'సరిలేరు నీకెవ్వరు' లాంటి కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ తర్వాత 'సర్కారు వారి పాట' సినిమా చేయడానికి సూపర్స్టార్ మహేశ్ రెడీ అవుతున్నాడు. పరశురామ్ పేట్ల డైరెక్ట్ చేసే ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిన తర్వాతే మొదలవనున్నది. బహుశా అక్టోబర్లో మహేశ్ సెట్స్ మీదకు రావచ్చనేది ఓ అంచనా. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే మహేశ్ జోడీగా మహానటి కీర్తి సురేశ్ ఎంపికైన విషయం విదితమే.
తాజాగా సినిమాలో మహేశ్ తల్లి పాత్రకు ప్రాధాన్యం ఉందనీ, ఆ పాత్ర కోసం నిన్నటి ఫేమస్ యాక్ట్రెస్ భాగ్యశ్రీని ఎంపిక చేశారనీ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. భాగ్యశ్రీ ఇప్పటికే 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ తల్లి పాత్రను చేస్తున్నారు. ఇప్పటికే పరశురామ్ ఆమెను సంప్రదించారనీ, మహేశ్ తల్లి క్యారెక్టర్ కావడం, అందులోనూ కథకు కీలకం కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ సినిమా రూపొందనున్నది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నాడు.