మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఇలా తగ్గించేసుకోండి..!
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. అంతే కాకుండా శరీరంలో విటమిన్ డి, కాల్షియం, ఐరన్ లోపం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఏదైనా గాయం కారణంగా, ఏదైనా దెబ్బతగలడం, కాళ్లను చాలా సేపు వంచి కూర్చోవడం వల్ల, కండరాలు కణజాలాలు సాగదీయబడతాయి. ఇది మోకాళ్లలో నొప్పిని కలిగిస్తుంది. మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు కొన్ని ఇంటి చిట్కాలతో వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఇంటి చిట్కాలను పాటించడం కూడా చాలా సులభం. వాటి ప్రభావం కూడా చాలా త్వరగా కనిపిస్తుంది. అల్లం టీ.. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే అల్లం తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం చిన్న ముక్కలుగా కోసి నీళ్లలో వేసి మరిగించాలి. 10 నిమిషాల తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేయాలి. ఇందులో కొంచెం తేనె, నిమ్మరసం కూడా జోడించాలి. ఇలా తయారుచేసిన టీని రోజుకు 2 నుంచి 3 సార్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. నిమ్మకాయ, నువ్వుల నూనె.. మోకాళ్ల నొప్పులకు నిమ్మకాయ, నువ్వుల నూనె దివ్యౌషధం లా పనిచేస్తాయి. నిమ్మకాయను నువ్వుల నూనెలో ఉడికించి మోకాళ్లపై రాసుకోవచ్చు. లేదంటే ఒకటి రెండు నిమ్మకాయలను కోసి కాటన్ గుడ్డలో కట్టాలి. నువ్వుల నూనెలో ఈ గుడ్డను ముంచి నొప్పి ఉన్న ప్రదేశంలో 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచండి. ఈ రెమెడీని రోజుకు రెండుసార్లు ప్రయత్నించడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. పసుపు.. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపును కడుపుకు తీసుకోవడమే కాదు.. మోకాళ్లపై రాసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. అర టీస్పూన్ తురిమిన అల్లంలో అర టీస్పూన్ పసుపు వేసి నీటిలో వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఈ టీలో కొంచెం తేనె కలుపుకుని రోజుకు రెండుసార్లు తాగాలి. నొప్పి తగ్గడం గమనించవచ్చు. పసుపు పాలు కూడా తాగవచ్చు. పసుపులో ఆవాల నూనెను కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ను మోకాళ్లపై అప్లై చేయవచ్చు. తులసి టీ.. తులసిని ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఈ టీని రోజూ 2 నుంచి 3 సార్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆముదము.. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఆముదం కూడా ఉపయోగపడుతుంది. 2 నుంచి 3 చెంచాల ఆముదం తీసుకుని కాస్త వేడి చేసి మోకాళ్లకు పట్టించాలి. ఈ నూనెతో లైట్ మసాజ్ చేయడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. *రూపశ్రీ.
read moreబరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు తగ్గడానికి మధ్య తేడాలు తెలుసా?
ఫిట్నెస్ గురించి మాట్లాడే చాలామంది బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్న వారై ఉంటారు. వీరు బరువు తగ్గడం, తీసుకునే ఆహారం గురించి తరచుగా చర్చిస్తూ ఉంటారు. కొందరు పొట్ట తగ్గడానికి, మరికొందరు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చాలా అరుదుగా శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఇలా బరువు తగ్గడం, శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం వేర్వేరు విషయాలని. శరీరంలో కొవ్వు తగ్గడం వల్ల శరీరం ఫిట్ గా మారుతుంది. కానీ బరువు తగ్గడం అనేది శరీరంలో కండరాలకు అస్సలు మంచిది కాదు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకుంటే.. కొవ్వు తగ్గడం అంటే శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వును తగ్గించడం. కొవ్వు కండరాల చుట్టూ పొర రూపంలో పేరుకుపోతుంది. దానిని తగ్గించడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. కానీ కండరాల నష్టం అంటే కండరాలు తగ్గుతాయి. మన శరీర బలం, స్థిరత్వం కాపాడుకోవడంలో కండరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే కండరాలకు నష్టం కలిగితే అది ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు తగ్గడం అంటే కొవ్వు తగ్గడం. కొవ్వును తగ్గించడానికి కేలరీల తీసుకోవడం తగ్గించాలి. శరీరంలో కొవ్వును కోల్పోతే కండరాలు అవసరమైన కేలరీలను పొందలేకపోవచ్చు. కొవ్వు తగ్గడం, కండరాలు పెరగడం ఒకేసారి జరుగుతుందా అనే సందేహం ప్రజల్లో ఉంటుంది. బరువు తగ్గడం కోసం క్యాలరీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే శరీరంలో క్యాలరీల లోటు ఏర్పడి శరీరానికి అవసరమైన శక్తి అందనప్పుడు, కండరాలను పనితీరు పెరిగి శరీరానికి శక్తి లభిస్తుంది. దీని కారణంగా కండరాల నష్టం ఏర్పడుతుంది. కండరాల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు తీసుకుంటూ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాలు బలంగా ఉంటూనే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు తగ్గి బరువు తగ్గడం జరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలా? లేదా శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలా? అనే విషయాన్ని శరీర స్థితిని బట్టి నిర్ణయించుకోవాలి. *రూపశ్రీ.
read moreఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి కలిపిన వేడి నీరు తాగితే.. !
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు . ఆరోగ్యం బాగుండటం కోసం చాలామంది ఉదయాన్ని ఒక మంచి ఆహారపు అలవాటుతో ప్రారంభిస్తారు. కొందరు నిమ్మరసం, తేనె తాగుతారు. మరికొందరు గ్రీన్ టీ తాగుతారు. ఇంకొందరు ఇతర ఆరోగ్యకర ఎంపికల వైపు వెళతారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుని తాగడం చాలా అధ్బుతాలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గోరు వెచ్చని నీటిలో నెయ్యి వేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. నెయ్యి నీరు ఎలా తయారుచేసుకోవాలి అంటే.. స్వచ్చమైన ఆవు నెయ్యిని కొద్దిగా వేడి చేయాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ప్రయోజనాలేంటంటే.. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు నెయ్యిలో ఉన్నాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. ఆవు నెయ్యి ఫ్రీ సెల్స్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఈ కారణంగా ఇది ధమనులు గట్టిపడకుండా చేస్తుంది. నెయ్యి మెదడును లోపల నుండి బలోపేతం చేయడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మార్కెట్లో దొరికే నెయ్యి కంటే ఇంట్లో తయారుచేసుకుని లేదా ఇంట్లోనే తయారుచేసి అమ్మేవారి దగ్గర నెయ్యి కొనుక్కుని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దేశీ నెయ్యి వాడటం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. నీళ్లలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. నెయ్యి ఎముకలను బలోపేతం చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి కూడా మంచిది. నెయ్యి శరీరంలో జీర్ణక్రియ ఎంజైమ్లను పెంచుతుంది. *రూపశ్రీ.
read moreఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
భారతీయులు చాలా వంటకాలలో ఎక్కువగా వినియోగించే పదార్థాలలో వెల్లుల్లి ఒకటి. ప్రతి వంటిట్లో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. వెల్లుల్లి వంటకు రుచిని, సువాసనను మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరగాలంటే వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే అద్భుత లాభాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. వెల్లుల్లిలో కార్బోహైడ్రేట్లు, కాపర్, ఫాస్పరస్, డైటరీ ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, బి6, మాంగనీస్, క్యాల్షియం, సెలీనియం, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. ఇన్ఫ్లమేటరీ డిజార్డర్లను తొలగించడంలో వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. దీన్ని ఒక్కటి తింటే చాలు రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోధిస్తుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. జీర్ణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నందువల్ల జీర్ణశయాంతర వ్యాధులను తగ్గిస్తుంది. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులోని నులిపురుగులు మూత్రం, మలం సహాయంతో బయటకు వెళ్లిపోతాయి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే.. ఇది చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. పేగులోని మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుంది. పచ్చి వెల్లుల్లి రోజూ తినడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. వెల్లుల్లి ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (GERD)తో బాధపడుతున్న వ్యక్తులకు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి వైద్యుల సలహా లేకుండా జీర్ణ సమస్యలు, ప్రేగు వ్యాధులు ఉన్నవారు తినకూడదు. వెల్లుల్లిలో ఫ్రక్టాన్లు ఉంటాయి. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్, ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారిలో గ్యాస్, ఉబ్బరం సమస్యలు కలిగిస్తుంది. *రూపశ్రీ.
read moreదోసకాయ నీరు ఇలా తాగితే ఎంత ఈజీగా బరువు తగ్గచ్చో..!
దోసకాయ చాలామందికి ఇష్టమైన కూరగాయ. దీన్ని నేరుగా తినేసేవారు కొందరైతే.. ఉప్పు కారం చల్లుకుని, కాస్త మసాలా జోడించి స్పైసీగా తినేవారు మరికొందరు. జ్యూస్ చేసుకుని తాగేవారు ఇంకొందరు. చాలామంది ఆరోగ్య స్పృహతో డిటాక్స్ వాటర్ తయారుచేసుకుని తాగుతుంటారు. అందులో తప్పనిసరిగా కీరదోసకాయను చేర్చుతారు. అటు నోటికి రుచిని ఇస్తూ, ఇటు ఆకలి తీరుస్తూ.. మొత్తం మీద బరువు తగ్గడంలో మ్యాజిక్ చేసే కీర దోసకాయను నీటిలో వేసి ఆ తరువాత ఆ నీటిని తాగడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని డైటీషియన్లు అంటున్నారు. ఇంతకీ ఈ కీర దోసకాయ కథ ఏంటో పూర్తీగా తెలుసుకుంటే.. కీర దోసకాయ కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని చాలా బాగా చల్లబరుస్తుంది. శరీరంలో తేమ శాతాన్ని నిలిపి ఉంచుతుంది. అయితే కీర దోసకాయను ముక్కలుగా చేసి దాదాపు లీటరుకు పైగా నీటిలో వేయాలి. ఈ నీరు ఇంకా బాగా రుచిగా ఉండటం కోసం ఇందులో పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, అల్లం వేసుకోవచ్చు. ఒక జార్ లో ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి. దీన్ని 1-2 గంటల పాటూ అలాగే కదపకుండా ఉంచాలి. ఆ తరువాత ఈ నీటిని తాగవచ్చు. లాభాలేంటంటే.. చర్మం పొడిబారడం, శరీరంలో మంట, మైకము వంటివి శరీరంలో నీటి కొరత ఏర్పడటం వల్ల సంభవించే సమస్యలు. ఈ దుష్ప్రభావాలను తగ్గించడానికి సాధారణ సమయాల్లో అయినా, వేసవి వేడి సమయంలో అయినా ఈ నీటిని తీసుకోవడం ఉత్తమం. దోసకాయ నీటిలో జోడించే ఇతర పదార్థాల వల్ల ఇది అదనపు రుచితో ఉల్లాసంగా ఉంచుతుంది. దోసకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. కీర దోస నీటిలో ఉండే ఫైబర్లు, ఎంజైమ్ ల కారణంగా చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఇది సెల్యులార్ స్థాయిలో చర్మం పొరలను క్లియర్ చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. దోసకాయల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ కె ఉంటాయి. ఇవన్నీ సహజ యాంటీఆక్సిడెంట్లు. కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా ఇవి సహాయపడతాయి. దోసకాయలో చక్కెరలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దోహదం చేయదు. పైపెచ్చు వాటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది, అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. *రూపశ్రీ.
read moreనిలబడి నీళ్లు తాగకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
సకల జీవులకు నీరే ప్రాణాధారం. మానవ శరీరంలో దాదాపు 70శాతం నీరు ఉంటుంది. మనిషి జీవితం చాలా వరకు నీటి మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతి రోజూ 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలని అంటుంటారు. కానీ నీరు తాగే విధానంలోనే దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొందరు నీటిని నిలబడుకుని తాగుతారు. మరికొందరు చాలా వేగంగా ఒక్కసారే నీటిని తాగుతారు. ఇంకొందరు మెల్లిగా నీటిని తాగుతారు. అయితే నీరు ఎలా తాగితే మంచిది? ఎలా తాగకూడదు? వైద్యులు చెబుతున్న విషయాల వైపు ఓ లుక్కేస్తే.. నిలబడి నీళ్లు తాగడం వల్ల జరిగేది ఇదీ.. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటే మాత్రం అస్సలు నిలబడి నీళ్లు తాగకూడదు. కీళ్లనొప్పులు ఉన్నవారు ఎప్పుడూ నిలబడి నీళ్లు తాగకూడదు. అలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయి. నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలో ద్రవం పెరుగుతుంది. ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది. నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నిలబడి నీరు త్రాగడం జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆ నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో గాయం అవుతుంది. నీరు త్రాగడానికి సరైన మార్గం.. నీరు తాగేటప్పుడు హాయిగా కూర్చొని తాగాలని వైద్యులు చెప్తున్నారు. ఒక్కసారిగా నీళ్లు తాగే బదులు చిన్న చిన్న గుక్కలుగా తాగాలి. నెమ్మదిగా నీటిని తాగడం ద్వారా శరీరం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు అందుతాయి. అంతేకాదు చిన్న గుక్కలుగా నీరు తాగేటప్పుడు నీటిలో లాలాజలం కలిసి జీర్ణక్రియ పెరగడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.
read moreసైనస్ సమస్యను దారుణంగా పెంచే నాలుగు కామన్ మిస్టేక్స్ ఇవే..!
సైనస్ ఇన్ఫెక్షన్లు ఫ్లూ, జలుబు వంటి అంతర్లీన అనారోగ్యాల ద్వారా తరచుగా వస్తుంటాయి. ఇవి సాధారణంగా ఒక వారం లేదా అంతకుముందే తగ్గిపోయినప్పటికీ కొంతమందికి సైనస్ సమస్యలు చాలారోజుల పాటూ ఉంటాయి. ఇలా ఉంటే దీర్ఘకాలిక సైనసైటిస్ ఉందని అర్థం. ఇలాంటి పరిస్థితి ఉంటే మాత్రం సైనస్ నిపుణుడిని తక్షణమే సంప్రదించడం అత్యవసరం. సైనస్ సమస్య ఉన్నవారిలో ఈ సమస్యను మరింత దారుణంగా మార్చే సాధారణ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుని వాటికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల సైనస్ సమస్య ప్రభావాన్నిచాలా వరకు తగ్గించవచ్చు. సైనస్ ఇన్ఫెక్షన్లను తీవ్రతరం చేసే సాధారణ తప్పులు.. హ్యూమిడిఫైయర్ ఉపయోగించకపోవడం.. గాలి పొడిగా మారినప్పుడు చలి కాలంలో సైనస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. శీతాకాలపు చలి, పొడి పరిస్థితులు చర్మాన్ని ప్రభావితం చేయడమే కాకుండా నాసికా రంధ్రాలు పొడిబారడానికి దారితీస్తుంది. దీనిని పరిష్కరించడానికి గాలికి తేమను జోడించడం అవసరం. దీనికోసం హ్యూమిడిఫైయర్ లేదా ఆవిరి పట్టడం వంటివి చేయాలి. ఇది సైనస్లు ఎక్కువ పొడిగా, చికాకుగా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. నాసల్ స్ప్రే ఎక్కువ వినియోగించడం.. చాలామంది మూసుకుపోయిన ముక్కులనుండి ఉపశమనం పొందడానికి నాసల్ స్ప్రేలు ఉపయోగిస్తారు. ఇవి సైనస్ ఇన్ఫెక్షన్ ఒత్తిడి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. ఎక్కువరోజులు అవగాహన లేకుండా తక్షణమే రిలీఫ్ లభిస్తోంది కదా అని వాటిని ఎక్కువ ఉపయోగిస్తే.. ప్రతికూల ప్రభావాలు తప్పవు. ఈ స్ప్రేలలోని ప్రధాన రసాయనం సైనస్ ఇన్ఫెక్షన్లను మరింత తీవ్రతరం చేయడానికి దోహదం చేస్తుంది. సైనస్ ఇన్ఫెక్షన్ ఒక వారం దాటితే దాన్ని తగ్గించుకోవడానికి ENT నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం.. పుష్కలమైన నిద్ర మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ముఖ్యంగా సైనస్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా పగటిపూట విశ్రాంతి తీసుకోవడం, శక్తిని ఆదా చేయడం సైనస్ ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. హైడ్రేటెడ్ గా ఉండకపోవడం.. సైనస్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడేటప్పుడు బాగా హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్లేష్మం ఉత్పత్తికి తోడ్పడుతుంది. శ్లేష్మం సన్నగా, సులభంగా బయటకు వెళ్లేలా చేయడంలో సహాయపడుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్ సమయంలో సరైన ఆర్ద్రీకరణ రద్దీని తగ్గించడానికి, మెరుగైన శ్వాసను సులభతరం చేయడానికి దోహదం చేస్తుంది. *నిశ్శబ్ద.
read moreఫ్యాటీ లివర్ కు ఈ మొక్కలు మ్యాజిక్ లా పనిచేస్తాయి..!
మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి. చాలా వరకు మొక్కల పేర్లు కూడా చాలామందికి తెలియవు, కానీ ఆయర్వేద పరంగా చూసినప్పుడు ప్రతి మొక్క ఆద్బుతం అనిపిస్తుంది. అలాంటి మొక్కలలో నేల ఉసిరి కూడా ఒకటి. ఉసిరి చెట్టు ఆకులను పోలి ఉండి నేలమీద పెరిగే ఈ నేల ఉసిరి మొక్క ఫ్యాటీ లివర్ సమస్యలకు అధ్భుతంగా పనిచేస్తుంది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి నేల ఉసిరి ఎలా పని చేస్తుంది? తెలుసుకుంటే.. ఫ్యాటీ లివర్ లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది అధికంగా తాగడం వల్ల వస్తుంది. రెండవది ఆల్కహాలిక్ లేని ఫ్యాటీ లివర్. ఇది జీవనశైలి, జన్యుశాస్త్రం, తినడం, త్రాగడంలో అజాగ్రత్త లేదా కొన్ని ఔషధాల దుష్ప్రభావాల వల్ల కూడా వస్తుంది. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ పెద్ద వ్యాధిగా రూపాంతరం చెందుతోంది. వైద్యుల ప్రకారం 10 మందిలో 6-7 మందికి ఫ్యాటీ లివర్ సమస్య ఉండవచ్చు. ఫ్యాటీ లివర్ను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరమని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇది ఎక్కువగా పెరిగితే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ఉండే కొవ్వు, ప్రోటీన్ చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దీన్ని LDL లేదా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా వేగంగా పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో కడుపు కుడి ఎగువ భాగంలో నొప్పి ఉంటుంది. బరువు తగ్గడం, బలహీనంగా అనిపించడం, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఎసిడిటీ లేదా పొట్టలో ఉబ్బరం.. ఇవన్నీ ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతాలు. నేల ఉసిరి ఎలా పనిచేస్తుందంటే.. నేల ఉసిరి ఒక ఆయుర్వేద ఔషధం. దీని పండ్లు సరిగ్గా ఉసిరి లాగా ఉంటాయి. అలాగే దీని ఆకులు కూడా ఉసిరి చెట్టు ఆకులను పోలి ఉంటాయి. కానీ ఇది చాలా చిన్న మొక్క. అందుకే దీనిని నేల ఉసిరి అంటారు. నేల ఉసిరి మాత్రలు అందుబాటులో ఉంటాయి. ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సహజంగా నయమవుతుంది. ఇది మాత్రమే కాకుండా పునర్నవ లేదా తెల్ల గలిజేరు కూడా ఫ్యాటీ లివర్ తగ్గిస్తుంది. పునర్నవలో పునరుత్పత్తి అంటే కొత్త కణాలను తయారు చేసే గుణం ఉంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. భోజనం చేసే ముందు పునర్నవ రసం తీసుకోవడం వల్ల గ్యాస్ ఏర్పడదు, అలాగే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పునర్నవలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కాలేయ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి. *రూపశ్రీ.
read moreమామిడి కాయలతోనే కాదు.. మామిడి విత్తనాలు తిన్నా ఆరోగ్యమే..!
పండ్ల రారాజు మామిడి గురించి ఎంత చెప్పినా తక్కువే. రుచిలోనూ, ఆరోగ్యాన్ని చేకూర్చడంలోనూ మామిడికి తిరుగులేదు. అయితే అందరూ మామిడి కాయను తిని అందులో ఉండే విత్తనాలు పడేస్తుంటారు. అయితే మామిడి కాయతోనే కాదండోయ్.. మామిడి విత్తనాలు తిన్నా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయట. ఇంతకీ మామిడి విత్తనాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో.. వీటిని ఆహారంలో ఎలా తీసుకోవచ్చో తెలుసుకుంటే.. ప్రయోజనాలు.. మామిడి గింజలు ఫినోలిక్ సమ్మేళనాలుగా పిలువబడే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి కూడా దోహదం చేస్తాయి. మామిడి గింజలలో విటమిన్ సి తో పాటూ ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి బలమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. ఆహారంలో మామిడి గింజలను చేర్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో, ముఖ్యంగా ఫ్లూ సీజన్లో అనారోగ్యాలను దూరం చేసుకోవడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఫైబర్ చాలా అవసరం. మామిడి గింజలలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మామిడి గింజలను తీసుకోవడం వల్ల సాధారణ ప్రేగు కదలికలు మెరుగవుతాయి. మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఇది మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మామిడి గింజలలో ఉండే సమ్మేళనాలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆహారంలో మామిడి గింజలను చేర్చడం ద్వారా, మీరు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను మెయింటైన్ చేయవచ్చు. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ మామిడి గింజలు బరువు నిర్వహణలో సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాలం కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. అతిగా తినే పరిస్థితిని తగ్గిస్తుంది. అంతేకాదు ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఎలా తినవచ్చంటే.. మామిడి గింజలను స్మూతీస్ లోనూ, రోస్ట్ లలోనూ, స్నాక్స్ లలోనూ తీసుకోవచ్చు. అంతేకాదు మామిడి గింజలను ఉడికించి టీలా కూడా తీసుకోవచ్చు. మామిడి గింజలను పొడి చేసి వాటిని రోటీలు, కేకులు, బ్రెడ్ వంటి వాటి తయారీలోనూ వినియోగించవచ్చు. కూరలు చిక్కదనం రావడానికి. సూపుల చిక్కదనం కోసం కూడా మామిడి గింజలను ఉపయోగించవచ్చు. మరొక విషయం ఏమిటంటే.. మామిడి గింజలలో బయోటిన్ సమృద్దిగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా గొప్పగా సహాయపడుతుంది. *రూపశ్రీ.
read moreడెంగ్యూలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే, ఈ 5 ఆహారాలను తినండి..!!
దేశంలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరం ముప్పు విస్తరిస్తోంది. డెంగ్యూలో, రక్తంలో ప్లేట్లెట్స్ లోపం ఉంటుంది. దీని కారణంగా బలహీనత ఏర్పడుతుంది. ప్లేట్లెట్ కౌంట్ చాలా తగ్గితే, అది రోగి మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ రోజుల్లో డెంగ్యూ ప్రమాదం ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితిలో, రోగి యొక్క ప్లేట్లెట్ కౌంట్ తగ్గకుండా, దానిని పెంచడానికి ఆహారంలో కొన్ని అంశాలను చేర్చాలి. రక్తంలో ప్లేట్లెట్స్ను వేగంగా పెంచే ఆహారం (Foods that Increase Platelet Count) వంటి గురించి తెలుసుకుందాం. కివి: విటమిన్ సి తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది. ప్లేట్లెట్లను పెంచుకోవడానికి కివి మంచి ఆహారం అని ఆరోగ్య నిపుణులు కూడా నమ్ముతున్నారు. దీనితో పాటు, మీరు నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను తినవచ్చు. ఇది వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. మేక పాలు: ప్లేట్లెట్లను పెంచడానికి మేక పాలు ఔషధంలా పనిచేస్తాయి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లయితే...మీరు మేక పాలు తాగవచ్చు. పచ్చి, తాజా పాలు తాగడం మంచిది. వీటితో పాటు పాల ఉత్పత్తులు కూడా మేలు చేస్తాయి. కొబ్బరి నీరు: కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ప్లేట్లెట్లను పెంచడంలో కూడా మేలు చేస్తుంది. డెంగ్యూలో వాంతులు కావడం వల్ల డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉందని..దీనిని కొబ్బరి నీళ్లతో నివారించవచ్చు. ఇది రక్త కణాలకు, హిమోగ్లోబిన్కు కూడా మంచిది. బొప్పాయి ఆకు రసం: తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు బొప్పాయి తినాలని సూచించారు. దీనితో పాటు బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని ఉడికించి రసం తీసి తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. గిలోయ్: గిలోయ్ జ్యూస్ రక్తంలో తగ్గిన ప్లేట్లెట్ కౌంట్ను కూడా వేగంగా పెంచుతుంది. వీటన్నింటితో పాటు క్యారెట్, బీట్రూట్, గుమ్మడికాయ రసం కూడా డెంగ్యూ రోగులకు మేలు చేస్తాయి.
read moreఈ ఆహారాలు తింటే చాలు.. గుండె ఆరోగ్యం పదిలం..
గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కాలక్రమేణా పెరుగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ వ్యాధి వృద్ధాప్య సమస్యగా పిలువబడింది. కానీ ఇప్పుడు యువకులు కూడా దీని బారిన పడుతున్నారు. 10 ఏళ్లలోపు పిల్లల్లో కూడా గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు నిర్ధారణ అవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల దృష్ట్యా, అందరూ అప్రమత్తంగా ఉండాలని గుండె జబ్బులు నివారించడానికి నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన ప్రమాద కారకాల్లో గుండె జబ్బు ఒకటి, ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మరణాలకు ఇది కారణమవుతుంది. ప్రతి సంవత్సరం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాల గురించి ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేయడం, నివారణ పద్ధతుల గురించి వారికి అవగాహన కల్పించడం కోసం వరల్డ్ హార్ట్ డే ను సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. జీవనశైలి, ఆహారంలో అవాంతరాల వల్ల ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం బాగా పెరిగిందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. అయితే రోజువారీ కింద చెప్పుకునే ఆహారాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధకులు తెలిపారు. అవోకాడో .. అవకాడో గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన పండ్లలో ఒకటి. ఇందులో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతి వారం కనీసం రెండు అవోకాడోలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 16%, కరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పు 21% తగ్గుతుంది. అవకాడోలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆకు పచ్చని కూరగాయలు.. ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి రోజూ అవసరం. ఆకుపచ్చ ఆకుకూరలు, బీన్స్ వంటి కూరగాయలను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆకుపచ్చ కూరగాయలు విటమిన్ల మూలం, ఇది ధమనులను రక్షించడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నట్స్.. రోజువారీ ఆహారంలో అనేక రకాల గింజలను చేర్చుకునే వ్యక్తులలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది ఫైబర్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాల మూలం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. వాల్నట్లు గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం అయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్.. డార్క్ చాక్లెట్ వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా వినే ఉంటారు. ఇందులో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా మేలు చేస్తాయి. మితంగా చాక్లెట్ తీసుకోవడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో డార్క్ చాక్లెట్ తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. *నిశ్శబ్ద.
read moreఅరటిపండు ఎవరు తినచ్చు... ఎవరు తినకూడదు?
పోషకమైన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, తప్పుడు మార్గంలో పోషకాలను తీసుకోవడం కూడా హానికరం. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందరికీ చవగ్గా.. అందుబాటులో ఉండే పండ్లు ఏవైనా ఉన్నాయంటే అవి అరటిపండ్లే.. బరువు పెరగాలనుకునే లేదా బాడీ బిల్డింగ్ చేయాలనుకునేవారు, సన్నగా ఉండేవారు అరటిపండ్లను తినాలి. టోన్డ్ బాడీ మరియు బలమైన కండరాల కోసం అరటిపండ్లు తినడం మంచిదని వైద్యులు కూడా చెబుతారు. అయితే అరటిపండు శారీరక దృఢత్వాన్ని సమతుల్యం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అరటిపండులో అనేక గుణాలు ఉన్నాయి, ఇవి వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి. కానీ శరీరాన్ని బలోపేతం చేయడానికి అరటిపండ్లను తీసుకుంటే అది సరైన మార్గంలో ఉండాలి. అరటిపండ్లను తప్పుగా తినడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి, దానికి తోడు ఆరోగ్యానికి హానికరం కూడా. అరటిపండ్లను సరిగ్గా ఎలా తీసుకోవాలో, అరటిపండ్లు తినేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుంటే సమస్యే ఉండదు.. ◆అరటిపండులోని పోషక గుణాలు రోజూ ఒక అరటిపండు అనేక వ్యాధుల నుండి కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, థయామిన్, రిబోఫ్లేవిన్ ఉన్నాయి. అరటిపండులో నీరు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. ◆అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు బలహీనత అరటిపండు తింటే పొట్ట త్వరగా నిండుతుంది. మీరు ఉదయం అల్పాహారంగా అరటిపండ్లు తిన్న తర్వాత బయటకు వెళితే, మధ్యాహ్నం భోజనం వరకు మీ కడుపు నిండుగా ఉంటుంది> దానికి తగినట్టే శక్తి ఉంటుంది. జీర్ణక్రియ అరటిపండు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అరటిపండులో ఉండే స్టార్చ్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. దీంతో గుండెల్లో మంట సమస్యను కూడా నయం చేసుకోవచ్చు. బరువు అరటిపండులో ఉండే పీచు, పిండి పదార్ధాలు చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతాయి. దీని వల్ల ఆకలి ఉండదు. బరువు అదుపులో ఉంటుంది. ◆అరటిపండు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు మలబద్ధకం మలబద్ధకం ఉన్నవారు అరటిపండు తినకుండా ఉంటేనే మంచిది. చక్కెర స్థాయి అరటిపండు షుగర్ రోగులకు హానికరం. అరటిపండులో సహజమైన చక్కెర ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ◆అరటిపండ్లు తినడానికి సరైన సమయం అరటిపండ్లను తినడానికి సరైన సమయం సమయం.. ఉదయం అల్పాహారంలో అరటిపండు తీసుకోవడం. అరటిపండును ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. రాత్రి పడుకునే ముందు అరటిపండు తినకూడదు. రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. దీని వల్ల దగ్గు సమస్య వస్తుంది. దీనితో పాటు, కడుపు అధికంగా నింపడం వల్ల నిద్రలేమి కూడా ఉండవచ్చు. ◆ అరటిపండ్లను ఎలా తినకూడదు.. అరటిపండ్లతో పాలు తాగకూడదు. ఆయుర్వేదంలో అరటిపండు, పాలు కలపడం నిషేధించబడింది. వైద్యుల ప్రకారం, ఇది జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. నిద్రలేమికి కారణం అవుతుంది. బనానా స్మూతీ తినవచ్చు. అరటిపండు, నెయ్యి కలిపి సేవించవచ్చు. మీరు ఉదయం అల్పాహారంలో అరటిపండు పెరుగు కలిపి తినవచ్చు. అరటిపండు, పెరుగు వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు. ◆నిశ్శబ్ద.
read moreపరగడుపున తులసి ఆకు తింటే ఆ సమస్యలన్నీ పరార్!
భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను దైవంతో సమానంగా కొలుస్తుంటారు. దైవంతో సమానంగా కొలిచే ఈ తులసి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పరగడుపున ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకుంటే పలు శారీరక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఒక అడాప్టోజెన్. ఇందులో విటమిన్లు ఎ, సి, కాల్షియం, ఐరన్, జింక్ వంటి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుంది. తులసి ఆకులను ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు. తులసిని తీసుకోవడం వల్ల ఎక్కువ శారీరక శ్రమ, ఇస్కీమియా, శారీరక నిగ్రహం, చలి, శారీరక ఒత్తిడి నుండి అవయవాలు, కణజాలాలను రక్షించడంలో వరకు సహాయపడుతుంది. పరగడుపు తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి: తులసి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందువల్ల, ఇది మీ శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడుతుంది, ఆరోగ్యకరమైన రోగనిరోధక కణాలను పెంచుతుంది. అందుకే కషాయం చేసేటప్పుడు తులసిని కలుపుతారు. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది: తులసిని క్రమం తప్పకుండా తీసుకుంటే, జీర్ణక్రియను సులభతరం చేసి... ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్లను బ్యాలెన్స్ చేస్తుంది. మీరు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను కలిగి ఉండటానికి pH స్థాయిని నిర్వహిస్తుంది. ఇలా రెండు తులసి ఆకులను నోటిలో వేసుకుని నములుతే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసనకు చెక్: చాలా మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. ఎవరితో అయినా దగ్గరగా మాట్లాడాలంటే జంకుతుంటారు. అలాంటి సమస్య ఎదుర్కొంటున్నవాళ్లు..ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను నమలడం అలవాటు చేసుకోవాలి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. రిఫ్రెష్గా ఉండటానికి ఉదయాన్నే వీటిని తినండి. ఒత్తిడిని దూరం చేస్తుంది: తులసి ఆకులలో అడాప్టోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మీ నాడీ వ్యవస్థను విశ్రాంతి తీసుకోవడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఇంద్రియాలను ప్రశాంతపరుచడంతోపాటు...ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది: మీరు ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే, అది మీ రక్తం నుండి ట్యాక్సిన్లను బయటకు పంపుతుంది. ఇది మొటిమలు, మచ్చలను తగ్గించి మచ్చలు లేని చర్మాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: తులసిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ విడుదల పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. తులసిలో ఉండే కార్బోహైడ్రేట్లు జీవక్రియను సులభతరం చేస్తాయి. తులసి దాని యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఉదయాన్నే తీసుకుంటే, జలుబును నయం చేస్తుంది.
read moreమనం ఎంతో ఆరోగ్యం అనుకునే ఈ ఆహారాలు ఎంత డేంజరంటే..!
ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు అందరూ చెప్తారు. సాధారణంగా ఆరోగ్యం మెరుగ్గా ఉన్న ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలను తప్పనిసరిగా తమ ఫుడ్ మెనూలో చేర్చుకుంటారు. అయితే చాలా మంది రోజూ తింటున్న కొన్ని ఆహారాలు శరీరానికి ఎంతో మంచిదనే భ్రమలో ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇలా తీసుకుంటున్న కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి మంచి చేయకపోగా చెడు చేస్తయని ఆహార నిపుణులు అంటున్నారు. అందరూ ఆరోగ్యం అనుకుంటున్న ఏ ఏ ఆహారాలు ఆరోగ్యానికి చేటు చేస్తాయో.. అసలవి ఎందుకు మంచివి కాదో తెలుసుకుంటే.. డైజెస్టీవ్ బిస్కెట్స్.. డైజెస్టివ్ అనే పేరును బట్టి ఈ బిస్కెట్లు చాలా ఆరోగ్యకరం అని అనుకుంటారు. చాలా మంది ఆకలిగా అనిపించినప్పుడు, అల్పాహారంలోనూ ఈ బిస్కెట్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజానికి డైజెస్టివ్ బిస్కెట్లు పిండి, చక్కెరతో నిండి ఉంటాయి. వీటిలో చాలా కేలరీలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే, బరువు చాలా సులభంగా పెరుగుతారు. ఖఖ్రా.. ఈ రోజుల్లో డైట్ ఖఖ్రా మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంది. చాలామంది సాయంత్రం టీతో పాటు వీటిని చాలా ఉత్సాహంగా తింటారు. అయితే డైట్ ఖఖ్రాలో 'డైట్' లాంటిది ఏమీ ఉండదనేది విస్తుపోవాల్సిన విషయం. ఈ వేయించిన స్నాక్స్ లో చాలా కేలరీలు ఉంటాయి. హెల్త్ డ్రింక్స్.. ఇప్పట్లో హెల్త్ డ్రింక్స్ చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. పిల్లలకు ఈ హెల్త్ డ్రింక్స్ వాడకం మరీ ఎక్కువ ఉంటోంది. ఎందుకంటే పిల్లలకు పాలు ఇవ్వాలంటే ఈ హెల్త్ డ్రింక్స్ పౌడర్లు ఉండాల్సిందే. అయితే కంపెనీలు పేర్కొన్నట్టు విటమిన్లు, DHA కలిగిన ఈ హెల్త్ డ్రింక్స్ పౌడర్లు చాలా అనారోగ్యకరమైనవి. వీటిలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. వీట్ బ్రెడ్.. వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్, లేదా గోధుమ బ్రెడ్ ఆరోగ్యకరమైనదని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ బ్రౌన్ బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్ లాగా అనారోగ్యకరమైనది. ఎందుకంటే ఇందులో రంగులు ఉపయోగించబడతాయి, దీని తయారీలో ఆరోగ్యకరమైన పదార్థాలేవీ ఉపయోగించరు. *నిశ్శబ్ద.
read moreప్రతిరోజూ రెండు చిన్న లవంగాలు నమిలి గ్లాసుడు గోరువెచ్చని నీరు తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..
లవంగాలు వంటగదిలో ఉండే మసాలా దినుసు. ఇది వంటల్లోకే కాకుండా దగ్గు, జలుబు వంటి సమస్యలున్నప్పుడు కషాయం తయారుచేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో లవంగాలకు ఔషద స్థానం ఇచ్చారు. లవంగాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-సి రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం నూనెను ఉపయోగించడం వల్ల దంతాల ఆరోగ్యం బాగుంటుంది. ఇంత శక్తివంతమైన లవంగాలను ప్రతిరోజూ రెండు నమిలి తిని గోరువెచ్చని నీరు తాగితే అద్బుతాలు జరుగుతాయి. అవేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. లవంగాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది , ఎందుకంటే ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల పరిమాణాన్ని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి లవంగాలలో లభిస్తుంది, ఇది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన విటమన్. లవంగాలలోని యాంటీ-వైరల్ గుణం రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది రక్తంలోని టాక్సిన్లను తగ్గిస్తుంది. తెల్ల రక్త కణాలను ప్రేరేపించడం ద్వారా వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ రెండు లవంగాలు తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే జరిగే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.. లవంగం జీర్ణ సమస్యలకు చికిత్సగా ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఇది జీర్ణ ఎంజైమ్ల స్రావాన్ని పెంచుతుంది, వికారం కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదని, మలబద్ధకం సమస్యను తొలగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పంటినొప్పిని దూరం చేస్తుంది.. లవంగాలలో మత్తు లక్షణాలు ఉంటాయి. పంటి నొప్పి ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం పొందాలంటే లవంగాన్ని గ్రైండ్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని దంతాలు, వాపు ఉన్న చిగుళ్లపై రాయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా లవంగాల నూనె కూడా ఉపయోగించవచ్చు. ఇవన్నీ కాకుండా ప్రతిరోజూ 2 చిన్న లవంగాలు నమిలి తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే అస్సలు పంటి నొప్పి, చిగుళ్ళ వాపు వంటి సమస్యలే ఎదురుకావు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.. మన శరీరాన్ని శుద్ది చేయడానికి, మనం తీసుకునే మందులను జీవక్రియ చేయడానికి కాలేయం బాధ్యత వహిస్తుంది. లవంగం నూనెలో ఉండే యూజినాల్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తిని గోరువెచ్చని నీరు తాగితే కాలేయానికి సంబంధించిన సమస్యలే రావు. నొప్పి, వాపు తగ్గిస్తుంది.. లవంగాలలో యూజీనాల్ అనే మూలకం ఉంటుంది, ఇది వాపును, నొప్పిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తినడం అలవాటు చేసుకుంటే ఈ నొప్పులు, వాపులు ఆమడ దూరం ఉంటాయి. ఎముకలు, కీళ్లకు మంచి మెడిసిన్.. లవంగాలలో ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్, యూజినాల్ వంటి కొన్ని మూలకాలు ఉంటాయి, ఇవి ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి మంచివి. ఇవి ఎముకల మందాన్ని పెంచుతాయి, ఎముక కణజాలం ఏర్పడటానికి సహాయపడతాయి. అంతే కాదు ఎముకలకు ఆరోగ్యకరమైన ఖనిజాలను అందించడంలో కూడా సహాయపడుతుంది. చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది.. ఇంట్లో ఎవరికైనా చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, లవంగాలు శరీరంలో ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. ఇది రక్తం నుండి అదనపు చక్కెరను కణాలలోకి ఎగుమతి చేస్తుంది, మిగిలిన చక్కెరను సమతుల్యం చేస్తుంది. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవారు , చక్కెర వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉన్నవారు రోజూ రెండు లవంగాలు తిని, గోరువెచ్చని నీరు తాగడం మంచిది. *నిశ్శబ్ద.
read moreపండుమిరపకాయతో ఆరోగ్యం పదిలం
భారతీయులకు మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవితంలో మిరపకాయలు లేనిదే పనిజరగదు. ఆయుర్వేదపరంగా కూడా మిర్చిని మితంగా తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. వంటకాల్లో ఎండుకారం కంటే మిరపకాయలు వేసుకోవడమే ఆరోగ్యమని సూచిస్తుంటారు. అమెరికాలో జరిగిన ఓ పరిశోధన అయితే పండు మిరపకాయల వల్ల ఏకంగా ఆయుష్షే పెరుగుతోందని చెబుతోంది. అమెరికాలోని వెర్మోంట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మిరపకాయలకీ, ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు కొన్ని గణాంకాలను సేకరించారు. ఇందుకోసం పదహారు వేలమంది అమెరికన్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 23 ఏళ్లపాటు వీరి ఆరోగ్య వివరాలను నిశితంగా గమనించారు. తాము సేకరించిన వివరాలలో పండు మిర్చి తినే అలవాటు కల్గినవారు కాస్త భిన్నంగా ఉన్నట్లు పరిశోధకులకు తోచింది. యువకులు, మంచి తిండిపుష్టి కలిగినవారు, మగవారు పండుమిరపకాయలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు గమనించారు. తక్కువగా చదువుకుని చిన్నపాటి జీతాలతో బతికేవారిలో మిర్చిని తినే అలవాటు ఎక్కువగా కనిపించింది. (కాస్త జాగ్రత్తగా గమనిస్తే మన దేశంలో కూడా ఎండుమిర్చిని తినేవారు ఈ కోవకే చెందడాన్ని గమనించవచ్చు) ఆశ్చర్యకరంగా పండుమిర్చి తినేవారిలో గుండెపోటు లేదా పక్షవాతంతో చనిపోయే అవకాశం ఏకంగా 13 శాతం తక్కువగా కనిపించింది. పండుమిరపకాయలు తినేవారు తప్పనిసరిగా సుదీర్ఘకాలం బతుకుతారన్న హామీని ఇవ్వలేం కానీ.... వారిలో కొన్నిరకాల ఆరోగ్యసమస్యల తాకిడి తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. మిర్చిలో ఉండే కేప్సైసిన్ (CAPSAICIN) వంటి పదార్థాల వల్ల రక్తప్రసారం మెరుగుపడుతుందనీ, శరీరంలోని హానికారక క్రిములు నశిస్తాయనీ భావిస్తున్నారు. రుచి, రంగు ఉండని ఈ కేప్సైసిన్ వల్ల మన కణాల మీద ఉండే Transient Receptor Potential (TRP) అనే వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందట. ఇది కూడా దీర్ఘాయుష్షుకి కారణం అని నమ్ముతున్నారు. పండుమిర్చి వల్ల ఉపయోగాలు ఉన్నాయంటూ శాస్త్రవేత్తలు ధృవీకరించడం ఇది మొదటిసారేం కాదు! మనలోని కొవ్వుపదార్థాలను విడగొట్టి ఊబకాయం దరిచేరకుండా చేయగల సమర్థత మిర్చికి ఉందని ఈపాటికే తేలిపోయింది. ఒంట్లో కొవ్వు పేరుకోకపోతే గుండె కూడా దృఢంగానే ఉంటుంది కదా! తాజా పరిశోధన ఈ విషయాన్నే రుజువులతో సహా నిరూపించింది. కాకపోతే మోతాదుకి మించి కారాన్ని తీసుకుంటే మాత్రం నానారకాల ఆరోగ్యసమస్యలూ దరిచేరక తప్పవంటున్నారు వైద్యలు. మితంగా తీసుకుంటే ఏ ఆహారం వల్లనైనా ఉపయోగమే అని పెద్దలు ఊరికే అనలేదు కదా. - నిర్జర.
read moreబ్లాక్ టీ అంటే ఇష్టమా... అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి!
టీ తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా హానికరమా? అనే విషయం గురించి చాలా కాలంగా చర్చ నడుస్తూనే ఉంది. టీని మితంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ టీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని అందరూ అంటుంటారు. పరిశోధకులు కూడా ఇప్పుడు ఇదే విషయం చెబుతున్నారు. బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. గుండె నుండి గట్ వరకు ఇంకా మధుమేహం నుండి బరువు నియంత్రణ వరకు చాలా సమస్యలలో బ్లాక్ టీ మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది. కరోనా సమయంలో బ్లాక్ టీ చాలా చర్చనీయాంశమైంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని తెలిసింది, ఇది అంటు వ్యాధుల శరీరాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీలోని కెఫిన్.. బ్లాక్ టీ లో ఉండే కెఫిన్ మధుమేహం నుండి గుండె జబ్బుల వరకు ప్రతిదానికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కెఫిన్ మూత్రపిండాలకు హానికరమని కొందరు చెబుతుంటారు. టీ, కాఫీలలో కెఫీన్ ఉండటం సాధారణం. ఇది మూత్రపిండాలకు మంచితో పాటు చెడు కూడ చేస్తుంది. ఇదంతా ఎంత టీ తీసుకుంటున్నాం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. మూత్రపిండాలపై కెఫీన్ దుష్ప్రభావాలు ఎంతంటే.. కెఫిన్ మూత్రపిండాలకు ప్రయోజనం చేకూరుస్తుందని పరిగణించబడుతున్నప్పటికీ, ఇది దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. కెఫిన్ రక్తపోటును ప్రభావితం చేస్తుంది. అధికంగా కెఫిన్ తీసుకోవడం సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ పెంచుతుంది. కిడ్నీ వ్యాధికి అధిక రక్తపోటు ప్రధాన ప్రమాద కారకం కాబట్టి, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. బ్లాక్-టీ లో ఆక్సలేట్ గురించి తెలుసా?? బ్లాక్ టీలో కనిపించే ఆక్సలేట్ మూత్రపిండాలకు చాలా హానికరమైనది. బ్లాక్ టీలో కరిగే ఆక్సలేట్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్సలేట్లు కాల్షియంతో కలుస్తాయి. ఇవి స్ఫటికాలను ఏర్పరుస్తాయి, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. ఈ కారణంగానే బ్లాక్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు నిపుణుల సలహా ఏమిటంటే.. బ్లాక్ టీ ఆరోగ్యానికి మేలు చేసేదే, ఈ విషయం పరిశోధనల్లో కూడా తేలింది. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ ఇదంతా బ్లాక్ టీ ని మితంగా తీసుకోవడం వల్ల మాత్రమే కలిగే ప్రయోజనం. బ్లాక్ టీ ని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజులో రెండు కప్పులకు మించి బ్లాక్ టీ తాగడం ప్రమాదం. *నిశ్శబ్ద.
read more


.webp)
.webp)





.webp)
.webp)
.webp)


.webp)



.webp)



