'అఖండ' సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. 'సింహా', 'లెజెండ్' సినిమాల తరవాత నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ అఖండ విజయాన్ని అందుకుంది. అఖండ ఇచ్చిన సక్సెస్ జోష్ లో ఉన్న బోయపాటి.. తన తదుపరి సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
అఖండ తర్వాత బోయపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇటీవల 'పుష్ప-1' తో ప్రేక్షకులను పలకరించిన బన్నీ.. మరో ఏడాది పాటు 'పుష్ప-2' తో బిజీగా ఉండనున్నాడు. బోయపాటి ఈ గ్యాప్ లో పవన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. పొలిటికల్ టచ్ తో ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని ఆయన ఇప్పటికే రెడీ చేశారని టాక్.
యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న పవన్ వచ్చే ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి.. ఎన్నికల సమయానికి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నాడు. అందుకే వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తయింది. హర హర వీర మల్లు కూడా సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. అదే ఫ్లోలో హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు బోయపాటి పర్ఫెక్ట్ స్క్రిప్ట్, పక్కా ప్లానింగ్ తో ఫాస్ట్ గా మూవీ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సినిమా పూర్తయ్యే అవకాశముందని అంటున్నారు.