
75 సంవత్సరాల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ‘పాతాళభైరవి’(Pathala Bhairavi) తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచింది. ఎన్.టి.రామారావు, కె.వి.రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా విజయ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా ఎంతో మంది నటీనటులకు లైఫ్ ఇచ్చింది.
అప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన ఎన్టీఆర్.. ‘పాతాళభైరవి’తో మాస్ హీరోగా ఎదిగారు. నేపాళ మాంత్రికుడిగా నటించిన ఎస్వీఆర్ కెరీర్కి ఇది మంచి పునాది వేసింది. సినిమాలోని అంజిగాడు పాత్రను వల్లూరి బాలకృష్ణ పోషించారు. ఈ సినిమా తర్వాత ఆయన్ని అందరూ అంజిగాడు అనే పిలిచేవారు. మహానటిగా ప్రేక్షకుల నీరాజనాలందుకున్న సావిత్రి ఈ సినిమాలోని ఒక సాంగ్ బిట్ ద్వారా తొలిసారి తెరపై కనిపించారు. సదాజపుడుగా నటించిన పద్మనాభంకు మంచి పేరు తెచ్చి నటుడుగా బిజీ అవ్వడానికి ఈ సినిమా కారణమైంది. ఇలా ఈ ఒక్క సినిమాతో నటీనటులే కాదు, సాంకేతిక నిపుణులు కూడా బిజీ అయిపోయారు.






