ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, చివరాఖరుకు జరగనే జరిగింది. ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. మారో మూడు ఖాళీలు ఆశావహుల కోసం రిజర్వులో ఉంచారు. అయినా.. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు సహజంగానే భగ్గుమన్నారు. రాజీనామా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే.. ప్రస్తుత్తానికి అలాంటి ముప్పేమీ లేదని బుజ్జగింపులతో అంతా సర్దుకుందని పార్టీ వర్గాల సమాచారం. అలాగే.. ఇంకా చిన్న చిన్న పొరపొచ్చాలు మిగిలి ఉన్నా.. అధిష్టానం జోక్యంతో అన్నీ సర్డుకుంటాయని మంత్రివర్గ విస్త’రణం’ సృష్టించిన సంక్షోభం టీ కప్పులో తుపానులe సమసి పోతుందని కాంగ్రెస్ పెద్దలు విశ్వాసంతో ఉన్నారు.
అయితే.. ఇతరుల విషయం ఎలా ఉన్నా, మంత్రి పదవి కోసమే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటూ కాంగ్రెస్, బీజేపీ గోడలు దూకిన కోమటి రెడ్డి, మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని, హైదరాబాద్ రంగా రెడ్డి జిల్లాల ప్రాతినిధ్యం కోసం చాలా కాలంగా గొంతు విప్పి మాట్లాడుతున్న మల్ రెడ్డి రంగా రెడ్డి, అలాగే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కొంచెం గట్టిగానే అసంతృప్తిని వ్యక్త పరిచారు. ముగ్గురికి ముగ్గురూ రాజీనామా ఆస్త్రాన్ని సందించారు. అయితే.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవ హారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఒకరిద్దరు మంత్రులు రంగంలోకి దిగి, ఎవరికి చెప్పాల్సిన మాట వారికి చెప్పి బుజ్జగించారు. ఆ విధంగా ప్రస్తుతానికి అయితే.. ఆల్ ఈజ్ వెల్ అన్నట్లు అంతా బాగుందనే పిక్చర్ ఇచ్చారు.
అయితే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుందా.. మంత్రి వర్గ విస్తరణ సృష్టించిన సంక్షోభం నిజంగానే టీ కప్పులో తుపానులా సమసి పోయిందా? పోతుందా? అంటే.. లేదు. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అంత సులభంగా చల్లారదు. నిత్యాగ్ని హోత్రంలా నిత్యం రగులుతూనే ఉంటుందని పార్టీ పుట్టు పూర్వోత్తరాలు అవపోసన పట్టిన సీనియర్ పాత్రికేయులు అంటున్నారు. ముఖ్యంగా.. రాహుల్ గాంధీ కులగణన జెండా ఎత్తిన నేపధ్యంలో పార్టీలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ముందు ముందు మరింతగా మారి పోవచ్చని అంటున్నారు. ఇంత వరకు పార్టీలో కొనసాగుతున్న అగ్రకుల ఆధిపత్యానికి గండి పడే సంకేతాలు కనిపిస్తున్న నేపధ్యంలో.. రెడ్డి, వెలమ ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తి అంత తేలిగ్గాచల్లారక పోవచ్చని అంటున్నారు. మరోవంక త్వరలో చేపట్టే క్యాబినెట్ విస్తరణలో మరో మూడు మంత్రి పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అందులో ఒకటి రాష్ట్ర జనభాలోనే 40 శాతం పైగా ఉన్న, రాష్ట్ర ఆదాయంలో ఇంచుమించుగా సగం వాటా ఇస్తున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు కన్ఫర్మ్ చేస్తు న్నట్లు చెప్పారు.
అయితే.. పీసీసీ చీఫ్ త్వరలోనే మరో మంత్రి వర్గ విస్తరణని హామీ ఇస్తున్నా.. సంవత్సరంన్నరగా సాగుతున్న. విస్తరణ ప్రహసనం, ప్రస్తుత అనుభవాల దృష్ట్యా.. ఇప్పట్లో మరో విస్తరణ ఉండక పోవచ్చని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. అదీ గాక.. ఒక వేళ పీసీసీ చీఫ్ చెప్పినట్లుగానే త్వరలో’ మంత్రి వర్గ విస్తరణ ఉన్నా.. సీరియస్ గా మంత్రి పదవి ఆశిస్తున్న ముగ్గురూ, సుదర్శన్ రెడ్డి, రాజ గోపాల రెడ్డి, మల్రెడ్డి రంగా రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. ముగ్గురిలో ఇద్దరికి మొండి చేయి తప్పదని అంటున్నారు. ఈ నేపధ్యంలో, భంగపాటుకు గురైన వారిలో ఎవరేమి చేస్తారు, ముఖ్యంగా హోం మంత్రి కావాలని కలలు కన్న రాజగోపాల రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.
అదలా ఉంటే మంత్రి వర్గ విస్తరణ ఆశావహులనే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా, కొందరు ముఖ్య నాయకులకు కూడా రుచించలేదని, అంటున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక్కొక కులం నుంచి ఒక్కొకరు చొప్పున ప్రతిపాదించిన ఆరేడు పేర్లలో ఒక్కరికీ బెర్త దక్కలేదని అంటున్నారు. ముఖ్యంగా, సుదర్శన్ రెడ్డి ఒక్కరికన్నా అవకాశం ఇవ్వాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి క్షణం వరకు గట్టి ప్రయత్నాలు చేశారని, అయినా అధిష్టానం నో చెప్పిందంటున్నారు. అందుకే ప్రస్తుతానికి, ఆశావహులతో పాటుగా, ముఖ్య నేతలు రాజీ పడినా, భవిష్యత్ లో పరిస్థితులు ఎలా మారాతాయో చెప్పలేమని అంటున్నారు.