ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల సహిరద్దులు మార్చడంతో పాటు జిల్లాల సంఖ్య పెంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం మేరకు ప్రస్తుతం ఉన్న జిల్లాలలోని పలు నియోజకవర్గాలు వేరే జిల్లాలకువెళ్లనున్నాయి. గత వైసీపీ హయాంలో పార్లమెంట్ నియోజకవర్గాల్ని జిల్లాలుగా మారుస్తూ చేసిన మార్పును ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సవరించి, సరిదిద్దడానికి నిర్ణయించింది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 32కు పెరగనుంది.
పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట జిల్లా కేంద్రాలు కాబోతున్నట్లు సమాచారం.
పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, టెక్కలి, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్ కోట, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇక పోతే విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తోంది.
అలాగే అరకు జిల్లాలో అరకు, పాడేరు, మాడుగుల నియోజకవర్గాలు, అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని నియోజకవర్గాలు ఉంటాయి. ఇక కాకినాడ జిల్లాలోకి ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, రూరల్, రామచంద్రాపురం నియోజకవర్గాలూ, రాజమండ్రి జిల్లాలోకి అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. అమలాపురం జిల్లాలో రాజోలు, అమలాపురం, ముమ్మడివరం, పి.గన్నవరం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాలు ఉంటాయి. నరసాపురం జిల్లాలో తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం.. అలాగే ఏలూరు జిల్లాలో గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాలు ఉంటాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.
మచిలీపట్నం జిల్లాలో కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలు, విజయవాడ జిల్లాలో తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం రానున్నాయి. అమరావతి జిల్లా పరిధిలోకి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ రానున్నాయి. గుంటూరు జిల్లా పరిధి లోకి తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, వెస్ట్, పొన్నూరు నియోజకవర్గాలు, బాపట్ల జిల్లా పరిధిలో రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తోంది. అదే విధంగా నరసరావు పేట నియోజకవర్గ పరిధిలో చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ, మార్కాపురం పరిధిలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఇక ఒంగోలు జిల్లాలోకి ఒంగోలు పరిధి లోకి అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు సీట్లు వస్తాయని విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే నెల్లూరు జిల్లా పరిధిలో కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు, గూడురు పరిధిలోకి సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు ఉంటాయి.
ఇక చిత్తూరు జిల్లా పరిధిలో పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం వస్తాయి. అలాగే మదనపల్లె పరిధిలో పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, హిందూపురం పరిధిలోకి కదిరి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర, హిందూపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లాలో రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాలు, ఆదోని జిల్లా పరిధిలో పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కర్నూలు జిల్లా పరిధిలోకి నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు ఉంటాయని సమాచారం. నంద్యాల జిల్లా పరిధిలో శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాలూ, కడప జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప ఉంటాయనీ, రాజంపేట జిల్లా పరిధిలో బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయనీ విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.