![]() |
![]() |

2023 సంక్రాంతికి విడుదలైన 'వాల్తేరు వీరయ్య' సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. మూడేళ్ళ తర్వాత మరోసారి సంక్రాంతి బరిలో దిగుతున్నారు చిరంజీవి. ఆయన అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' 2026 పొంగల్ కి విడుదలవుతోంది. సంక్రాంతి సీజన్ కావడం, దానికితోడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండటంతో 'మన శంకర వరప్రసాద్ గారు'పై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ రూపంలో మెగా ఫ్యాన్స్ కి ఓ షాక్ తగిలింది. (Mana Shankara Varaprasad Garu)
ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ 'ది రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ కి మారుతి దర్శకుడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన 'మిరాయ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో.. 'రాజా సాబ్'ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత విశ్వప్రసాద్ అనౌన్స్ చేశారు. దీంతో వచ్చే పొంగల్ కి చిరంజీవి, ప్రభాస్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదు. (The Raja Saab)
నిజానికి 2025 సంక్రాంతికే 'విశ్వంభర'తో చిరంజీవి, 'రాజా సాబ్'తో ప్రభాస్ బాక్సాఫీస్ వార్ కి దిగాల్సి ఉంది. కానీ, ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. 'విశ్వంభర' ఏకంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడగా.. ఇప్పుడు 'రాజా సాబ్' 2026 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పటికే చిరంజీవి వచ్చే సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో కర్చీఫ్ వేసి ఉండటంతో.. వీరి మధ్య ఈ ఏడాది మిస్ అయిన పొంగల్ వార్.. వచ్చే ఏడాది ఉండనుంది.
2004 సంక్రాంతికి 'అంజి'తో చిరంజీవి, 'వర్షం'తో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర తలపడ్డారు. భారీ అంచనాలతో విడుదలైన 'అంజి' హై బడ్జెట్ కారణంగా కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలితే.. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన 'వర్షం' మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓ రకంగా ప్రభాస్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ లా 'వర్షం' సినిమాని చెప్పుకోవచ్చు. అలా చిరంజీవిపై ప్రభాస్ పైచేయి సాధించారు.
ఇప్పుడు ఏకంగా 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి, ప్రభాస్ పొంగల్ పోరుకి సై అంటున్నారు. అయితే 'అంజి' సెంటిమెంట్ కారణంగా మెగా ఫ్యాన్స్ లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అదే సమయంలో కొందరు మెగా ఫ్యాన్స్ మాత్రం.. అనిల్ రావిపూడి ఉండటంతో ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో రావిపూడికి క్రేజ్ ఎక్కువ. గత సంక్రాంతికి పోటీగా 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' ఉన్నా కూడా.. అనిల్ డైరెక్ట్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని కొందరు మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. చూద్దాం మరి 2026 పొంగల్ ఫైట్ లో ఎవరు పైచేయి సాధిస్తారో.
![]() |
![]() |