English | Telugu

బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మండ, లీషా ఎక్లైర్స్ హీరో హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రైట్'. మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్, లుకలాపు మధు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ సూపర్ హిట్ మూవీ 'మెమోరీస్'కి రీమేక్ ఇది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ ను తాజాగా విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. "రైట్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి జీతూ జోసఫ్ కథను అందించారు. బిగ్ బాస్ తర్వాత కౌశల్ నటిస్తున్న రైట్ చిత్రం మంచి విజయం సాధించాలి. మోషన్ పోస్టర్ బాగుంది. కౌశల్ కి ఈ చిత్రం సక్సెస్ అందించాలి" అన్నారు.

కౌశల్ మండ మాట్లాడుతూ.. "బిగ్ బాస్ విన్ అయిన తర్వాత ఈ చిత్రం చేశాను. నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వెంకటేష్ గారితో విడుదల చేయాలి అని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నా, కరోనా వల్ల చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు నా కోరిక తీరింది. వెంకటేష్ గారు నా సినిమా పోస్టర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. త్వరలో థియేటర్ లో విడుదల అవుతుంది. నేను బిగ్ బాస్ లో ఉన్నపుడు తెలుగు ప్రేక్షకులందరూ నాకు సపోర్ట్ చేసి విన్నర్ ని చేశారు. అలాగే నా రైట్ చిత్రాన్ని చూసి నన్ను బ్లెస్స్ చేస్తారు అని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలకు ధన్యవాదాలు. 40 ఏళ్ల గా ప్రతి క్రాఫ్ట్ లో ఎంతో అనుభవం ఉన్న శంకర్ గారు ఈ చిత్రం దర్శకత్వం వహిస్తున్నారు.టాప్ టెక్నిషన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు" అన్నారు.

ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి అయ్యిందని నిర్మాతలు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.