కాశీ కబుర్లు -  8


గంగా తీరంలో స్నాన ఘట్టాలు

                                                                                             

వారణాసిలో గంగానది ఒడ్డను షుమారు 100 ఘాట్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటువి.  ఉదాహరణకు "శివాలా ఘాట్" మరియు "కాళీ ఘాట్"లు కాశీ మహారాజువి.  కొన్ని ఘాట్‌లు పురాణ గాధలతో ముడివడి ఉన్నాయి.  

                                                                                                                                                పావన గంగా నదీ తీరాన వరుణా ఘాట్ నుంచీ అస్సిఘాట్ వరకు (ఈ రెండు నదుల మధ్య ప్రదేశమే వారణాసి) 64 ముఖ్యమైన స్నాన ఘాట్లు వున్నాయి.    యాత్రీకుల సౌకర్యార్ధం పడవల వారు ఈ  స్నాన ఘాట్లని చూపిస్తూ, మధ్యలో కొన్ని ముఖ్యమైన చోట స్నానానికి సమయమిస్తూ తిప్పుతారు.   డబ్బు ప్రయాణీకుల సంఖ్యమీద, వారి బేరం చేసే సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది.  అన్నట్లు ఈ బోట్లవాళ్ళు మీరుండే వసతిగృహాలవాళ్ళకీ తెలిసినవాళ్ళుంటారు. కొత్తగా వెళ్ళి మనంతట మనం బేరాలాడకుండా వాళ్ళద్వారా వెళ్తే నమ్మకంగా వుంటుందనుకుంటే వాళ్ళు పిలిపిస్తారు. మీరు మాట్లాడుకోవచ్చు.  మేము ముగ్గురం  ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 12-30 దాకా ఒక బోట్ లో తిరిగాం, మధ్యలో మణికర్ణికలో మాత్రం ఆగాము.  దానికి 250 రూ. తీసుకున్నాడు.  (మా వసతి గృహంవాళ్ళద్వారానే వెళ్ళాము).

 

సాధారణంగా ప్రయాణీకులు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో ఈ ఘాట్ ల సౌందర్యం తిలకించటానికి ఇష్టపడతారుగనుక ఆ సమయంలో రేటు కొంచెం ఎక్కువ వుండవచ్చు.  

 

గంగానదిమీద పడవ షికారుకి తప్పక వెళ్ళండి.  అన్ని ఘాట్లూ బోట్ లోంచి చూడవచ్చు. బోట్ లో వెళ్ళేవాళ్ళకి తెలిసేటట్లు అన్ని ఘాట్ల పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి వుంటాయి.   ఇలా బోట్ లో వెళ్ళేటప్పుడు బోటతను మధ్యలో ఆపి డబ్బులడుగుతాడు, రాములవారు అక్కడే నది దాటారనీ,ఆయనని తలచుకుని అక్కడ దానమిస్తే పుణ్యమనీ.  బయల్దేరగానే అలా పడవ మధ్యలో ఆపి డబ్బులు  అడిగేసరికి మాకు కోపం వచ్చి ఇవ్వలేదు.  దాంతో అతనికి చాలా కోపం వచ్చి, ముందంతా అన్నీ చెప్పినవాడు తర్వాత ఏమీ చెప్పలేదు.  ఇలాంటి సమయాల్లో ఏం చేస్తారో మీ ఇష్టం.  పుణ్యక్షేత్రానికి వెళ్ళారు కనుక ఎంతో కొంత ఇచ్చేయచ్చు.  వాళ్ళు అల్ప సంతోషులు, పైగా బీదవారు. పది రూపాయలిచ్చినా సంతోషిస్తారు.   అనుభవంతో మాకు తెలిసిందిది.  గంగానదిమీద పడవ షికారుకి తప్పక వెళ్ళండి.  అన్ని ఘాట్లూ బోట్ లోంచి చూడవచ్చు.  వీలయితే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో మెట్లమీదకూర్చుని సమయం గడపవచ్చు.  బాగుంటుంది. 

 



ఎక్కువమంది  యాత్రీకులు మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచ గంగలలో స్నానం చెయ్యటానికి ఆసక్తి చూపిస్తారు.  వీటిని గురించి కొంచెం వివరంగా........

మణికర్ణికా ఘాట్
పూర్వం మహా విష్ణు తన చక్రంతో ఒక సరస్సు తవ్వి దాని ఒడ్డున మహా శివునికోసం తపస్సు చేశాడు.  శివుడు ప్రత్యక్షమై, విష్ణువుయొక్క తపస్సుని మెచ్చుకుంటూ తలాడించాడట.  అంతే..ఆయన చెవికున్న మణి కుండలం జారి ఆ తటాకంలో పడింది.  సాక్షాత్తూ ఆ మహా ప్రభువు ధరించిన చెవి కుండలం పడిన తటాకం మణకర్ణికా ఘాట్ అయింది.  తరువాత కాలంలో గంగానది ఆ తటాకం మీదనుంచి ప్రవహించిందని కొందరంటారు.  ఈ ఘాట్ లో మెట్లు ఎక్కి పైకి వెళ్తే అక్కడ నలువైపులా రాళ్లతో కట్టబడిన పుష్కరిణి ఒకటి వున్నది.  అదే మహా విష్ణువు చక్రంతో తవ్విన తటాకమని కొందరంటారు.

 

ముందు గంగానదిలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి పైకి వెళ్ళి ఆ కుండంలో స్నానం చేసి, మళ్ళీ వచ్చి మణికర్ణికా ఘాట్ లో స్నానం చెయ్యాలని మేము వెళ్ళిన బోటు అతను చెప్పాడు.  ఇంకో విశేషమేమిటంటే ఈ ఘాట్ లో స్నానం చెయ్యటానికి మధ్యాహ్నం 12 గం. లకు సకల దేవతలూ వస్తారుట.  అందుకని ఆ సమయంలో అక్కడ స్నానం చెయ్యటం చాలా మంచిది అని చెప్తారు.  గంగలో నీరు మాత్రం .. కళ్ళు మూసుకుని స్నానం చెయ్యాల్సిందే.

ఒడ్డున చిన్న చిన్న దేవాలయాలు వున్నాయి.  ఇక్కడ పితృకార్యాలు చేస్తారు. 

దశాశ్వమేధ ఘాట్
ఇక్కడ బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేశాడుట. అందుకే ఆ పేరు.  ఈ ఘాట్ యాత్రీకులతో ఎప్పుడూ సందడిగా వుంటుంది.  రోజూ సాయంసమయంలో ఇక్కడ గంగ హారతి ఇస్తారు.

 

హరిశ్చంద్ర ఘాట్
హరిశ్చంద్రుడు కాటికాపరిగా చేసింది ఇక్కడే.  ఇక్కడ శవదహనాలు ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి.  దీని ప్రక్కనే కేదార్ ఘాట్.

 

కేదార్ ఘాట్
ఈ ఒడ్డునే కేదారేశ్వర మందిరం వున్నది,  ఈ ప్రాంతంలో తెలుగువారు ఎక్కువ వుంటారు.  ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు గంగ ఒడ్డుకెళ్ళి చూడండి.  అక్కడ ఒక చిన్న గదిలో పెద్ద శివలింగం వుంటుంది.  అది హరిశ్చంద్రుడు ప్రతిష్ట చేసిన లింగమట.

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Kashi Yatra