల్జార్ వంటి భిన్నమైన దర్శకులతో పనిచేయడం ఎంతో ఛాలెంజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆయన ముగించారు.

 

 

Rajamouli, Varanasi, Prithviraj Sukumaran, I Nobody

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.