Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    విధి నియమములకు అతీతులు కొందరుందురు. వారు తమ ప్రతిభా పాటవములతో , పుట్టువృత్తులు విడిచి , సమాజమున స్థానము సంపాదించుకొందురు. శరద్వంతుడు , విశ్వామిత్రుడు, కర్ణుడు మున్నగువారు అట్టివారు. ఏకలవ్యుడును అట్టివాడే. అతని ప్రయత్నము ఫలించలేదు. అది నిజము. కాని అది వృధా కాలేదు. కర్ణుడు కాంతిమయుడు అగుటకు ఏకలవ్యుడు పునాది వేసినాడు.
3. ఆనాటికే విద్యాభ్యాసము రెండు విధములుగా విభజించబడినది. ఒకటి గురుకుల ఉదయ, దీనినే Formal Education అంటున్నాము. దీనికి ఒక పాఠశాల, గురువు, విద్యాభోధన అవసరము. కౌరవ పాండవులది గురుకుల విద్య. ఒక పద్దతి ప్రకారము నేర్పినది. నేటి భాషలో దీనిని నియత విద్య అనుచున్నారు.
    రెండవది గురురహిత విద్య. ఇది స్వయం విద్య. తన శ్రద్దాసక్తులతో , స్వయం కృషి వలన నేర్చుకోనునది. దీనికి  పాఠశాల లేదు. గురుడు లేడు. విద్యాభోధన లేడు. విద్యాతృష్ణ, తపన, ఆసక్తి ఇక్కడ సొత్తులు. సంకల్పబలమున సాధించలేని కార్యము లేదు. దీనిని  Informal Education అనుచున్నారు. నేటి తెలుగులో దీనికి అనియత విద్య అని పేరు పెట్టినారు.
    ఏకలవ్యుడు అనియత విద్యకు ఆద్యుడుగా కనిపించుచున్నాడు. స్వయంకృషి వలన సాధించినది పరుల వలన వచ్చిన దాని కన్న ఉత్తమము. అందుకే ఏకలవ్యుడు అర్జునుని మించినాడు.
    ఇది ఆనాడు కాదు ఈనాడు కూడ ఉన్నది. ఈ రచయిత ఇందుకు నిదర్శనము. నాకు పాఠశాల లేదు. గురువు లేడు. స్వయంకృషితో విద్యను అర్జించినాను. సాహిత్యమున కృషి సాగించినాను. ఏకలవ్యునకు ఒక బొమ్మ ఉన్నది. నాకు అదియు లేదు. అందుకే నా విద్య దక్కినది.
    నేడు విశ్వవిద్యాలయములందు నియత, అనియత విద్యలున్నవి. గురువులు అనియత విద్య వానికి ఎక్కువ మార్కులు వేయరు. గురువు లేని వాని చదువు గురువు ఉన్నవాని చదువును మించుట గురువు ఒర్వడు. ఏకలవ్యునకు అదే జరిగినది.
4. ఏకలవ్యుని విషయమున కులమున కన్న రాజకీయము ఎక్కువగా పనిచేసినట్లు కనిపించుచున్నది. కర్ణునకు చదువు చెప్పుటకు అభ్యంతరము లేని ద్రోణుడు ఏకలవ్యుని నిరాకరించినాడు. ఏకలవ్యుని ప్రతిభను ద్రోణుడు కనుగొన్నాడు. రాజకుమారులను మించువాడు తన వద్ద చదువరాదు అనుకున్నాడు. అట్లయిన రాజు కినుక వహించును. అందుకు నిరాకరించినాడు.
    ద్రోణునకు ద్రుపదుని ఓడించుట ప్రధమ లక్ష్యము . అందుకు అర్జునుడు లభించినాడు. అర్జునుని మించిన విలుకాడు ఉన్నవాడు ద్రుపద పక్షమున చేరవచ్చును. అది ద్రోణుని లక్ష్యమును చెరచును. ఏకలవ్యుని నిరాయుధని చేయుట ద్రోణుని లక్ష్యము. అందుకు తగినది ద్రోణుడు అడిగినాడు. ఏకలవ్యుడు అంగీకరించినాడు. ఇచ్చినాడు. ఇవ్వకున్న ఎట్టి రాజకీయవు ఎత్తు జరిగి ఉండేడిదో ఊహించవలె.

                                                        అస్త్ర విద్యా ప్రదర్శన
    
    ఒకనాడు ద్రోణుడు ధృతరాష్ట్రుని చూచినాడు. "మహారాజా! రాజకుమారులు అస్త్ర విద్యలు నేర్చినారు. వారి సమర్ధతను పరిశీలించవలసి ఉన్నది." అన్నాడు. ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించినాడు. రంగస్థలము యేర్పరచవలసినాదని విదురునితో చెప్పినాడు.
    విదురుడు రంగస్థలమును ఏర్పరచినాడు. అది శాస్త్ర ప్రకారము కొలతలు కలిగి ఉన్నది. చెట్లు, పొదలు, గుంటలు, దిబ్బలు, రాళ్ళు ఎముకలు, లేకుండ చదును చేయబడినది. దుమ్ము లేకుండ చేయబడినది. అరటి స్తంభములు కట్టినారు. పుష్ప మాలలు వ్రేలాడ చేసినారు.
    రంగస్థలము కనులపండువుగా సిద్దము అయినది.
    ముహూర్తము నిర్ణయమయినది. దృతరాష్ట్రుడు రంగస్థలమునకు వచ్చినాడు. అతని కొఱకు ప్రత్యెక శాల నిర్మితము అయినది. దానికి ముత్యముల దండలు కట్టుబడినవి. మరకత, వజ్ర, వైడూర్య, పద్మరాగ ప్రవాళములు అమర్చబడినవి. రత్నకాంతులు ఇంద్ర ధనుస్సు వలె ప్రకాశించినవి. రంగస్థలము మేరు పర్వతము వలె తేజరిల్లినది.
    దేదీప్యమానంగా రంగస్తలమున ధృతరాష్ట్రుడు ప్రవేశించినాడు. అతని వెంట అనేకమంది వేశ్యలు ప్రవేశించినారు. వారు నానావిధ భూషణములు ధరించి ఉన్నారు. ధృతరాష్ట్రుడు అసీనుడు అయినాడు. అతని పక్కన గాంధారి కూర్చున్నది. గాంధారి పక్కన కుంతి కూర్చున్నది. విదురుడు అక్కడనే కూర్చున్నాడు. రంగస్తలమున జరుగు దానిని ధృతరాష్ట్రునకు వివరించుట అతని పని. అతడు వ్యాఖ్యత.
    బ్రాహ్మణులు ఒక శాలలో ఉన్నారు. వేదవ్యాసుడు వారి ముందున్నాడు. కృపాచార్యుడు , శల్యుడు , శకుని ,భీష్ముడు , సోమదత్తుడు మున్నగు వారు తమ తమ అసనములందు ఉన్నారు. మంత్రులు , సామంతులు, తాలముల వారు , వాద్యముల వారు తమ తమ స్థానము లండున్నారు.
    ద్రోణాచార్యులు మరొక శాలలో అసీనుడు అయినాడు. అతడు తెల్లని వస్త్రములు ధరించినాడు. తెల్లని ఆభరణములు , పుష్పమాలలు , సుగంధము, యజ్ఞోపవీతము తెల్లని వెంట్రుకలతో తేజరిల్లుచున్నాడు. అతని పక్కన అశ్వత్ధామ ఉన్నాడు. అతని ప్రక్కన రాజకుమారులు నిలిచినారు.
    అస్త్రవిద్య చూడవచ్చిన క్షత్రియ, వైశ్య, శూద్రుల కలకల ధ్వనులు అధికముగా ఉన్నవి. భేరీలు మ్రోగినవి. వేద మంత్రములు ఉచ్చరించబడినవి. పుణ్యాహవాచానము జరిగినది. విద్యా ప్రదర్శన ప్రారంభమయినది. వివిధ అస్త్రములు గల రాజ కుమారులు లేచినారు. ద్రోణునకు నమస్కరించినారు. రంగమున ప్రవేశించినారు. విద్యాప్రదర్శన చేసినారు.
    దుర్యోధనుడు భీమునితో తలపదినాడు. గదాయుద్ధము ప్రారంభము అయినది. వారిద్దరు మదించిన ఏనుగుల వలె కనిపించినారు. వారు గదలతో గుద్దుకున్నారు. వారు సవ్యముగ తిరిగినారు. అపసవ్యముగ తిరిగినారు. గుండ్రముగా తిరిగినారు. వారి పదఘట్టనలకు భూమి కదలినది. ఆకాశము వణకినది. వారి విద్యను గురించి విదురుడు ధృతరాష్ట్రునకు వివరించినాడు.
    భీమ, దుర్యోధనుల యుద్దము అపూర్వముగ ఉన్నది. వారి విద్యను చూచిన జనులు ఉత్సాహపదినారు. కేకలు వేసినారు. అరచినారు. బొబ్బలు పెట్టినారు. ఆ కల్లోలమునకు రంగస్థలము భంగమగునట్లు కనిపించినది. అప్పుడు ద్రోణుడు లేచినాడు. వద్యములను నిలుపు చేయించినాడు. అందరిని శాంతింప చేసినాడు. భీమ, దుర్యోధనుల యుద్దము నిలుపు చేయించినాడు . అన్నాడు :-
    "వ్యాస భీష్మాది సభ్యులారా! అర్జునుడు నాకు ప్రియ శిష్యుడు. అతని ధనుర్విద్యా ప్రదర్శన చూచి ఆనందించుడు."
    అర్జునుడు ద్రోణుని మాటలు విన్నాడు. లేచినాడు. వందనము చేసినాడు. రంగ స్థలమునకు వచ్చినాడు. అతడు నల్లకలువవలె ప్రకాశించినాడు. బంగారు కవచము ధరించినాడు. భుజమునందు గొప్ప ధనువు ధరించినాడు. అర్జునుడు ఇంద్రధనుస్సు చే ప్రకాశించు నీల మేఘము వలె ఉన్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.