LATEST NEWS
  తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక సాధారణ సినిమా ఫెయిల్ అయితే కేవలం ఆ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్లకు మాత్రమే నష్టం వస్తుందని, కానీ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న 'రేవంత్ రెడ్డి' అనే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం వల్ల ఏకంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఘోరంగా నష్టపోతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ ఆయన సినిమా పరిభాషలో చేసిన ఈ పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. ఈ 'రేవంత్ రెడ్డి' అనే సినిమాను చూస్తున్న ప్రేక్షకులు ఇప్పటికే తీవ్ర అసహనానికి గురవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కాగానే థియేటర్లలో ఉన్న జనాలు తలలు పట్టుకుంటున్నారని, 'ఎప్పుడు పోతడు రా ఈ రేవంత్ రెడ్డి' అంటూ అందరూ తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న అభివృద్ధి వేగం పూర్తిగా మందగించిందని, కేసీఆర్ హయాంలో రైతాంగానికి అండగా నిలిచిన రైతుబంధు వంటి పథకాలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అన్నపూర్ణలా విలసిల్లిన తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ తన పాలనా వైఫల్యాలతో అనాథ తెలంగాణగా మారుస్తోందని మండిపడ్డారు. పాలన చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కోస్గి లాంటి ప్రాంతాల్లో కూడా శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని, ఆలయాలపైకి బుల్డోజర్లు వెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టు సాధనలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 13 వేల 400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీతో, 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితికి తీసుకునేలా అంతర్జాతీయ సంస్థలను ఒప్పించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఈ లోన్ బదిలీ ప్రక్రియ కోసం డాక్యుమెంట్ ఫీజు కింద రూ. 48 కోట్లు, ఈక్విటీ కింద రూ. 1400 కోట్లు కూడా అప్పట్లోనే చెల్లించామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్ని నిధులు సమకూర్చి, ప్రణాళికలు సిద్ధం చేసినా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి దాదాపు 71 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 71 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా రాష్ట్రానికి ఒక్క పైసా అదనపు ప్రయోజనం తీసుకురాలేకపోయారని విమర్శించారు. కేవలం కిషన్ రెడ్డి వంటి నేతలతో కలిసి బీఆర్ఎస్ పై బురదజల్లడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, ఈ రాజకీయ నాటకాల వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఒక క్రిమినల్ కులం ఏంటి అంటూ  నేటి యువతను ప్రశ్నించిన తీరు   ఆలోచింపజేస్తోంది. గాదె సాయికృష్ణ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరగాళ్లను కుల కోణంలో చూడటం వల్లే వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదని కోర్టును ఆశ్రయించిందంటే, అది ఆ తల్లి ప్రాథమిక హక్కు అన్న ఆయన.. తన బిడ్డ బతికాడో లేదో తెలియని ఆవేదనలో ఉన్న ఆ తల్లి పోరాటంలో ఎక్కడా కులం లేదని, కేవలం న్యాయ పోరాటం మాత్రమే ఉందని గుర్తుచేశారు. రాజ్యాంగం గానీ, దేశ క్రిమినల్ చట్టాలు గానీ నేరస్తుడి కులాన్ని, మతాన్ని లేదా ప్రాంతాన్ని చూసి శిక్షలు ఖరారు చేయవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చట్టం దృష్టిలో కేవలం క్రైమ్ జరిగిందా లేదా, ఎవరు ఎవరికి అన్యాయం చేశారు అనే అంశాలు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో నేరస్తులను కూడా వారి కులాలను బట్టి వెనకేసుకొచ్చే సంస్కృతి పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా యువత ఈ కులాల పరిధి నుంచి బయటకు రావాలని, క్రిమినల్స్ ను క్రిమినల్స్ లాగే చూడాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పు చేసేవాడికి, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వాడికి   కులం ఎందుకు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాడి గుర్తింపు కేవలం ఒక క్రిమినల్ మాత్రమేనని, అలాంటి నీచుడిని ఏ కులం వారైనా వెనకేసుకొస్తే అది ఆ వ్యక్తి  దౌర్భాగ్య  స్వభావాన్ని సూచిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని హెచ్చరించారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం అంటూ క్రిమినల్ గ్యాంగులు ఈరోజు తలపైకి ఎక్కి ఆడుతున్నాయంటే, ఆ బలం వాళ్ళది కాదు, సమాజంగా మనందరి కలెక్టివ్ బలహీనత అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పౌరులను సాధికారత వైపు నడిపించడమే తన ముఖ్య ఉద్దేశమని, అందుకే   3 నెలల క్రితమే ఎస్పీ గారితో మాట్లాడి సివిల్ సిటిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం వస్తే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తమ పరిధిలో ఉంటారని, మితిమీరి ప్రవర్తించరని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కులాలకు ఓటింగ్ పాటర్న్ ఉండొచ్చేమో కానీ, పౌర హక్కులకు, ప్రాథమిక హక్కులకు ఎలాంటి కులాల ఓటింగ్ పాటర్న్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా నినదించినప్పుడే నిజమైన మార్పు వస్తుందని, పాలకులు కూడా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టి వెనకేసుకొచ్చే ఏ రాజకీయ నాయకుడినైనా సరే ఆమడదూరంలో పెట్టకపోతే, అది సమాజ భవిష్యత్తుకే తీవ్ర భంగం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ కలెక్టర్ నరహరికి చెందిన బ్యాంకు లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో బంగారం, నగదును గుర్తించారు. లాకర్లలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని చూసి అధికా రులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది. అలాగే, రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం కావడంతో నరహరి అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువనుఅంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఏసీబీ చరిత్రలో ఒకే అవినీతి కేసులో రూ.3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు. నరహరికి సంబంధించిన స్థిర, చరా స్తులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వివరాలను ఏసీబీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న తాజా నిరసనలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఈ ఉద్యమం తీరు,  నిరసనలు తెలిపే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై డోలేంద్ర ప్రసాద్‌తో సీనియర్ జర్నలిస్ట్ కె. రవిశంకర్  వాస్తవ వేదికలో విస్తృత చర్చ జరిపారు.  ఆ సందర్భంగా డోలేంద్ర ప్రసాద్..  ఈ ఉద్యమంలో పాల్గొన్న యువతకు కనీస రాజకీయ పరిణతి  లోపించిందన్నారు. జంతర్ మంతర్ వంటి చారిత్రాత్మక ధర్నా చౌక్‌లలో నిరసనలు తెలిపేటప్పుడు..  కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, స్పష్టమైన ఉపన్యాసాల ద్వారా సమస్య తీవ్రతను వివరించాలనీ, కానీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు  మైకులు ఉపయోగించి తమ డిమాండ్లను బలంగా వినిపించాలనే కనీస అవగాహన కూడా    లేదని చెప్పారు.  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్..  అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఇలాంటి ధర్నాలు చేపడితే భారీగా మెన్ అండ్ మిషనరీని తరలిస్తుందని..  కానీ ఇది నిరుద్యోగులను కలుపుకోకుండా కేవలం స్టూడెంట్స్ కే పరిమితం కావడం వల్ల బలపడటం లేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రామదేవ్ బాబా నిరసనలకు దిగినప్పుడు ప్రణబ్ ముఖర్జీ వంటి అగ్రనేతలు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి రాయబారాలు నడిపిన దాఖలాలు ఉన్నాయని డోలేంద్ర ప్రసాద్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో వచ్చే ఇలాంటి పబ్లిక్ ఇష్యూలను హ్యాండిల్ చేయడంలో నాటి ప్రభుత్వాలకు భయం ఉండేదనీ..  కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీన్ని  వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ నిప్పును చల్లార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజకీయ నాయకుల్లో ఎప్పుడూ ఒక రకమైన ప్రజా ఉద్యమాల భయం ఉంటుందని, అయితే ఈ నిరసనలకు సరైన నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ అని తేల్చిచెప్పారు. ప్రజల్లో కోరిక ఉన్నప్పటికీ, సరైన లీడర్‌షిప్ లేని కారణంగానే ఉద్యమం పాలపొంగులా వచ్చి చల్లారిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తరుణంలో..  క్షేత్రస్థాయి ఉద్యమాలను సమర్థవంతంగా నడిపించగల నాయకత్వ బలం యువతకు ఎంతైనా అవసరమని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.
 తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ కేసు తీవ్ర సంచలనంగా మారింది. కస్టడీలో ఉన్న యువకుడు సాయికృష్ణ అదృశ్యం కావడం లేదా మరణించి ఉంటాడనే అనుమానాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, ఈ కేసులో  వైసీపీ చేస్తున్న విమర్శల వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం,  హిడెన్ అజెండా ఉందన్నారు   ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, తెలుగుదేశం కూటమి అధికార ప్రతినిథి అప్పసాని రాజేష్.  తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.   కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 23 ఏళ్ల సాయికృష్ణ అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని ఆచూకీ లభించకుండా పోయింది. ఈ ఉదంతంపై కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే విఆర్  కు పంపి, ఆపై సస్పెండ్ చేసి, హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే..  జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని  విశ్లేషించారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోనే  సిట్ విచారణ అత్యంత వేగంగా సాగుతోందని  గుర్తు చేశారు. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి నోటీసులు అందాయని, కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు అరెస్టు చేశారనీ.. త్వరలోనే ఈ విచారణ తీగ లాగితే డొంకంతా కదిలినట్లు..  జగన్మోహన్ రెడ్డి ఇటికి చేరే అవకాశం ఉందని అన్నారు.   ఈ మద్యం కుంభకోణం విచారణను పక్కదారి పట్టించడానికి, సిట్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న సీపీ రాజశేఖర్ బాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే వైసీపీ  ఈ కేసును  రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందని అప్పసాని  రాజేష్ అన్నారు. గతంలో  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసును, డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ ఉదంతాలను ప్రస్తావిస్తూ.. ఆనాడు పౌర హక్కుల ఉల్లంఘనలపై స్పందించని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు హఠాత్తుగా మానవ హక్కుల నేతగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉందనీ, జూన్ 29వ తేదీ నాటికి పోలీసులు కోర్టుకు సమర్పించే నివేదికతో అసలు నిజాలు అధికారికంగా బయటకు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ కేసులో ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదనీ..  తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులేనని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతిని గుర్తు చేశారు.  సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమండ్రి ఎస్పీ నేతృత్వంలో నిష్పాక్షిక విచారణ కమిషన్ కూడా ఏర్పాటైందనీ..  బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఒక యువకుడి అదృశ్యం కేసును అడ్డుపెట్టుకుని వైసీపీ ఆడుతున్న పొలిటికల్  డ్రామాను ప్రజలు గమనిస్తున్నారనీ, విచారణ పూర్తయితే అసలు నిజాలు నిగ్గు తేలుతాయని అప్పసాని చెప్పారు. 
ALSO ON TELUGUONE N E W S
  మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కి ఎంటైర్ తన కెరీర్ లోనే సూపర్ హిట్ అందించి మరో మారు తన మార్క్ ని చాటి చెప్పిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తో తన హవాని కంటిన్యూ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. VenkyAnil5 NKRAR2 అనే వర్కింగ్ టైటిల్స్‌తో పిలుస్తున్న ఈ మూవీ రెండు రోజుల క్రితం స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్ గా మేకర్స్  ప్రమోషనల్ వీడియోని  సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. "కత్తి లాంటి ఐడియా" అంటూ సాగే ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతూ, కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది అని చెప్పేందుకు కూడా అనిల్ ఓ వెరైటీ వీడియోతో మన ముందుకు వచ్చాడు. హీరో, హీరోయిన్లు, జివి ప్రకాశ్ మాట్లాడుతూ ఉండగా చేతిలో పెద్ద కత్తి పట్టుకొని. తల పాగ పెట్టుకొని అనిల్ అక్కడకు వస్తాడు. తనకు ‘కాన్సెప్ట్ కింగ్‌’ అనే బిరుదు ఇచ్చారని చెబుతాడు. ఇంతలో వెంకటేశ్ నేను ఓ ఐడియా ఇస్తానని కత్తి తీసుకొని అనిల్ వేలిని కట్ చేసి వీర తిలకం దిద్దుతారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్‌ కూడా అదే పని చేస్తారు. అనంతరం వీర తిలకం అమ్మాయిలు దిద్దాలిగా అంటూ హీరోయిన్లు కీర్తి సురేశ్, కృతి శెట్టిలు అనిల్ వేలిని కట్ చేసి వీర తిలకం పెడతారు. ఆ తర్వాత అనిల్ ‘ఎంత రాయలసీయ బ్యాక్‌డ్రాప్ అయితే మాత్రం ఇంత రక్తపాతం అవసరమా’ అని చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. చివర్లో సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించడంతో పాటు  2027 సంక్రాంతికి థియేటర్స్ లో కలుద్దామని టీం చెప్పింది. also read: Samantha: సమంత అసలు రూపం బయటపెట్టిన ఆడపడుచు.. తెల్లవారుజామున 3 గంటలకి ఏం చేసిందంటే  
  సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం తో థియేటర్స్ లో సందడి చేశున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ టైంలో సమంత భర్త రాజ్ నిడిమోరు సోదరి 'శీతల్' సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన  భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  ఆమె తన పోస్ట్ లో నేను ఇంతవరకు సమంత నటించిన ఏ ఒక్క సినిమాని  కూడా చూడలేదు. కానీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సమంత అసలు రూపం ఎలాంటిదో తాను స్వయంగా చూశాను. పెళ్లయిన కొన్ని రోజులకే హైదరాబాద్‌లోని సమంత ఇంట్లో నేను బస చేశాను. ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాకు అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం చేసింది. శరీరం విపరీతంగా వణికిపోవడం, వాంతులు అవ్వడం, తల పగిలిపోయేలా నొస్తూ ఉండటంతో, కనీసం మంచం దిగి మందులు లేదా దుప్పట్లు వెతుక్కునే ఓపిక కూడా లేకపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టడానికి మొదట కాస్త సంకోచించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో తప్పక సాయం కావాలని సందేశం పంపింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా సమంతే మొదటి వ్యక్తిగా స్పందించింది. ఇంట్లో మరెవరినీ నిద్ర లేపకుండా, కనీసం తన సోదరుడు రాజ్‌కు కూడా చెప్పకుండా, అర్ధరాత్రి అని కూడా చూడకుండా సమంతే స్వయంగా శీతల్ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో అదనపు దుప్పట్లు దొరకకపోవడంతో, సమంత ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెద్దపెద్ద టవళ్లను తీసుకువచ్చి శీతల్‌కు చలి పెట్టకుండా చుట్టింది. అవసరమైన మందులు, తాగునీరు అందించి దగ్గరుండి సపర్యలు చేసింది. శీతల్‌ను మరింతగా కదిలించిన విషయం ఏమిటంటే, ఆ రాత్రంతా సమంత అస్సలు నిద్రపోలేదు. పెళ్లి హడావుడి ఇప్పుడిప్పుడే ముగియడం, చుట్టూ ఎన్నో పనులు ఉన్నప్పటికీ, కేవలం కొన్ని గంటల్లోనే సమంత ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయినప్పటికీ, తన ఆరోగ్యం కంటే అత్తగారింటి ఆడపడుచు ఆరోగ్యమే ముఖ్యమని భావించి సామ్ రాత్రంతా మేల్కొనే ఉంది. మరుసటి రోజు ఉదయం శీతల్ కోలుకుని షూటింగ్ సెట్‌కు వెళ్లి చూసేసరికి, సమంత చీరకట్టులో ఎంతో అలవోకగా సొంతంగా స్టంట్స్ చేస్తూ కనిపించింది. రాత్రంతా నిద్రలేదనే అలసట ఎక్కడా మొహంపై కనిపించకుండా, కెమెరా ముందుకు రాగానే ఎంతో ఏకాగ్రతతో, చిరునవ్వుతో నటిస్తున్న సమంతని చూసి శీతల్ ఆశ్చర్యపోయాను. Also read:  Allu arjun: నా దేవుడు ఆయనే.. అల్లు అర్జున్ రిలీజ్ చేసిన వీడియో వైరల్ షూటింగ్ విరామంలో సమంత శీతల్‌ను చూడగానే, సినిమా గురించి కాకుండా 'ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది?' అని ఎంతో ఆరాటంగా అడిగింది. ఒక మనిషి అలసిపోయినప్పుడు కూడా ఇతరులపై చూపే ఈ కరుణే ఆమె అసలైన శక్తని శీతల్ కొనియాడారు. వెండితెరపై 'మా ఇంటి బంగారం' సినిమా చూడటానికి ముందే, తాను నిజమైన 'బంగారం' లాంటి మనసున్న సమంతను కలిశానని శీతల్ ఎమోషనల్ అయ్యారు.  
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తన అప్ కమింగ్ మూవీ 'రాకా'(Raaka)తో అభిమానులకి, ప్రేక్షకులకి మరో సారి ఐ ఫీస్ట్ అనుభూతిని కలిగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం రాకా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అల్లు అర్జున్ త్రిబుల్ రోల్స్ లో కనిపిస్తున్నాడనే టాక్ కూడా ఉంది.  ఈ రోజు  ఫాదర్స్ డే.  దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి, ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌పై ఉన్న ప్రేమాభిమానాలని వ్యక్తం చేస్తూ అల్లు అరవింద్‌తో గడిపిన కొన్ని అపురూపమైన, అరుదైన క్షణాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోని షేర్ చెయ్యడంతో పాటు ఒక అద్భుతమైన ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కి   జోడించిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. "నాకు మా నాన్నే దేవుడు. నేను కంటితో చూడగలిగే, చెవులతో వినగలిగే, నోటితో మాట్లాడగలిగే మరియు చేతితో తాకగలిగే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు అన్నీ ప్రసాదించింది ఆయనే. నా ప్రియమైన నాన్నకి ,ప్రపంచంలోని ప్రతి ఒక్క స్వీట్ నాన్నకి  హ్యాపీ ఫాదర్స్ డే" అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చిన భావోద్వేగపూరితమైన మాటలు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని కళ్లకు కట్టాయి. Also read: మ్యాజిక్ రిపీట్ అవుతుందా!.. మన శంకర వరప్రసాద్ గారుని దాటుతాడా! ఈ భావోద్వేగ పోస్ట్‌లో మరో విశేషం ఏమిటంటే, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి అద్భుతమైన స్వరంతో కూడిన ప్రవచన వీడియోని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉపయోగించడం. తండ్రి గొప్పతనాన్ని వివరించే చాగంటి గారి ప్రవచనం ఈ వీడియోకు మరింత గాంభీర్యాన్ని, ఎమోషనల్ టచ్‌ తెచ్చిపెట్టింది.   
మొన్న 18 వ తారీఖున విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ ల మూవీ అధికారకంగా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో అంచనాలు స్థాయి ఒక రేంజ్ లో ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ తో 300 కోట్ల క్లబ్ లోకి చేరిన అనిల్ రావిపూడి ఇప్పుడు వెంకీ, కళ్యాణ్ రామ్ తో కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటాడా అనే చర్చ అభిమానులు, సినీ సర్కిల్స్ లో జరుగుతుంది. మరి మూవీ విశేషాలేంటో చూద్దాం. ఈ  చిత్రం కోసం అనిల్ రావిపూడి ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేశారు. వెంకటేశ్‌తో అనిల్ రావిపూడికి ఇది ఐదో సినిమా (F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు తర్వాత). అలాగే తొలి చిత్రం పటాస్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కల్యాణ్ రామ్‌తో చేస్తున్న రెండో సినిమా. దీంతో తన మార్క్  క్లీన్ హ్యూమర్, బలమైన ఎమోషన్స్, మరియు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అనిల్ రావిపూడి కథని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.   కాస్టింగ్ పరంగా కూడా మేకర్స్ చాలా కేర్ తీసుకున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కథానాయికగా నటిస్తుండగా, యంగ్ అండ్ బ్యూటిఫుల్ కృతి శెట్టి కల్యాణ్ రామ్ జోడీగా నటిస్తోంది. ఈ విలక్షణమైన కాంబినేషన్ వెండితెరపై సరికొత్త కలర్‌ఫుల్ వైబ్‌ను తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు నేషనల్ అవార్డ్ గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా అనిల్ రావిపూడి, జి.వి. ప్రకాష్ కలిసి చేసిన ఒక ఫన్నీ అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. Also read: Prakash Raj: ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. సినీ వర్గాల్లో సంచలనం షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తుండగా, జీ స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ప్రేక్షకులకు అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ అధికారికంగా డేట్ లాక్ చేశారు. అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసివచ్చే సీజన్ కావడంతో, ఈ మల్టీస్టారర్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.     
  ఎనీ క్యారక్టర్ తీసుకోండి సదరు క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి చెడుగుడు ఆడుకునే  లెజండ్రీ యాక్టర్ ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ నుంచి వచ్చిన గత చిత్రాలని ఓజి, డెకాయిట్ లే ఒక ఉదాహరణ. అలాంటి  ప్రకాష్ రాజ్‌చట్టపరమైన నిబంధనలని ఉల్లంఘించాడనే ఆరోపణలతో  బెంగళూరు కోర్టు  నాన్-   బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఈ పరిణామం ఒక్కసారిగా సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అసలు ప్రకాష్ రాజ్ లాంటి ఒక సీనియర్ నటుడిపై బెయిల్ రాని విధంగా అరెస్ట్ వారెంట్ రావడానికి గల కారణాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వివాదం అంతా ఓటర్ ఐడీ కార్డుల చుట్టూ తిరుగుతోంది. ప్రకాష్ రాజ్ చట్టవిరుద్ధంగా ఒకే పేరుతో నాలుగు వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులను కలిగి ఉన్నారని బెంగళూరుకు చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఒక భారతీయ పౌరుడిగా కేవలం ఒకే చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. కానీ, ప్రకాష్ రాజ్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు సహా 4 వేర్వేరు ప్రాంతాలలో ఓటర్ గుర్తింపు కార్డులు పొందారనేది ప్రధాన ఆరోపణ. దీనిని తీవ్రమైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తూ బెంగళూరులోని 48వ ACJM కోర్టు (అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు) ఈ కేసును విచారణని   స్వీకరించింది. Also read: ఫ్యామిలీ ఆఫర్ ప్రకటించిన సింగ్ గీతం టీం.. టికెట్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా! చట్టం ముందు అందరూ సమానులే అన్నట్టుగా కోర్టు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు ప్రకాష్ రాజ్‌కు సమన్లు జారీ చేసింది. స్వయంగా విచారణకు హాజరై తన వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ, బిజీ షెడ్యూల్స్ వల్లో లేదా ఇతర కారణాల వల్లో ఆయన కోర్టు విచారణకు హాజరు కాలేదు. కోర్టు ఆదేశాలని  ఉల్లంఘించడంతో, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు  వారెంట్లు జారీ అయ్యాయి. అయినా కూడా నటుడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, న్యాయస్థానం ఈ విషయాన్ని మరింత తీవ్రంగా పరిగణించింది. తాజాగా మూడోసారి కూడా ఆయనపై కఠినమైన నాన్  బెయిల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేస్తూ, తదుపరి విచారణకు ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.    
  విభిన్న కథ, కథనంతో కూడిన చిత్రాల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivasa Rao)తన మార్క్ మాయాజాలంతో 'సింగ్ గీతం' (sing geetham)అనే మూవీతో థియేటర్స్ లో తిష్ట వేసిన విషయం తెలిసిందే. కల్కి దర్శకుడు  నాగ్ అశ్విన్ నిర్మాణ భాగస్వామ్యంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో  తెరకెక్కగా ప్రేక్షకులకి  సరికొత్త అనుభూతికి గురి చేస్తుంది థియేటర్లలో లభిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్, పాజిటివ్ టాక్ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రేక్షకులకి  ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ మ్యూజికల్ విజువల్ వండర్‌ని  థియేటర్లలో చూసి ఆనందించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలని  భారీగా తగ్గించారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో  200 గా ఉన్న సినిమా టికెట్ ధరని 175 కి తగ్గిస్తూ  అధికారిక ప్రకటన విడుదల చేశారు.  Also read: Mouneesha chowdary: మూవీ ఆఫర్ చేసి బాడీ కొలతలు అడిగాడు.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ భాగోతం   ఈ క్రేజీ ప్రాజెకి  టాలీవుడ్ నుండి కూడా ఊహించని స్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా గ్లోబల్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్  తన పూర్తి సపోర్ట్ అందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేశారు. ప్రభాస్ ఇచ్చిన ఈ పాజిటివ్ ఎండార్స్‌మెంట్ మరియు తాజాగా ప్రకటించిన టికెట్ ధరల తగ్గింపు ఆఫర్ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని  థియేటర్ల వైపు పరుగులు పెట్టించేలా చేస్తోంది. అయాన్ ఖాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి కీ రోల్స్ పోషించగా దేవిశ్రీప్రసాద్ దర్శకుడు.  
  సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో అమ్మాయిలను లోబరుచుకునేందుకు, కొందరు ప్రయత్నిస్తారనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. ఇండస్ట్రీలో ఉండే ఈ చీకటి కోణాన్ని, కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాలను ఇప్పటికే పలువురు యంగ్ హీరోయిన్లు, నటీమణులు ధైర్యంగా బయటపెట్టారు. ఇప్పుడు ఇదే బాటలో మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మౌనీషా చౌదరి(Mouneesha chowdary) టాలీవుడ్‌లో తనకు ఎదురైన ఒక షాకింగ్ అనుభవాన్ని పంచుకుని సంచలనం సృష్టించింది. అమెరికాలో నివసిస్తూ మోడలింగ్‌ రంగంలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి, రీసెంట్‌గా ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన టాక్ షోలో ఆమె పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత విషయాలతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా హోస్ట్ ఆమెను ప్రశ్నిస్తూ, "మీకు తెలుగులో సినిమా ఆఫర్స్ వచ్చాయా?" అని అడిగారు. దానికి మౌనీషా సమాధానమిస్తూ ఆఫర్లు వచ్చిన మాట నిజమే. కానీ కొన్ని చేదు కారణాల వల్ల తిరస్కరించాను. ఒక దర్శకుడు సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పి, ఆడిషన్స్ పేరుతో శరీర కొలతలు అడిగాడు. అసలు ఒక నటిగా ప్రతిభని నిరూపించుకోవడానికి నటన వచ్చా రాదా అని అడగాలి కానీ, బాడీ  కొలతలు అడగడం ఏంటి? నటన రాకపోతే నేరుగా ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోమనాలి తప్ప ఇలాంటి డిమాండ్లు చేయడం కరెక్ట్ కాదు. ఆ చేదు అనుభవం మిగిల్చిన భయంతోనే సినిమాలకి  దూరంగా ఉన్నాను. Also read: Toxic: టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారకంగా ప్రకటించిన యష్  నన్ను కొలతలు అడిగిన వ్యక్తి, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక పెద్ద స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడని పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్‌సేన్‌ కొత్త సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మౌనీషాను సంప్రదించారట. కానీ పాత భయాల వల్లే తాను ఆ క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా నో చెప్పానని మౌనీషా చౌదరి స్పష్టం చేసింది.    
  ఇప్పుడు యష్(Yash)అభిమానులందరు 'ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే అనే సాంగ్ పాడుకుంటూ మస్త్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే  'టాక్సిక్'(Toxic)విడుదలపై వాళ్ళల్లో ఉన్న సస్పెన్స్, ఉత్కంఠత కి తెరపడింది. గత కొన్ని నెలలుగా వరుస వాయిదాలతో అభిమానులను తీవ్ర నిరీక్షణకు గురిచేసిన ఈ పాన్-ఇండియా చిత్రం, ఇప్పుడు సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసుకుంది. ఫాదర్స్ డే సందర్భంగా ఈ రోజు  యష్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా 'నీ తండ్రిని గౌరవించు.. టాక్సిక్ ఆగస్టు 26, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది" అని  ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందంతో ఉన్నారు. ఈ సరికొత్త పోస్టర్‌లో యష్ రాయ, టికెట్ అనే విభిన్నమైన లుక్స్‌లో తండ్రీకొడుకులుగా రెండు పవర్‌ఫుల్ రోల్స్ లో కనిపించి కనువిందు చేశారు. మొదట మార్చి 19న విడుదల చేసి రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' చిత్రంతో పోటీ పడేలా ప్లాన్ చేశారు. అయితే, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య తలెత్తిన అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధ వాతావరణం కారణంగా ఓవర్సీస్ పంపిణీ దెబ్బతినే అవకాశం ఉండటంతో మేకర్స్ వెనక్కి తగ్గారు. జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా కంటెంట్‌ను సినిమాకాన్ ఈవెంట్‌లో అంతర్జాతీయ బయ్యర్లకి  ప్రదర్శించినప్పుడు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి, దీనిని మరింత భారీ స్థాయిలో అంతర్జాతీయంగా విడుదల చేయాలని  భావించారు. ఇందుకోసం డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడానికి మరింత సమయం పడుతుండటంతో మేకప్స్ జూన్ విడుదలని  వాయిదా వేయాల్సి వచ్చింది. Also read: Prabhas: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. హైప్ తో పోతే ఎవరిదీ బాధ్యత ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఇప్పుడు 2026 ఆగస్టు 26 న  ఫైనల్ రిలీజ్ డేట్‌గా లాక్ చేశారు. ఈ సరికొత్త బుధవారం విడుదల తేదీ సినిమాకి  భారీ ప్లస్ కానుంది. ఎందుకంటే ఆ సమయంలో వరలక్ష్మి వ్రతం, ఓనం, ఈద్ మరియు రక్షాబంధన్ వంటి వరుస పండుగల సెలవులు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. 'కేజీఎఫ్ 2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 4 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యష్ చేస్తున్న చిత్రం కావడంతో  అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ఈ భారీ యాక్షన్ ఫాంటసీ డ్రామాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, యష్ కూడా కథా రచనలో భాగస్వామిగా ఉండటంతో పాటు ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణతో కలిసి యష్ స్వయంగా నిర్మించాడు. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కీ రోల్స్.  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)కట్ అవుట్ కి ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఏ హీరో కూడా చేయని విధంగా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సదరు చిత్రాలన్నీ సెట్స్ పైనే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకరి సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న 'స్పిరిట్' ఒకటి. ఈ మూవీపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేసిన 'యానిమల్' బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ మూవీ  అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ హై-వోల్టేజ్ క్రైమ్ డ్రామా షూటింగ్ తెలంగాణలో అత్యంత వేగంగా, నాన్‌స్టాప్‌గా దూసుకుపోతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం మేకర్స్  దాదాపు రెండు నెలల పాటు సాగే ఒక పవర్‌ఫుల్ లాంగ్ షెడ్యూల్‌ని  ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ షెడ్యూల్ కోసం చిత్రబృందం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుని  వేదికగా ఎంచుకుంది. ఈ రోజు జైలు పరిసరాల్లో ప్రభాస్‌పై కొన్ని కీలకమైన, అత్యంత ఇంటెన్స్ సీన్లని  చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్  పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా గ్ ప్రభాస్ ఈ షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. ఇప్పటికే కొంపల్లి, అజీజ్‌నగర్, కోటి ఉమెన్స్ కాలేజీతో పాటు బాలానగర్‌లోని ప్రముఖ 40 ఏళ్ల నాటి ఐకానిక్ సింగిల్ స్క్రీన్ 'విమల్ థియేటర్'లో కీలక షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ వస్తున్నారనే విషయం లీక్ అవ్వడంతో వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. క్రౌడ్ కంట్రోల్ కోసం భారీ ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు స్థానిక పోలీసులను కూడా రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇప్పుడు చంచల్‌గూడ జైలు వద్ద కూడా ప్రభాస్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు మరియు ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టారు. షూటింగ్ లొకేషన్ నుండి ఒక క్రేజీ షాడో పిక్ కూడా లీకై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. Also read: Rhea kapoor: అనిల్ కపూర్ కుమార్తె డైమండ్ ఇయర్ రింగ్స్ చోరీ.. చేసింది ఎవరో తెలిస్తే షాక్ గ్యారంటీ  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన 'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా చేస్తుండగా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ పవర్‌ఫుల్ విలన్ రోల్ లో చేస్తున్నాడు.హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ని అందిస్తుండగా  టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2027 మార్చి 5వ రిలీజ్ డేట్ .    
రియా కపూర్.. బాలీవుడ్ సీనియర్ అండ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తె.. ప్రముఖ ఫిల్మ్ మేకర్, ఫ్యాషన్ స్టైలిస్ట్  అయిన  రియా కపూర్ టీమ్‌లో జరిగిన ఒక భారీ చోరీ ఉదంతం ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ కోసం రియా కపూర్ ముంబైలోని ప్రముఖ జ్యువెలర్స్ నుండి  1.35 కోట్ల విలువైన వజ్రాల మరియు పచ్చల (ఎమరాల్డ్) బంగారు చెవి జుమ్మీలు అద్దెకి తీసుకుంది. విమాన ప్రయాణంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్ నుండి   నగలు మాయమవ్వడం బాలీవుడ్ వర్గాల్లో పెను షాక్‌కి  గురిచేసింది.  ఈవెంట్‌లో పాల్గొనేందుకు రియా కపూర్ తన వ్యక్తిగత స్టాఫ్, స్టైలింగ్ టీమ్‌తో కలిసి పయనమయ్యారు. ఈ ఈవెంట్ కోసం ముంబైలోని ప్రముఖ మెహతా జ్యువెలర్స్ నుండి రూ. 66 లక్షల విలువైన ఎమరాల్డ్ స్టోన్ డైమండ్ గోల్డ్ ఈరింగ్స్, అలాగే ప్రఖ్యాత గోయెంకా జ్యువెలర్స్ నుండి రూ. 69 లక్షల విలువైన జాంబియన్ ఎమరాల్డ్ స్టోన్ గోల్డ్ బోర్డర్డ్ ఈరింగ్స్‌ను ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్నారు. ఈ రెండు అత్యంత ఖరీదైన జుమ్మీల బాక్సులను రియా కపూర్ వద్ద గత 7 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ తన పర్సనల్ హ్యాండ్‌బ్యాగ్‌లో భద్రపరుచుకున్నారు. హోటల్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత మెట్ గాలా ట్రయల్స్ కోసం మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ తన హ్యాండ్‌బ్యాగ్ తెరిచి, మరో టీమ్ మెంబర్ షిరీన్‌కు ఇచ్చేందుకు జ్యువెలరీ బాక్సులను బయటకు తీశారు. అయితే ఆ బాక్సులను తెరిచి చూడగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్. ఆ రెండు జ్యువెలరీ బాక్సులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి! రూ. 1.35 కోట్ల విలువైన ఆ రెండు జంటల వజ్రాల జుమ్మీలు అందులో లేవు. Also read: Kiran abbavaram: కిరణ్ అబ్బవరం స్పీచ్ వైరల్ న్యూయార్క్‌లో ఉండగానే ఈ దొంగతనం గుర్తించినప్పటికీ, టీమ్ అంతా ముంబై తిరిగి వచ్చిన తర్వాతే దీనిపై అధికారికంగా పోలీసులకి  ఫిర్యాదు చేశారు. మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఫిర్యాదు మేరకు ముంబైలోని సహార్ పోలీస్ స్టేషన్ అధికారులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 303(2) కింద దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంతకీ ఈ భారీ చోరీ ఎక్కడ జరిగింది అనే కోణంలో పోలీసులు తలమునకలవుతున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందా? లేక దుబాయ్ లేఓవర్‌లో ఫ్లైట్ మారే సమయంలో జరిగిందా? లేక న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్ మరియు హోటల్ మార్గంలో జరిగిందా? అనే మూడు ప్రధాన అనుమానాస్పద సమయాలపై (టైమ్‌లైన్స్) పోలీసులు ఫోకస్ పెట్టారు. సిసిటివి ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తూ, టీమ్‌తో పాటు ప్రయాణించిన ఇతరుల వివరాలను కూడా వెరిఫై చేస్తున్నారు. సెలబ్రిటీల హై ప్రొఫైల్ ప్రయాణంలో ఇంతటి భారీ మొత్తంలో విలువైన వజ్రాల నగలు మాయమవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనిల్ కపూర్ పెద్ద కుమార్తె సోనమ్ కపూర్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే.. మనిషి చేసే తప్పు.. శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు. సద్గుణాలు.. మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు. నిజమైన ధనవంతుడు.. పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు. అవకాశాలు.. మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. అపాత్ర దానం.. దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.   పొదుపు.. చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.
పిల్లలు మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఎక్కువగా వాడితే కళ్ళు దెబ్బతింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే నిజంగా కళ్ళకు హాని కలిగించేది స్క్రీన్ కాదు, దాన్ని ఉపయోగించే విధానమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, కంటి అలసటను తగ్గించే సులభమైన ఐ ఎక్సర్‌సైజులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు.  ముఖ్యంగా ఆహారంలో అన్నం, చపాతీకి సమానంగా లేక అంతకంటే ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండాలని ఆహార నిపుణులు కూడా చెబుతారు. అయితే ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల నేటికాలంలో కూరగాయల వినియోగం కూడా తగ్గింది.   కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా కూరగాయలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది , బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అయితే 5 రకాల కూరగాయలు ఉన్నాయి.  ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా.  ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుంటే.. పాలకూర.. పాలకూరను పోషకాల నిధిగా పరిగణిస్తారు. దీనిలో ఐరన్ , కాల్షియం, పీచుపదార్థం, విటమిన్లు ఎ, సి , కె సమృద్ధిగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల శరీరంలోని రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్రోకలి.. బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.  బ్రోకలీని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక అవసరమైన పోషకాలు లభిస్తాయి. క్యారెట్లు.. క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ A గా మార్చబడుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్యారెట్లను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా కూరగాయగా తినవచ్చు. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి , ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. సొరకాయ.. సొరకాయలో నీరు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని తేమగా ఉంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో సొరకాయను తినడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు.                              *రూపశ్రీ
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు , అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఎంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఆకలిని తీర్చడమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎనర్జీగా ఉండటానికి , అతిగా తినడాన్ని నివారించడానికి సహాయపడతాయి.  ఎలాంటి చింత లేకుండా  ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిళ్ల గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు.. వేయించిన శనగలు ఆరోగ్యకరమైన చిరుతిళ్లలో మొదటి  స్థానంలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.  వీటిని  తీసుకోవడం వల్ల కడుపు చాలా సేపటి వరకు నిండుగా ఉంటుంది, దీని కారణంగా పదేపదే ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి వేయించిన శనగలు స్నాక్స్ కోసం మంచి ఆప్షన్.   అంతేకాకుండా, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. మఖానా.. మఖానా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన చిరుతిండి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో  కాల్షియం, మెగ్నీషియం , యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు లభిస్తాయి.  లేతగా వేయించిన మఖానా తినడం వల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు , అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి , బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా చాలా మంచిది. తాజా పండ్లు.. పండ్లు సహజంగానే పోషకాల నిధి. ఆపిల్, అరటిపండు, జామ, బొప్పాయి , నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతాయి. పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది , శరీరం చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్.. బాదం, వాల్‌నట్స్, పిస్తా , జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ , అనేక విటమిన్లు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం శరీరానికి శక్తిని అందించి, ఆకలిని కూడా నియంత్రిస్తుంది.  వాల్‌నట్‌లు , బాదం పప్పులు ముఖ్యంగా మెదడు , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  వీటిని చిరుతిండిగా తినడం ద్వారా జంక్ ఫుడ్ తినే అలవాటును తగ్గించుకోవచ్చు. మొలకలు.. మొలకెత్తిన పెసలు, శనగలు , ఇతర పప్పుధాన్యాలలో ప్రోటీన్, పీచుపదార్థం , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత వాటిలోని పోషకాల పరిమాణం పెరగడం వల్ల అవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.  మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది , కండరాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.  శరీరం ఫిట్ గా ఉండాలని అనుకునే వారికి మొలకలు చాలా మంచివి. వేరుశనగలు.. వేరుశెనగలను పేదల బాదం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేరుశెనగలను పరిమితంగా తినడం వల్ల ఆకలి తగ్గి, శరీరానికి ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి , శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.                              *రూపశ్రీ.