![]() |
![]() |

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా హిట్ టాక్ వస్తేనే తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ రాబడుతుంటాయి. అలాంటిది ఓ డబ్బింగ్ సినిమాకి తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం వంద కోట్లు కోట్ చేస్తున్నారు మేకర్స్. ఆ సినిమా ఏదో కాదు.. కాంతార చాప్టర్-1.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కాంతార'. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ 2022లో సైలెంట్ గా వచ్చి ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.30 కోట్ల షేర్ తో ఘన విజయం సాధించింది.
ఇప్పుడు కాంతారకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్-1 రూపొందుతోంది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దానిని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు తెలుగు రాష్ట్రాల రైట్స్ ని ఏకంగా వంద కోట్లకు కోట్ చేస్తున్నట్లు సమాచారం.
గతంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కేజీఎఫ్-2' కూడా తెలుగునాట రూ.75 కోట్ల బిజినెస్ చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. సీక్వెల్ హైప్ తో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో సత్తా చాటి.. తెలుగు రాష్ట్రాల్లో లాభాలు చూసింది.
ఇప్పుడు 'కాంతార చాప్టర్-1'కి ప్రీక్వెల్ హైప్ తో పాటు, డివోషనల్ టచ్ కూడా ఉండటంతో.. నైజాం రూ.40 కోట్లు, ఆంధ్రా రూ.45 కోట్లు, సీడెడ్ రూ.15 కోట్లు చొప్పున మొత్తం వంద కోట్లు కోట్ చేస్తున్నారట. 90 కోట్లకు అటుఇటుగా డీల్ క్లోజ్ అయ్యే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల బిజినెస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించిన సినిమాగా 'కాంతార చాప్టర్-1' నిలుస్తుంది.
![]() |
![]() |