`ఊహలు గుసగుసలాడే`, `కళ్యాణ వైభోగమే`, `ఛలో`, `ఓ బేబి` వంటి విజయాలతో తెలుగునాట కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. రీసెంట్ టైమ్స్ లో `అశ్వథ్థామ`, `వరుడు కావలెను`, `లక్ష్య`.. ఇలా శౌర్య చేసిన సినిమాలేవీ ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో రాబోయే చిత్రాలు `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి`, `నారి నారి నడుమ మురారి`, `పోలీస్ వారి హెచ్చరిక`, అనీష్ కృష్ణ డైరెక్టోరియల్ పైనే ఆశలు పెట్టుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో.
ఇదిలా ఉంటే.. తాజాగా నాగశౌర్యకి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో `భోళా శంకర్` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరుకి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. చెల్లెలి పాత్రలో కేరళకుట్టి కీర్తి సురేశ్ కనిపించనుంది. కాగా, కీర్తికి జోడీగా నాగశౌర్యని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్ సైడ్ బజ్. త్వరలోనే `భోళా శంకర్`లో నాగశౌర్య ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. మెగాస్టార్ తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్న శౌర్య.. సదరు చిత్రంతో ఎలాంటి గుర్తింపుని పొందుతాడో చూడాలి.