Home » D Kameshwari » Vivahabandalu
శివరామ్ కెమికల్ ఇంజనీరు. తండ్రి లాయరు. మరీ సంపన్నులు కాకపోయినా మా కంటే పై మెట్టులో ఉన్న వారే. పెళ్ళి చూపులు అయ్యాయి. పిల్ల నచ్చిందన్నారు. శివరామ్ అందగాడు అని చెప్పలేక పోయినా యే వంక పెట్టలేనివాడు. అన్ని విధాల మంచి సంబంధం. ఓ వెయ్యి రెండు వేలు ఎక్కువైనా సంబంధం వదలకండి, పిల్ల సుఖపడుతుంది. అమ్మ పోరు పెట్టింది. కాని వాళ్ళు కట్నం ఎనిమిది వేలు, లాంఛనాలు వేరు అనగానే నాన్న నీళ్ళు కారి పోయారు.
కట్నం గురించి ఇంట్లో వాళ్ళ చర్చలు వింటూంటే ఆడపిల్లగా పుట్టడం యేదో నేరంలా నా అపరాధంలా బిడియపడ్డాను. ఆడపిల్లగా పుట్టించినందుకు ఆ భగవంతుడ్ని నిందించాను. నాకెందుకో మనసులో వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. కట్నం వద్దంటారని, కనీసం పెళ్ళికొడుకు కట్నం వద్దని తన సంస్కారం నిరూపించు కుంటాడని ఆశించాను. కాని వాళ్ళంత ఖచ్చితంగా అడిగారని వినగానే నా మనసులో యేదో అసంతృప్తి చోటు చేసుకుంది.
ఆఖరికి నాలుగు రోజులుకిందా మీదా పడి ఆలోచించి ఈ సంబంధం చేయడానికే నిర్ణయించారు అమ్మనాన్న. ప్రావిడెంటు ఫండు లోంచి అప్పు, బ్యాంకులో కొంత అప్పు, మా మేనమామ నుంచి కొంత తీసుకోడానికి నిశ్చయించారు.
"డాక్టరుగారూ, ఇంత విపులంగా ఎందుకు చెపుతున్నానంటే ముందు నించి జరిగిన ఒక్కొక్క సంఘటన మనసు మీద ఎలా దెబ్బతీసాయో మీకు అర్ధంకావాలని ..."
విజయ అంగీకారంగా తల ఊపింది.
"కట్న కానుకల భారం ఎక్కువవడంతో పెళ్ళి క్లుప్తంగా చెయ్యక తప్పలేదు మా నాన్నగారికి. మా అక్కకి పదివేలు యిచ్చిన మాట నిజం. మొదటి కార్యం అని కాస్త ఆడంబరంగానే చేశారు. కాని ఈ సారి తూగలేక అయిందనిపించాల్సివచ్చింది. యేర్పాట్లు ఘనంగా లేవని, వాళ్ళకి మర్యాద చాల్లేదని పెళ్ళివారు మూతులు ముడుచుకున్నారు.
"మేం వుండేది రెండు రోజులు. పెళ్ళి బాగా చెయ్యాలని తెలీదా? ఇవేం యేర్పాటులు? మేం అంత గతిలేని వాళ్ళమా - మా పెద్దకోడలు వారు ఎంతో ఘనంగా చేశారు. ఈ చీరలేమిటి, స్టీలుబిందెలన్నా పెట్టాలని తెలీదా? ఈ బట్టలు మా ఇంట్లో నౌకరీ వాళ్ళకి పెడ్తాం" అంటూ ముహూర్తం రోజు అత్తగారు ఆడపడుచులు నానా ఆర్భాటం చేశారు.
చేసేదేంలేక తెచ్చిన చీరలు మార్చి పట్టుచీరలు, స్టీలు బిందెలు వగైరా అప్పటికప్పుడు తీసుకొచ్చారు. అడుగడుగునా వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే మనసు విరక్తితో నిండింది. ఆ ఉన్న నాలుగు పూతలు మా వాళ్ళందరిని పరుగు లెత్తించి, కావాల్సినన్ని చేయించుకొని ఆఖరికి మూతులు ముడుచుకొనే రైలు ఎక్కారు.
పెళ్ళికూతురితో ఎవరన్నారండి అని మాటవరసకైనా అనలేదు వాళ్ళు. అయినా వక్కర్తినీ పంపలేక అక్కని తోడిచ్చి పంపారు నాన్నగారు. ఇలాంటి అత్తవారితో శారద ఎలా వేగుతుందో ఏమో? బంధువులు రహస్యంగా అనుకొంటున్నామనుకొని అన్ని సానుభూతి మాటలు నా చెవిన పడకపోలేదు.
జరిగిన సంఘటనవలనో, లేక ఆయన స్వభావామో తెలియదుగాని పెళ్ళికొడుకు ముభావంగా మూడిగా ఉన్నట్లు అన్పించింది నాకు. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు పక్క పక్కన కూర్చున్నా అతను నాతో మామూలు మాటలైనా మాట్లాడాలని ప్రయత్నించక పోవడం, కొత్త దంపతుల మాదిరి ఓరగా చూస్తూ, చెయ్యి తాకించాలనే కొంటె కోర్కెలు ఏమీ అతనిలో కనపడలేదు.
నవ వధువు భర్తనించి చిన్న అనురాగ పూరితమైన చూపు, చిన్న చిరునవ్వు ఆశించడం అత్యాశా? అతని తత్వమే అంతా? ఏదీ తేల్చుకోలేక మనిషి స్వభావం అప్పుడే నిర్ణయించ గూడదని మనసుకి నచ్చ జెప్పుకున్నాను. ఎంత నచ్చ జెప్పుకున్నా ఎందుకనో నేను కట్టుకున్న ఊహాసౌధం గాలిమేడ అన్న భావం నాలో పొడచూపింది.
దానికి తగ్గట్లు మా అత్తగారు హఠాత్తుగా "సారె సామాను ఏమీ తీసుకురావడంలేదా? మీ వాళ్ళు డబ్బిచ్చేసారా? లేక తర్వాత కొంటారా!" అంది మా అక్కవంక, నావంక చూస్తూ.
మేం ఇద్దరం గతుక్కుమన్నాం. ఎదురు చూడని పశ్నకి కలవరపడ్డాం.
అక్క పెళ్ళికికూడా కట్నం ఎక్కువవడంతో పెద్దగా సారె సామాను ఇవ్వలేక పోయారు. రెండు మంచాలు పరుపులు ఇచ్చి పంపారు. పాత్ర సామాన్లు కొంచెం ఇచ్చి పంపారు. నా పెళ్ళికి ఆ మాత్రం కూడా తూగలేకపోయారు.
అమ్మ ఏదో అనబోతుంటే నాన్న "నన్నింక చంపకు" అన్నాడు చిరాగ్గా.
నేను కూడా అమ్మతో "అంత కట్నం ఇచ్చారు. వాళ్ళే కొనుక్కుంటారు. ఇంకేం ఇయ్యక్కర్లేదు" అన్నాను ఖండితంగా. నా పరుపు, బట్టల పెట్టెతో బయలుదేరాను.
"ఎంతిచ్చారు మంచాలకి, ఫర్నీచర్ కి, గిన్నెలకి?" ఆవిడ రెట్టించి మళ్ళీ అడిగారు.
ఆవిడ వరస చూస్తే మరో రెండుమూడు వేలు ఖర్చుపెట్టి యింట్లో సామాను కొనేయ్యాలన్నట్టుంది.