Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    జనులు అర్జునుని చూచినారు. వారి ఉత్సాహము పొంగినది. కేకలు వేసినారు. కేరింతలు పెట్టినారు. కుంతి కొడుకును చూచుకున్నది. జనుల అట్టహాసము విన్నది. ఆమె చన్నులు పాలు చేసినవి.
    ధృతరాష్ట్రుడు ఆ ధ్వని విన్నాడు. ఆదరిపదినాడు. విదురుడుని కారణము అడిగినాడు.
    "మహారాజా! అర్జునుడు అస్త్ర విద్యా ప్రదర్శనకు రంగ స్థలమున ప్రవేశించినాడు. అతనిని జనులు ఉత్సాహవంతులయి కేకలు పెట్టుచున్నారు. " చెప్పినాడు విదురుడు.
    "విదురా! నాకు చెవులున్నవి. అందుకు ఫలితము ఇప్పుడు కనిపించినది. పాండవుల విద్యాశక్తులు విన్నాను. వారు నా వంశపువారు. అందువలన నా పాపములు నశించినవి. నా వంశీయులు కృతార్ధులు అయినారు." అన్నాడు ధృతరాష్ట్రుడు.
    అర్జునుడు విద్యా ప్రదర్శనకు ఉపక్రమించినాడు. ద్రోణునకు మ్రొక్కినాడు. అమ్ము తీసినాడు. సంధించినాడు. విడిచినాడు. ఆగ్నేయాస్త్రము వేసినాడు. భయంకరమగు అగ్నిని పుట్టించినాడు. వారుణము వేసినాడు. జలమును పుట్టించినాడు. వాయువ్యము వేసినాడు. మహావాయువు పుట్టించినాడు. మేఘాస్త్రము వేసినాడు. మహా మేఘము పుట్టించినాడు. భూమి బాణము చేత భూమిలో ప్రవేశించినాడు. పర్వత బాణము చేత పర్వత రూపము ధరించినాడు. ఒక క్షణము పొట్టివాడు అయినాడు. మరుక్షణమున పొడగరి అయినాడు. అప్పుడే రధారూధుడు అయినాడు. అప్పుడే గజారూడుడు అయినాడు. అప్పుడే అశ్వారూధుడు అయినాడు. అది చూచి జనులు ఆశ్చర్యమున మునిగినారు. అట్లుండ వారిని మరింత చకితులను చేసినాడు.
    పరిగెత్తుచున్న సింహము, పులి, పంది మొదలగు వాటి నోళ్ళలో ఒకే బాణము వేయు రీతి అయిదు బాణములు వేసినాడు. తాటివలె అవుకొమ్ము వ్రేలాడదీసినాడు. దానికి వరుసగా ఇరువది యొక్క బాణములు నాటినాడు. ఆ విధముగా అర్జునుడు గదా ఖడ్గాది నానావిధ విద్యలను ప్రదర్శించినాడు. అతని విద్యలు చూచినారు జనులు. ఉప్పొంగినారు. సభా సదులు ఆశ్చర్యపోయినారు. రాజులు, సామంతులు ముక్కున వేలు వేసుకున్నారు.
    అప్పుడు కర్ణుడు రంగస్థలమున ప్రవేశించినాడు. భుజా స్ఫాలనము చేసినాడు. అది విన్నారు జనులు. బెదిరినారు. ఆ ధ్వని కొండమీద పడిన వజ్రాయుధమువలె ఉన్నది. పాండవులు అది విన్నారు. ద్రోణాచార్యుల వద్దకు ఉరికినారు. చెల్లాచెదురుగా ఉన్న కౌరవులు దుర్యోధనుని దగ్గరకు ఉరికినారు.
    కర్ణుడు పాల వృక్షము వలె ఉన్నాడు. అతడు సహజ కవచ కుండలములు కలిగి ఉన్నాడు. సూర్యుని వలె ప్రకాశించుచున్నాడు. కర్ణుడు సభను కలయ చూచినాడు. కృపునకు, ద్రోణునకు నమస్కరించినాడు. ఉరుము వలె పలికినాడు:-
    "అర్జునా! ధనుర్విద్యయందు నీవే మొనగాడవు అనుకొనకు. నేను కొన్ని విద్యలు నేర్చినాను. నీవు చూపిన విద్యలను నేను కూడ చూపగలను."
    కర్ణుని మాటలు విన్న అర్జునుడు కోపమును, సిగ్గును కలిగినవి. దుర్యోధనునకు సంతోషము కలిగినది. కర్ణుడు ద్రోణుని అనుమతి పొందినాడు. అర్జునుడు చూపిన విశేషములను చూపినాడు. జనులు ఆనందమున పొంగి, పోరలినారు. సముద్రమువలె ఘోషించినారు. దుర్యోధన, దుశ్శాసనాదులు కర్ణుని కౌగలించుకున్నారు. "కర్ణా! నీవు నాకు పరమమిత్రుడవు అయినావు. నాకును, నా బంధువులకును మేలు చేసినావు. నా రాజ్య భోగములను నీవును అనుభావింపుము" అన్నాడు దుర్యోధనుడు.
    "దుర్యోధన మహారాజా! ఈ సభకు నానాదేశపు రాజన్యులు వచ్చి ఉన్నారు. వీరిముందు అర్జునునితో ద్వంద్వ యుద్దము చేయవలెనని ఉన్నది. నీవును చూచుచుండుము" అన్నాడు కర్ణుడు.
    అర్జునుడు ఆ మాటలు విన్నాడు. "కర్ణా! నీకు నీ శక్తి మాత్రము తెలియును. పరుల శక్తి తెలియదు. నిన్ను ఎవరు పిలిచినారని సభకు వచ్చినావు?" అని అడిగినాడు.
    "అర్జునా! బలహీనులవలె మాట్లాడుచున్నావు. పిలువకనే వచ్చినానా? ఇది విద్యా ప్రదర్శన రంగస్థలము. సమర్దులందరకు ఆహ్వానమున్నది. నీవును సమర్దుడవు అయిన ధనస్సును అందుకొని ముందుకు రమ్ము మాటలు మానుము."
    అర్జునుడు అది విన్నాడు. అగ్గివలె మండిపడినాడు. ధర్మరాజు అనుమతి పొందినాడు. రంగమున ప్రవేశించినాడు.
    ఒకవైపు అర్జునుడు మరొక వైపు కర్ణుడు. రెండు అగ్నిశిఖల వలె నిలిచినారు. ఇద్దరు సూర్యుల వలె నిలిచినారు. సభలో వెలుగుల వెల్లువలు కనిపించినవి.
    కర్ణుడు పర్జన్యాస్త్రము ప్రయోగించినాడు. దానితో కారుమబ్బులు కమ్ముకున్నవి. చిమ్మ చీకట్లు కమ్మినవి. అర్జునుడు కనిపించలేదు. అది చూచినది కుంతి. మూర్చిల్లినది. అర్జునుడు వాయవ్యము ప్రయోగించినాడు. చీకట్లు పటాపంచలయినవి. మబ్బులు చెదిరిపోయినవి. వెలుగులు కలిగినవి. కుంతి మూర్చ నుండి తెరుకున్నది.
    అప్పుడు కర్ణార్జునులు ఉభయులు ఇద్దరు సూర్యులవలె వెలుగొందినారు. ధర్మమూర్తి అయిన కృపాచార్యుడు వారి నడుమ నిలిచినాడు అన్నాడు:-
    "కర్ణా! అర్జునుడు కురువంశపువాడు. పాండురాజునకు కుంతీదేవికి పుట్టినవాడు. నీవు అతనితో ద్వంద్వ యుద్దము కోరినావు. నీ కుల గోత్రములను, తలిదండ్రులను చెప్పుము. నీవు రాజవంశమువాడవైన అర్జునుడు నీతో యుద్దము చేయును."
    కర్ణుడు ఆ మాటలు విన్నాడు. గ్రహణము పట్టినట్లు తేజోహీనుడు అయినాడు. సిగ్గుపడినాడు. తలవంచుకున్నాడు. నేలను చూచినాడు. నేల కరుణించలేదు. సూర్యుని చూడలేక పోయినాడు.
    కృపాచార్యుని మాటలు విన్నాడు దుర్యోధనుడు. కర్ణుని స్థితిని కన్నాడు. మండి పడినాడు. రంగస్థలమునకు ఉరికివచ్చినాడు. "కృపాచార్యా! అన్యాయముగా మాట్లాడినావు. రాచకులమున పుట్టినవాడు, శౌర్య ప్రతాపములు గలవాడు, అధిక సైన్యముగలవాడు ఈ ముగ్గురు రాజులగుదురు. తనకున్న అధిక శౌర్య ప్రతాముల వలన కర్ణుడు రాజగును. అర్జునునితో యుద్దము చేయతగును. అదియు కాదందువా కర్ణుని ఇప్పుడే అంగరాజ్యమునకు పట్టము కట్టెదను." అన్నాడు . భీష్మ, దృతరాష్ట్రుల అనుమతి పొందినాడు. కర్ణుని బంగారు సింహాసనమున కూర్చుండ బెట్టినాడు. అభిషేకము చేసినాడు. కర్ణుడు కిరీటము, భుజకీర్తులు ధరించినాడు. సకల రాజ చిహ్నములతో తేజరిల్లినాడు. కర్ణుడు నేలను చూడలేదు. సూర్యుని చూచినాడు.
    కర్ణుని పెంచిన తండ్రి సూతడు అది చూచినాడు. ఉరికివచ్చినాడు. కర్ణుడు గద్దె దిగి వచ్చినాడు. తండ్రికి పాదాభివందనము చేసినాడు. కర్ణుని కౌగలించుకున్నాడు. శిరసు ముద్దాడినాడు.
    అప్పుడు కర్ణుడు దుర్యోధనుని చేరి "మహారాజా! నాలుగు సముద్రముల నుండి వచ్చిన రాజుల ముందు నన్ను రాజును చేసినావు. నా మానము కాపాడినావు. నేను నీకు ఎట్లు సాయము చేయగలను?" అని అడిగినాడు.
    "కర్ణా! నీవు నాతో సర్వదా స్నేహము కలిగి ఉండుము. అంతే. అదియే నాకిష్టము" అన్నాడు దుర్యోధనుడు. నాటి నుంచి వారు ప్రాణ స్నేహితులు అయినారు. కర్ణుడు స్నేహమూర్తి. అతడు స్నేహప్రతీక స్నేహ పతాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.